ఇల్లంతకుంట రూరల్, మార్చి 14: “ఎమ్మెల్యే సారూ.. మీకు రైతులంటే ఎందుకంత చిన్నచూపు.. కాలువ నిర్మించి సాగునీళ్లివ్వాలని 32 రోజుల నుంచి ఎర్రటి ఎండలో రిలే దీక్ష చేస్తుంటే మీకు నవ్వొస్తుందా..” అంటూ పలువురు రైతులు మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామంలో వైద్య శిబిరం ప్రారంభోత్సవానికి తాము దీక్ష చేస్తున్న శిబిరం ముందునుంచే ఎమ్మెల్యే తన కాన్వాయ్తో వెళ్లారే గానీ.. శిబిరం వద్ద వాహనం నిలుపలేదన్నారు. “మమ్మల్ని పలుకరించేంత ఓపిక లేదా” అని ఆవేదన చెందారు. సాగునీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి.. కాలువ నిర్మించాలని కోరితే ఎమ్మెల్యే ప్రెస్మీట్లో ఎవరో కుక్కలు కూర్చోబెడితే దీక్షలో చేస్తున్నారంటూ అవమానించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.
తాము దీక్ష చేస్తున్న శిబిరం వద్ద పోలీసు బందోబస్తు పెట్టించాల్సిన అవసరం ఏముందని మండిపడ్డారు. తాము ఏమైనా ఉగ్రవాదులలెక్క కనిపిస్తున్నామా? అని ఆగ్రహించారు. ప్రభుత్వం నుంచి నిజంగానే నిధులు మంజూరు చేయించి ఉంటే ఎమ్మెల్యే నిజాయితీగా రైతుల ముందుకొచ్చి జరుగబోయే అంశాల మీద వివరణ ఇచ్చి ఉండేవారన్నారు. గతేడాది ఎమ్మెల్యే మాటలు నమ్మి మోసపోయామని.. ఇప్పుడు కూడా మోసపోలేమన్నారు. తమను కించపరిచేలా మాట్లాడుతున్న ఎమ్మెల్యే వెంటనే రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కాలువ పనులు ప్రారంభించేంత వరకు దీక్ష కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.