Karimnagar | ముకరంపుర, జులై 17 : యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విద్యుత్ ఉద్యోగులు చేస్తున్న నిరసన శుక్రవారం నాటికి ఎనిమిదో రోజుకు చేరింది. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ (TG PE JAC) ఆధ్వర్యంలో ఎన్పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ కార్యాలయ ఉద్యోగులతో పాటు ట్రాన్స్ కో జోనల్ కార్యాలయ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ పవర్ ప్లాంట్ లోని కోల్, యాష్ హ్యాండ్లింగ్ విభాగాలను యూనిట్లను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు ప్రభుత్వం టెండర్ల ప్రక్రియ చేపట్టిందని పేర్కొన్నారు.
ప్రభుత్వ నిర్వహణలో ఉన్న ప్లాంటును ప్రైవేట్ వ్యక్తుల కు అప్పగించడం వల్ల అనేక ఇబ్బందులు తలెత్తుతాయని జేఏసీ నాయకులు తెలిపారు. ముఖ్యంగా ఉద్యోగుల తో పాటు పవర్ ప్లాంటుపై ఆధారపడిన ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లేకుండా పోతాయని తెలిపారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మహేందర్ రావు, శ్రీనివాస్, రాజు, సంపత్ కుమార్, సంతోష్, శ్యామయ్య, రంగు వెంకటనారాయణ, శ్రీమతి, నిఖిల్, విద్యుత్ ఉద్యోగులు పాల్గొన్నారు.