కలెక్టరేట్, అక్టోబర్ 9 : అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘం నిబంధనలు పాటించాలని కరీంనగర్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బీ గోపి స్పష్టం చేశారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను కఠినంగా అమలు చేస్తామని చెప్పారు. తనిఖీ బృందాల పర్యవేక్షణ మొదలైందని, ఫిర్యాదుల కోసం సివిజిల్ యాపు ఏర్పాటు చేశామని తెలిపారు. సోమవారం రాత్రి విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. రాజకీయ పార్టీలు, సాధారణ ప్రజలు ఎన్నికల కోడ్ ముగిసే వరకు వ్యవహరించాల్సిన తీరును వివరించారు. ఎన్నికల నియమావళిని కఠినంగా అమలు చేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు స్పష్టం చేశారు. షెడ్యూల్ వెలువడిన సమయం నుంచే జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 14 ఫ్లయింగ్ స్కాడ్, 14 స్టాటిస్టిక్స్ సర్వేవ్లెన్స్, 9 వీడియో సర్వేవ్లెన్స్, 5 వీడియో వ్యూయింగ్, 19 మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ బృందాల విధుల నిర్వహణ ప్రారంభమైనట్లు తెలిపారు. ఎన్నికల కమిషన్ సూచించిన నిబంధనల మేరకు మాత్రమే రాజకీయ పార్టీలు వ్యవహరించాల్సి ఉంటుందన్నారు.
జిల్లాలో ఈనెల 4న విడుదల చేసిన ఓటర్ల తుది జాబితా ప్రకారం 10,34,186 మంది ఓటర్లు ఉండగా, వారందరి కోసం జిల్లా వ్యాప్తంగా 1338 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వీరంతా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవసరమైన ఈవీఎంలు, వీవీప్యాట్లు అందుబాటులో ఉంచడంతో పాటు, ఇప్పటికే మొదటి విడుత తనిఖీ కూడా పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ప్రధానంగా నగదు లావాదేవీలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్ సూచించిన మేరకు మాత్రమే ప్రతి రోజూ ఆర్థిక లావాదేవీలు నిర్వహించాల్సి ఉంటుందని, ప్రతి ఒక్కరి ఖాతాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు వివరించారు. ప్రధానంగా అభ్యర్థులు, వారి అనుచరుల బ్యాంకు ఖాతాలు, ఆన్లైన్ లావాదేవీలపై లీడ్ బ్యాంక్ మేనేజర్ ద్వారా నిఘా ఏర్పాటు చేయనున్నామన్నారు.
సాధారణ ప్రజల అవసరాల కోసం, డబ్బుల వినియోగంపై పరిశీలించేందుకు డీఆర్డీవో ఆధ్వర్యంలో జిల్లా సహకార అధికారి, జిల్లా కోశాధికారి సమన్వయంతో ప్రత్యేక కమిటీ పనిచేస్తుందన్నారు. సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలు, అభ్యర్థులు చేసుకునే ప్రచారంపై ప్రత్యేక మానిటరింగ్ కమిటీ పనిచేస్తుందని, ఈ కమిటీ నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటుందని చెప్పారు. అలాగే, ప్రచార అంశాలు గమనిస్తే వాటిని అభ్యర్థుల ఖర్చులో జమ చేయనున్నట్లు స్పష్టం చేశారు. ప్రచార పత్రాలపైనా ప్రింటింగ్ ప్రెస్ల పేరు ఖచ్చితంగా ఉండాలని సూచించారు. ఎన్నికలకు సంబంధించి పూర్తి సమాచారం ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజెప్పేందుకు మీడియా సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
జిల్లావ్యాప్త సమాచారం కోసం ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించే వారిపై ఫిర్యాదు చేసేందుకు 1950 హెల్ప్లైన్ నెంబర్ వినియోగించవచ్చన్నారు. అలాగే, సీ విజిల్ యాప్తో కూడా ఎలాంటి ఫిర్యాదునైనా నమోదు చేయవచ్చన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, రాజకీయ పార్టీలు తమ ప్రచారం కోసం ఈ సువిధ యాప్ ద్వారా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని సూచించారు. కోడ్ ప్రారంభమైన దృష్ట్యా రాజకీయ పార్టీలు వ్యవహరించాల్సిన తీరుపై అవగాహన కల్పించేందుకు మంగళవారం రాజకీయ పార్టీల నాయకులకు సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పోలీస్ కమిషనర్ ఎల్ సుబ్బారాయుడు జిల్లాలో 5 చెక్పోస్టులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అనుమతుల్లేని ఆయుధాలు సీజ్ చేస్తామని, లైసెన్సు ఆయుధాలు సంబంధిత వ్యక్తులు వెంటనే ఆయా పోలీస్ స్టేషన్లలో డిపాజిట్ చేయాలని సూచించారు. ఈ సమావేశంలో డీఐజీ రమేశ్నాయుడు పాల్గొన్నారు.