రాష్ట్ర ప్రభుత్వం అత్యంత మానవీయ కోణంతో చేపట్టిన ‘కంటి వెలుగు’ ఎందరో నిరుపేదల కళ్లకు వెలుగులు నింపుతున్నది. రెండో విడుత ప్రారంభించి గురువారం వరకు దాదాపు 85 రోజులు గడుస్తుండగా, ప్రతి చోటా అనూహ్య స్పందన వస్తున్నది. ఒక్కో శిబిరానికి పదుల సంఖ్యలో వచ్చి ప్రభుత్వం అందిస్తున్న సేవలను వినియోగించుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు 154 బృందాల ద్వారా 1667 శిబిరాలు నిర్వహించి 17,65,167 మందిని పరీక్షించారు. అందులో 6,08,484 మందికి కంటి సమస్యలు ఉన్నట్లు గుర్తించి, 3,00,301 మందికి అవసరమైన రీడింగ్ అద్దాలు ఇచ్చారు. 2,56,225 మందికి అవసరమైన ప్రిస్క్రిప్షన్ అద్దాలకు ఆర్డర్ ఇచ్చి 2,16,887 మందికి పంపిణీ చేశారు.
– కరీంనగర్, మే 25 (నమస్తే తెలంగాణ)
ఆపరేషన్ జేసిన్రు.. మంచిగ కనిపిత్తన్నయ్
నాకు 70ఏండ్లు ఉంటయ్. మొన్నటిదాకా కండ్లు మంచిగ కనపడలె. నా కొడుకు కూలీనాలీ చేస్తడు. వాన్ని ఇబ్బంది పెట్టద్దని ప్రైవేట్ దవాఖానకు పోలె. మస్తు గోస పడ్డ. గింతల్నె కేసీఆర్ సార్ దయ వల్ల మా ఊరికి కండ్ల పరీచ్చలు చేసేటోళ్లు అచ్చిన్రు పైసలు లేకుండా పరీచ్చ చేత్తరట అంటే పోయిన. అక్కడ నాకు కండ్ల పరీచ్చ చేసిన్రు. నీకు కంటి ఆపరేషన్ చేయాలని చెప్పిన్రు. పైసా ఖర్చు లేకుండా గవర్నమెంటే చేత్తదని అన్నరు. కరీంనగర్కు పోయి కండ్ల ఆపరేషన్ చేయించుకో అని 20 రోజుల కింద ఆశ కార్యకర్త మా ఇంటికచ్చి జెప్పింది. అట్లనే కరీంనగర్కు పోతే అక్కడ నాకు కండ్ల ఆపరేషన్ చేసిన్రు. కండ్లు మంచిగ కనిపిత్తనయ్. నాకు ఆపరేషన్ చేయించిన కేసీఆర్ సార్కు రుణ పడి ఉంట.
– నాగవెల్లి లక్ష్మి, వృద్ధురాలు (ఓదెల)
కరీంనగర్, మే 25 (నమస్తే తెలంగాణ) : సీఎం కేసీఆర్ ప్రవేశ పెడుతున్న ప్రతి పథకం, కార్యక్రమంలో మానవీయ కోణం కనిపిస్తున్నది. ‘కంటి వెలుగు’ కూడా ఇలాంటిదే. కంటి జబ్బులు తీవ్రంగా వేధిస్తున్న ఈ రోజుల్లో వాటిని పట్టించుకోక చూపు కోల్పోయే పరిస్థితి తెచ్చుకుంటున్న వాళ్లు ఎందరో ఉన్నారు. వైద్య ఖర్చులు లేక, దవాఖానల చుట్టూ తిరిగే సమయం దొరకకపోవడం వంటి కారణాలతో చాలా మంది కంటి జబ్బులను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమం ఉమ్మడి జిల్లాలో వేలాది మందికి కంటి చూపును ప్రసాదిస్తున్నది. ముఖ్యంగా అరవై ఏండ్ల్లు పైబడిన వృద్ధులకు కంటి వెలుగు ఒక వరంగా మారిందని చెప్పవచ్చు.
గ్రామీణ, పట్టణ ప్రాంతాలనే తేడా లేకుండా అన్నిచోట్లా ప్రజల వద్దకే వెళ్లి కంటి పరీక్షలు చేస్తున్నారు. అవసరమైన మందులు, కళ్లద్దాలే కాకుండా తీవ్రమైన జబ్బులు ఉంటే శస్త్ర చికిత్సలకు సిఫారసు చేస్తున్నారు. 2018 ఆగస్టు 15 నుంచి 2019 ఫిబ్రవరి 22 వరకు మొదటి విడుత కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. తద్వారా వేలాది మంది నిరుపేదలకు కంటి వెలుగు లభించింది. వివిధ రకాల కంటి సమస్యలకు చికిత్స లభించింది. ఈ స్ఫూర్తితోనే ఈ ఏడాది జనవరి 18న రెండో విడుత ప్రారంభించగా, ఇప్పటికి 85 రోజులుగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు గ్రామాలు, పట్టణాల్లో నిర్వహిస్తున్న శిబిరాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. జబ్బు ఉన్నట్టు గుర్తిస్తే అవసరమైన మందులు ఇస్తున్నారు. రీడింగ్ అద్దాలు అవసరమైతే అప్పటికప్పుడే ఇస్తున్నారు. దూరం, దగ్గరి చూపు లోపాలు ఉన్నవారికి ప్రిస్క్రిప్షన్ అద్దాలను ఆర్డర్ ఇచ్చి తెప్పించి ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంల ద్వారా పంపిణీ చేస్తున్నారు.
పెద్దపల్లి జిల్లాలో రెండో విడుత కంటి వెలుగు సేవలు గురువారం నాటికి 85 రోజులు గడిచాయి. 34 బృందాల ద్వారా సేవలు అందిస్తున్నారు. ఇప్పటి వరకు 391 శిబిరాలు నిర్వహించి 3,84,031 మందిని పరీక్షించారు. ఇందులో 1,89,871 మందికి కంటి సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటి వరకు 90,204 మందికి అవసరమైన రీడింగ్ అద్దాలు ఇచ్చారు. 47,710 మందికి అవసరమైన ప్రిస్క్రిప్షన్ అద్దాలకు ఆర్డర్ ఇచ్చారు. ఇందులో ఇప్పటి వరకు 36,653 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాలు పంపిణీ చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెండో విడుత కంటి వెలుగు సేవలకు గురువారం నాటికి 85 రోజులు గడిచాయి. 26 బృందాల ద్వారా సేవలు అందిస్తున్నారు. ఇప్పటి వరకు 350 శిబిరాలు నిర్వహించి 3,10,649 మందిని పరీక్షించారు. ఇందులో 91,815 మందికి కంటి సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటి వరకు 49,525 మందికి అవసరమైన రీడింగ్ అద్దాలు ఇచ్చారు. 42,290 మందికి అవసరమైన ప్రిస్క్రిప్షన్ అద్దాలకు ఆర్డర్ ఇచ్చారు. ఇందులో ఇప్పటి వరకు 42,222 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాలు పంపిణీ చేశారు.
జగిత్యాల జిల్లాలో రెండో విడుత కంటి వెలుగు సేవలకు గురువారం నాటికి 85 రోజులు గడిచాయి. 46 బృందాల ద్వారా సేవలు అందిస్తున్నారు. ఇప్పటి వరకు 481 శిబిరాలు నిర్వహించి 6,03,641 మందిని పరీక్షించారు. ఇందులో 1,75,136 మందికి కంటి సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటి వరకు 75,358 మందికి అవసరమైన రీడింగ్ అద్దాలు ఇచ్చారు. 99,778 మందికి అవసరమైన ప్రిస్క్రిప్షన్ అద్దాలకు ఆర్డర్ ఇచ్చారు. ఇందులో ఇప్పటి వరకు 84,154 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాలు పంపిణీ చేశారు.
కరీంనగర్ జిల్లాలో రెండో విడుత కంటి వెలుగు సేవలకు గురువారం నాటికి 85 రోజులు గడిచాయి. 48 బృందాల ద్వారా సేవలు అందిస్తున్నారు. ఇప్పటి వరకు 445 శిబిరాలు నిర్వహించి 4,66,846 మందిని పరీక్షించారు. ఇందులో 1,51,662 మందికి కంటి సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటి వరకు 85,214 మందికి అవసరమైన రీడింగ్ అద్దాలు ఇచ్చారు. 66,447 మందికి అవసరమైన ప్రిస్క్రిప్షన్ అద్దాలకు ఆర్డర్ ఇచ్చారు. ఇందులో ఇప్పటి వరకు 53,858 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాలు పంపిణీ చేశారు.
అనూహ్య స్పందన
కంటి వెలుగు కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తున్నది. ఇంటి ముంగిటికే వచ్చి ప్రభుత్వ వైద్యులు కంటి పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో కంటి సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ప్రైవేట్ దవాఖానల్లో చూపించుకుంటే వందలకొద్ది ఫీజు, వేల కొద్ది ఖర్చవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అందిస్తున్న ఉచిత సేవలు నిరుపేదలకు వరంలా మారింది. రెండో విడుత కార్యక్రమం ప్రారంభించి 85 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ శిబిరాలకు రోజుకు పదుల సంఖ్యలో ప్రజలు వెళ్లి కంటి పరీక్షలు చేయించుకుంటున్నారు. శిబిరాలు ఏర్పాటు చేసిన ప్రాంతంలో ఆశ కారకర్తలు, ఏఎన్ఎంలు ఇతర వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి మోటివేట్ చేస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వైద్యాధికారులు, సిబ్బంది ఓపికతో సేవలు అందిస్తున్నారు. ప్రైవేట్ దవాఖానలకు దీటుగా కంటి వెలుగు శిబిరాలకు తాకిడి ఉంటున్నది. చెప్పాలంటే ప్రైవేట్ కంటి దవాఖానల్లో ఓపీ గణనీయంగా తగ్గినట్లు తెలుస్తున్నది. గతంలో ఏ కంటి దవాఖానలో చూసినా రోగులు బారులు తీరి కనిపించేది. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. అవసరమైన వారికి మందులు, కళ్ల అద్దాలు ఉచితంగా అందిస్తున్న నేపథ్యంలో కళ్ల అద్దాల దుకాణాలకు కూడా గిరాకీ తగ్గింది. ప్రభుత్వం అందిస్తున్న కంటి వెలుగు సేవలను ప్రతి ఒక్కరూ కొనియాడుతున్నారు.
అద్దాలు మంచిగున్నయ్
మాది ఇల్లంతకుంట మండలం వెల్జీపూర్. లారీడ్రైవర్గా పనిచేస్తున్న. కొన్ని రోజుల నుంచి దగ్గరి చూపు కనిపిస్త లేదు. పేపర్ చదువుదామన్న అక్షరాలు కానరావడం లేదు. ఎప్పుడు టూర్లు పోతున్న నాకు పరీక్షలు చేయించుకుందామన్నా టైం దొరుకుత లేదు. ఇయ్యాల్నే మా ఊరికొచ్చిన. ఇక్కడ కంటి వెలుగు శిబిరం నడుస్తుందంటే వచ్చి పరీక్షలు చేయించుకున్న. కంప్యూటర్ల చూసి అద్దాలు ఇచ్చిండ్రు. చాలా మంచిగున్నయ్. అక్షరాలు మంచిగ కనిపిస్తున్నయ్. కేసీఆర్ జెయ్యవట్టి ఊరూరికి కంటి పరీక్షలు చేస్తున్రు.
– సతీశ్, డ్రైవర్ వెల్జిపూర్
కండ్లు మంచిగ కనిపిత్తున్నయ్..
నాకు 80 ఏండ్లుంటయ్. నాకు మస్క, మస్కగ కనిపిత్తుండె. ఏంజేద్దామన్నా కండ్లు కనిపించయ్. చాన తక్లిబ్ అయితుండె. మా కొడుకు, కోడలు మీద ఆధారపడాలె. నాలుగు నెలల కింద మా ఊరికి కేసీఆర్ సార్ కండ్ల పరీక్షోళ్లను పంపించిండు. పంచాయతీ ఆఫీస్కు పోయి కండ్లను పరీక్ష చేయించుకున్న. అద్దాలు పనికి రావు ఆపరేషన్ చేయాలన్నరు. సర్కారే పైసలు తీసుకోకుండ చేపిత్తది అని చెప్పిన్రు. అప్పటి నుంచి చూత్తన్న. 20 రోజుల కింద కరీంనగర్ దవాఖాన్ల నాకు కంటి ఆపరేషన్ చేసిన్రు. గిప్పుడు కండ్లు మంచిగ కనిపిత్తునయ్. నా పని నేనే చేసుకునేటట్లు చేసిన కేసీఆర్ సారును సల్లంగ జూడాలని అల్లాను కోరుతున్న.
– యాకుబ్బీ, వృద్ధురాలు (ఓదెల)
ఇంటికొస్తున్న కంటి వెలుగు
కంటి వెలుగు కార్యక్రమాన్ని 100కు వంద శాతం విజయవంతం చేయాలనే ఆదేశాలు ఉండడంతో వైద్య ఆరోగ్య శాఖ ఆ దిశగా పనిచేస్తున్నది. ఎవరైతే కంటి వెలుగు శిబిరాలకు హాజరు కాలేని పరిస్థితుల్లో ఉంటారో అలాంటి వారి ఇంటికి నేరుగా వెళ్లి కంటి స్క్రీనింగ్ టెస్టులను చేసి అక్కడికక్కడే మందులను, కళ్ల అద్దాలను అందజేస్తున్నారు. ఒక్క పెద్దపల్లి జిల్లాలోనే ఇప్పటి వరకు దాదాపు 30 మంది ఇండ్లల్లోకి వెళ్లి బాధితులకు కంటి పరీక్షలు చేశారు.