వీణవంక, డిసెంబర్ 2: పేదల సంక్షేమానికి సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం 56 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు, ఏడుగురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని కొనియాడారు. 29 రాష్ర్టాల్లో కేవలం తెలంగాణలో మాత్రమే అభివృద్ధి, సంక్షేమం జరుగుతున్నదని తెలిపారు. ఆడబిడ్డల పెండ్లికి సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి పథకం ద్వారా రూ.లక్షా నూటపదహార్లు అందజేసి ఆదుకుంటున్నారని పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం 57 ఏళ్లు నిండిన వారికి పింఛన్ అందజేస్తున్న ఘనత సీఎం కేసీఆర్దేనని కొనియాడారు.
హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ గెలిచి ఏడాది పూర్తయినా ఒక్క అభివృద్ధి పని చేయకపోగా, పేదలకు చెక్కులు పంపిణీ చేస్తున్నామని సమాచారం ఇచ్చినా రాకపోవడం సిగ్గుచేటని అన్నారు. మోటర్లకు మీటర్లు పెట్టే బీజేపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. త్వరలోనే అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ వీణవంకకు వస్తారని, అభివృద్ధి ప్రదాతకు అండగా ఉండాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా ఉంటే మరింత అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. వీణవంకను రాబోయే రోజుల్లో జిల్లాలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. అంతకు ముందు మండల కేంద్రంలో గ్రామ దేవతల విగ్రహాల వద్ద ఎమ్మెల్సీ కౌశిక్రెడ్డి పూజలు చేశారు.
ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి, జడ్పీటీసీ మాడ వనమాల-సాధవరెడ్డి, సింగిల్విండో చైర్మన్ విజయభాస్కర్రెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు ఎక్కటి రఘుపాల్రెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్, తహసీల్దార్ రాజయ్య, ఆయా గ్రామాల సర్పంచులు నీల కుమారస్వామి, పోతుల నర్సయ్య, బండారి ముత్తయ్య, రమేశ్, మోరె సారయ్య, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు నాగిడి సంజీవరెడ్డి, ఎంపీటీసీలు రాంచందర్, మూల రజిత-పుల్లారెడ్డి, లక్ష్మీభూమయ్య, వీణవంక ఉపసర్పంచ్ భానుచందర్, నాయకులు మర్రి స్వామి, గిరిబాబు, దాసారపు లక్ష్మణ్, నీల పున్నం, బిక్షపతి, మహెందర్, కర్ర కొండల్రెడ్డి, తాండ్ర శంకర్ పాల్గొన్నారు.