ధర్మపురి/పెగడపల్లి, సెప్టెంబర్ 8 : ధర్మపురి క్షేత్ర అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని, రాబోయే రెండేళ్లలో టెంపుల్ సిటీగా మారుస్తామని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ధర్మపురి ఆలయ అనుబంధ శ్రీరామలింగేశ్వరాలయంలో మంత్రి సూచనల మేరకు ఆలయ రెనోవేషన్ కమిటీ సభ్యులు ఇందారపు రామన్న, సభ్యులు ప్రత్యేక చొరవతో భక్తుల నుంచి విరాళాలుగా సేకరించిన సుమారు రూ.50 లక్షలతో అభివృద్ధి పనులు పూర్తి చేయగా, గురువారం జడ్పీ చైర్పర్సన్ వసంతతో కలిసి మంత్రి ప్రారంభించారు. అంతకుముందు పెగడపల్లి మండల కేంద్రంలో 1,416 మందికి పింఛన్ మంజూరు పత్రాలు, 33 మందికి కల్యాణలక్ష్మి చెక్కులు అందజేసి, ఆయాచోట్ల ఈశ్వర్ మాట్లాడారు. ఇప్పటికే ఆలయ అభివృద్ధికి సీఎం కేసీఆర్ బడ్జెట్లో రూ.100కోట్లు కేటాయించారని, వీటికి తోడుగా రూ.25కోట్లు మున్సిపల్ నిధులు మంజూరైనట్లు చెప్పారు.
సీఎం కేసీఆర్ ధర్మపురిని సందర్శించిన సందర్భంలో మరో రూ.10కోట్లు ప్రకటించారని, ఇవీగాక సింగరేణి నిధులు రూ.6 కోట్లు వచ్చినట్లు వివరించారు. మున్సిపల్ అభివృద్ధి కోసం మరో రూ.25కోట్లు ఇవ్వాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్కు విన్నవించామని, మొత్తం రూ.166 కోట్లతో ధర్మపురి క్షేత్రాన్ని మోడల్గా మారుస్తామని స్పష్టం చేశారు. కాగా, అంతకుముందు ఆలయానికి చేరుకున్న మంత్రికి ఆలయ పండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ఆవరణలో గణపతి హోమం కార్యక్రమంలో పాల్గొన్నారు. రామలింగేశ్వర స్వామివారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు.
ఆసరాతో కొండంత అండ
రాష్ట్రంలోని బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఆసరా కొండంత అండగా నిలుస్తున్నదని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వృద్ధులు, దివ్యాంగులకు రూ.200, 500 పింఛన్ మాత్రమే ఇచ్చేవారని, అవి కుటుంబానికి ఏ మాత్రం చాలకపోయేవని, కానీ స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ రూ.2016, రూ.3016 పెంచి ఇస్తున్నారని చెప్పారు. దేశం లో మరే రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్రంలో సు మారు 48 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్న ఘన త సీఎం కేసీఆర్కే దక్కుతుందని చెప్పారు. అర్హులందరికీ కొత్త పింఛన్లు ఇస్తామని, ఎవరూ ఆం దోళన చెందవద్దని మంత్రి స్పష్టం చేశారు. 40 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్, గత ఎనిమిదేండ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పేదలు, రైతులకు చేసిందేమీ లేదని విమర్శించా రు. జడ్పీ చైర్పర్సన్ వసంత మాట్లాడుతూ.. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్, బీజేపీల కండ్లు మండుతున్నాయని, ఓర్వలేకనే అనేక కుట్రలు పన్నుతున్నాయని దుయ్యబట్టారు.
ఎవరెన్ని కుట్రలు పన్నినా ప్రజలంతా సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వెంటే ఉన్నార ని పేర్కొన్నారు. కాగా, నూతన పింఛన్ లబ్ధిదారులందరికీ మంత్రి దగ్గరుండి రాత్రి 9 గంటల వరకు మంజూరు పత్రాలు అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో ప్రముఖ పురాణ ప్రవచకులు బాచంపల్లి సంతోష్కుమార్శాస్త్రి, అదనపు కలెక్టర్ అరుణశ్రీ, ఆర్డీవో మాధురి, డీపీవో నరేశ్, డీసీఎమ్మెస్ చైర్మన్ శ్రీకాంత్రెడ్డి, ఎంపీపీ చిట్టిబాబు, జడ్పీటీసీలు బాధినేని రాజేందర్, బత్తిని అరుణ, మున్సిపల్ చైర్పర్సన్ సంగి సత్తెమ్మ, పెగడపల్లి ఎంపీపీ శోభ, జడ్పీటీసీ రాజేందర్రావు, ఎంపీడీవో పుల్లయ్య, తహసీల్దార్ కృష్ణచైతన్య, ఎంపీవో మహేందర్, విండో చైర్మన్లు భాస్కర్రెడ్డి, వేణుగోపాల్, వైస్ ఎంపీపీ గంగాధర్, ఆర్బీఎస్ అధ్యక్షుడు నరేందర్రెడ్డి, సర్పంచ్ శ్రీనివాస్, ఎంపీటీసీ జమున, సర్పంచులు, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు రాజేశ్వర్రావు, రవీందర్, కో-ఆప్షన్ సభ్యుడు రహీం ఉన్నారు.