ధర్మపురి నర్సన్న క్షేత్రంలో లక్ష్మీనరసింహుడి కల్యాణం నేత్రపర్వంగా జరిగింది. శనివారం సాయంత్రం వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల మధ్య వేడుక అంగరంగ వైభవంగా సాగింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉదయం కలెక్టర్ యాస్మిన్ బాషా, సాయంత్రం ఎంపీ వెంకటేశ్నేతకాని, మంత్రి కొప్పుల సతీమణి స్నేహలత, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత పట్టువస్ర్తాలు సమర్పించగా, కల్యాణాన్ని తిలకించేందుకు వేలాది మంది తరలివచ్చారు. మొక్కులు తీర్చుకొని స్వామి సేవలో తరలిరాగా, ఆలయ ప్రాంగణం అంతా “జయలక్ష్మీనారసింహ జయజయ నారసింహ” స్మరణలతో మార్మోగింది.
ధర్మపురి, మార్చి 4: మహిమాన్విత ధర్మపురి క్షేత్రంలో నర్సన్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీలక్ష్మీనారసింహ(యోగ,ఉగ్ర) కల్యాణ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. శనివారం సాయంత్రం 6 గంటలకు గోదూళి సముహూర్తాన పాంచరాత్రగమ శాస్త్ర పద్ధతిలో శాస్ర్తోక్తంగా శేషప్ప కళావేదికపై కనులపండువగా జరిపారు. శ్రీలక్ష్మీనారసింహ(యోగ,ఉగ్ర), శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులను పట్టు వస్ర్తాలు, బంగారు, ముత్యాల ఆభరణాలు, వివిధ రకాల పూలతో అలంకరించిన అర్చకస్వాములు శేషప్పకళావేదికపై అధిష్టించారు. స్వామి, అమ్మవార్లకు ప్రభుత్వం తరఫున ఉదయం కలెక్టర్ యాస్మిన్ బాషా అర్చక, రుత్విక బృందం సమక్షంలో పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలను అందించారు. సాయంత్రం ఎంపీ వెంకటేశ్ నేతకాని, మంత్రి ఈశ్వర్ సతీమణి స్నేహలత, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, అడిషనల్ కలెక్టర్ మకరంద్ పట్టువస్ర్తాలు, తలంబ్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న వీరికి ఆలయ సిబ్బంది మేళతాళాల మధ్య ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించిన స్వామివారికి సమర్పించారు. అలాగే, ధర్మపురి మున్సిపల్ పక్షాన కమిషనర్ రమేశ్ పట్టువస్ర్తాలు సమర్పించారు. అనంతరం సంప్రదాయరీతిలో విశ్వక్సేన ఆరాధనలతో కల్యాణ తంతు నిర్వహించగా, ‘జయలక్ష్మీనారసింహ జయజయ నారసింహ’ స్మరణలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. ఈ కార్యక్రమంలో ఎస్పీ భాస్కర్, డీఎస్పీ ప్రకాశ్, బుగ్గారం జడ్పీటీసీ రాజమణి, మంత్రి కూతురు నందిని, దేవస్థానం ఈవో సంకటాల శ్రీనివాస్, డీసీఎమ్మెస్ చైర్మన్ శ్రీకాంత్రెడ్డి, ఎంపీపీ ఎడ్ల చిట్టిబాబు, జడ్పీటీసీ బత్తిని అరుణ ఉన్నారు.
భక్తులకు అన్నదానం
కల్యాణానికి తరలివచ్చిన భక్తులకు క్షేత్రంలోని బ్రాహ్మణసంఘం భవనం, పాత టీటీడీ కల్యాణమండపంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ యాస్మిన్బాషా, మంత్రి ఈశ్వర్ కూతురు నందిని, ప్రజాప్రతినిధులు కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించి, భక్తులకు వడ్డించారు.
కలెక్టర్పై ప్రశంసల జల్లు..
కలెక్టర్ యాస్మిన్ బాషా మతానికి అతీతంగా స్వామివారి సన్నిధిలో పూజలు నిర్వహించారు. నుదుట గంధం, కుంకుమతో పాటు తలపాగా ధరించి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఏ మతానికి చెందిన వారైనా అన్ని మతాల మూల సిద్ధాంతం ఒక్కటేనని చాటిచెప్పారు. ఈ సందర్భంగా పలువురు కలెక్టర్పై ప్రశంసల జల్లు కురిపించారు.