అభివృద్ధి కావాలంటే నిధులు వెచ్చించాలి. రంగం ఏదైనా సరే లాభదాయకంగా మారాలన్నా.. దానిని నమ్ముకున్న వ్యక్తుల జీవితాల్లో వెలుగులు నిండాలన్నా కొంత ఇన్వెస్ట్ చేయాలి. ఒక కొడుకును విద్యావంతుడిని చేయాలంటే అతని చదువుకు కొంత ఇన్వెస్ట్ చేయాలి. తాను లాభపడుతూ, వేలాది మందికి ఉపాధి చూపాలంటే ఒక కంపెనీ పెట్టాలి. భూములు కొని లాభాలు చూడాలన్నా.. ఇలా ఏ రంగమైనా సరే ముందుగా పెట్టుబడి పెట్టాలి. ఆ తర్వాత దాని ద్వారా వచ్చే లాభాలు పొందాలి. ఇది చిన్న బేసిక్ సూత్రం. సగటు మనిషి ఆలోచన ఇలాగే ఉంటుంది.
కేసీఆర్ సర్కారు సైతం ఇలాగే కోట్లాది నిధులతో ప్రతి రంగాన్ని అభివృద్ధి చేసింది. విద్య, వైద్యాన్ని బలోపేతం చేసింది. విద్యుత్ రంగాన్ని సంస్కరించి నాణ్యమైన కరెంట్ అందించింది. అనేక ప్రాజెక్టులు నిర్మించి జలగోసను తీర్చి, భావితరాలకు తరగని ఆస్తిని సృష్టిస్తే, కొన్ని అధికార పార్టీలు కండ్లుమండించుకుంటున్నాయి. ఆయా రంగాల్లో జరిగిన అభివృద్ధిని చెప్పకుండా వ్యయాన్ని అప్పుగా చూపిస్తూ, జరుగుతున్న లాభాన్ని దాచిపెడుతూ కేసీఆర్ సర్కారును అభాసుపాలుచేస్తున్నాయి. ప్రగతిని తొక్కి పెడుతూ పెట్టుబడిని అప్పు అని ముద్రతో బద్నాం చేసేందుకు యత్నిస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతుండగా, సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కరీంనగర్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రంగం ఏదైనా సరే, అభివృద్ధి జరగాలంటే తప్పకుండా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఒక కొడుకును విద్యావంతుడిని చేయాలంటే అతనిపై పెట్టుబడి పెట్టాలి. అలాగే ఒక ఇల్లు నిర్మించుకోవాలన్నా, ఒక కంపెనీ లేదా కొత్త ఆఫీసు పెట్టాలన్నా, భూములు కొనాలన్నా.. ఇలా రంగం ఏదైనా సరే ముందుగా పెట్టుబడి పెట్టి, దాని ద్వారా వచ్చే ఫలాలను తిరిగి పొందాల్సి ఉంటుంది. కేసీఆర్ ప్రభుత్వం కూడా అదే చేసింది. ప్రజల కోసం వివిధ రంగాలపై వేలాది కోట్లు వెచ్చించి, అభివృద్ధిని ముందుకు నడిపింది.
ఫలితంగా ఆ ఫలాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. 2014కు ముందు ఉమ్మడి జిల్లాలో చూస్తే.. కేవలం 3.83 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి సాగయ్యేది. ప్రస్తుతం ఆ విస్తీర్ణం 12.35 లక్షలకు పెరిగింది. ఆనాడు ఉమ్మడి జిల్లాలో 13.97 లక్షల మెట్రిక్ధాన్యం ఉత్పత్తికాగా, ఇప్పుడు 28.60 లక్షల మెట్రిక్ టన్నులకు చేరింది. గతంలో కరెంటు, సాగునీరు లేక కేవలం 4.57 లక్షల మంది రైతులు సాగు చేస్తే.. ఇప్పుడు ఆ సంఖ్య 9,25,343 మందికి చేరింది. అలాగే రైతుబంధు కింద 11 విడుతల్లో 7,750.68 కోట్ల పెట్టుబడి సాయం అందించింది. ఇవన్నీ చూస్తే, కేసీఆర్ సర్కారు ఎంత పెట్టుబడి పెట్టి ప్రోత్సహించిందో అర్థమవుతుంది. ఒక్క వ్యవసాయ రంగమే కాదు, అన్ని రంగాల్లోనూ ప్రగతి కనిపిస్తున్నది.
విద్య, వైద్యం రంగాల్లో మార్పులు తేవడంతోపాటు మిషన్కాకతీయ, ప్రాజెక్టుల నిర్మాణం, కమిషనరేట్ల ఏర్పాటు, పెరిగిన మున్సిపాలిటీలు, సమీకృత కలెక్టరేట్లు, జిల్లాకో మెడికల్ కాలేజీ, ప్రసవాలను పెంచేందుకు కేసీఆర్ కిట్, కులవృత్తులకు జీవం పోసేందుకు గొర్రెల పంపిణీ, దళిత బంధు ఇలాంటివి వాటిపై ప్రభుత్వం పెట్టుబడి పెట్టింది. కానీ ప్రతిపక్షాలు జరిగిన అభివృద్ధిని పట్టించుకోకుండా వాటిని అప్పులుగా చూపించి, వాటి ద్వారా వస్తున్న ఫలాలను దాచిపెట్టి ప్రజల ముందు కేసీఆర్ సర్కారును అబాసుపాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో మచ్చుకు కొన్ని రంగాలకు సంబంధించి జరిగిన అభివృద్ధి పెట్టిన ఖర్చులను చూస్తే వాస్తవాలు ఎలా ఉంటాయో..? అర్థమవుతుంది.
ఉమ్మడి జిల్లాలో 2014 వరకు 588 పరిశ్రమలు ఉండగా, 192 కోట్ల పెట్టుబడి ఉంది. వీటిలో 2,603 మందికి ఉద్యోగావకాశాలు కల్పించినట్లు ఆనాటి గణాంకాలు చెబుతున్నాయి. కానీ, గడిచిన ప్రభుత్వంలో చూస్తే పూర్వ జిల్లాలో కొత్తగా 4,764 పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. 19,085 కోట్ల పెట్టుబడులు రాగా, 34,964 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి దొరుకుతున్నది. ఇవేకాదు 2014 వరకు ఉమ్మడి జిల్లాలో రా రైస్, బాయిల్డ్ రైస్ కలిపి 542 రైస్మిల్లులు ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 805కు చేరింది. వరి విస్తీర్ణం భారీగా పెరగడంతో రైస్ మిల్లుల సంఖ్య భవిష్యత్లో ఇంకా పెరిగే అవకాశమున్నది.
ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి 6 గంటల కరెంటు ఇస్తే, కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందుగా 7గంటలకు, తర్వాత 9 గంటలు ఇచ్చింది. 2018 జనవరి ఒకటి నుంచి నిరంతర విద్యుత్తు సరఫరా చేస్తున్నది. అందుకోసం 650 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించారు. 2014కు ముందు ఉన్న కనెక్షన్లు, ట్రాన్స్ఫార్మర్లు, ఇతర విషయాలను పరిశీలిస్తే, విద్యుత్ రంగంపై కేసీఆర్ ప్రభుత్వం ఒక్క ఉమ్మడి జిల్లాలోనే ఎంత ఖర్చు పెట్టిందో అర్థమవుతుంది. 2014లో ఉమ్మడి జిల్లాలో కేవలం 218 విద్యుత్తు ఉప కేంద్రాలు ఉంటే, కేసీఆర్ సర్కారు వాటి సంఖ్యను 351 కేంద్రాలకు పెంచింది. అలాగే పదేళ్లలో 149 కొత్త విద్యుత్తు ఉప కేంద్రాలను ఏర్పాటు చేసింది ట్రాన్స్ఫార్మర్లు చూస్తే 2014లో కేవలం 53,247 మాత్రమే ఉండగా, అవి 78,958 పెరిగాయి. పదేళ్లలో 25,711 ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసింది.
ఉమ్మడి జిల్లాలో వైద్య ఆరోగ్యరంగాన్ని మెరుగు పరిచేందుకు వందలాది కోట్లు వెచ్చించింది. 2014కు ముందు ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖాన’కు అనే పరిస్థితిని కేసీఆర్ సర్కారు పూర్తిగా మార్చివేసింది. వైద్య రంగాన్ని బలోపేతం చేయడంతో ప్రతి ఒక్కరూ ప్రభుత్వ దవాఖానలకే క్యూ కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఉమ్మడి జిల్లాలో 2016లో కేవలం 77 పీహెచ్సీలు ఉంటే, వాటిని 93కు పెంచింది. ఆ దవాఖానల్లో 1,342 బెడ్స్ మాత్రమే ఉంటే, వాటిని 2,850కి పెంచింది. సిబ్బంది సంఖ్యను 3,149 నుంచి 4,318కి పెంచింది. అలాగే కేసీఆర్ ప్రభుత్వం జిల్లాకో మెడికల్ కాలేజీ ఇచ్చింది.
ఈ కళాశాలల్లో ప్రతి విద్యా సంవత్సరంలో 500 మెడికల్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. ఓపీ గణనీయంగా పెరిగింది. 2014కు ముందు 2,400 మందికి మాత్రమే ప్రతి రోజూ ఓపీ చూడగా, ఆ సంఖ్య 5,600కు పైగా కేసీఆర్ ప్రభుత్వంలో పెరిగింది. మాతా శిశు ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుతో ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య ఊహించని రీతిలో పెరిగింది. 2016కు ముందు రోజుకు కేవలం 24 ప్రసవాలు జరిగితే, ప్రస్తుతం 129 జరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో 326 పల్లె, 19 బస్తీ దవాఖానలు, 16 మహిళా ఆరోగ్య కేంద్రాలను కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఉమ్మడి జిల్లాలో మొత్తం చెరువులు 4,283 ఉండగా, వీటి పరిధిలో 15.73 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉండేది. నాడు చెరువులు పరిస్థితి అధ్వానంగా ఉండడంతో కేవలం 4.89 టీఎంసీల నీరు మాత్రమే అక్కడక్కడా చెరువుల్లో నిలిచి ఉండేది. మొత్తం చెరువుల కింద 2లక్షలకుపైగా ఆయకట్టు ఉన్నా 1.27 లక్షల ఎకరాలకు మాత్రమే, అదీ ఒక పంటకే నీరందేది. కేసీఆర్ సర్కారు చెరువులకు జీవం పోసేందుకు మిషన్ కాకతీయను తెచ్చింది. దీని కింద 741.18 కోట్లతో 1,833 చెరువులను పునరుద్ధరించింది. దీంతో నీటి నిల్వ సామర్థ్యం 19.93 టీఎంసీలకు చేరింది.