DGP Shivadhar Reddy | రుద్రంగి, ఏప్రిల్ 24 : నక్సల్స్ ప్రభావితంతో వెనకబడిన ప్రాంతాల్లో అభివృద్ధే లక్ష్యంగా పోలీస్శాఖ పనిచేస్తోందని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. రుద్రంగి మండల కేంద్రంలో సాంకేతిక అంగులతో పోలీస్ స్టేషన్ నూతన భవన నిర్మాణం ఏర్పాటు చేశామని, బాధితులకు సత్వర న్యాయం జరిగేలా పోలీసు వ్యవస్థ పని చేస్తుందని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. రుద్రంగి మండల కేంద్రంలో అధునాతన హంగులతో నిర్మించనున్న నూతన పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరిమా ఆగర్వాల్, ఎస్పీ మహేష్ బి గీతేలతో కలిసి రాష్ట్ర డీజీపీ బీ.శివధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక హంగులతో, కార్పొరేట్ కార్యాలయాన్ని తలపించేలా పోలీస్ స్టేషన్ భవన నిర్మాణాన్ని చేపట్టనున్నారు. బాధితులకు త్వరితగతిన న్యాయం అందించడంతో పాటు ఫ్రెండ్లీ పోలీసింగ్ను మరింత బలోపేతం చేసేందుకు ఈ నూతన భవనం దోహదపడుతుందన్నారు. వేములవాడ నియోజకవర్గం భీమారం నూతన పోలీస్ స్టేషన్ భవనంతో పాటు వేములవాడలో ట్రాఫిక్, మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. గతంలో ఈ ప్రాంతంలో మావోయిస్టు, జనశక్తి నక్సలైట్లు ప్రభావితం ఎక్కువగా ఉండేదని, పోలీసులు కూడా ఒక్కొక్కరిగా కాకుండా బెటాలియన్ గా వెళ్లే పరిస్థితి ఉండేదన్నారు. రుద్రంగి గ్రామ శివారులో చందుర్తి ఎస్ఐ వాహనాన్ని పేల్చివేయడంతో మృతి చెందాడని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు నక్సల్స్ లేకపోవడంతో ఈ ప్రాంతం అభివృద్ధి వైపు ప్రయాణిస్తోందని స్పష్టం చేశారు.
ప్రతీ వాహనదారుడు హెల్మెట్, సిటు బెల్ట్ ధరించాలని రోడ్డు భద్రత నియమాలు పాటించాలని కోరారు. నియోజకవర్గ పోలీసులకు అన్ని విధాలుగా సహకరిస్తున్న ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా పోలీస్ యంత్రాంగానికి అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కో ఆపరేటీవ్ యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, ఆర్డీవో రాధాభాయి, అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ పుష్పలత, ఏఎంసీ చైర్మన్ చెలుకల తిరుపతి, సర్పంచ్ గండి నారాయణ, ఎస్ఐ మోతీరాం, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.