రాయికల్, డిసెంబర్ 25 : రాష్ట్రంలో జోడెద్దుల్లా అభివృద్ధి, సంక్షేమ పథకాలు సాగుతున్నాయని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పేర్కొన్నారు. మండలంలోని ఆలూరు గ్రామానికి చెందిన ప్రేమ్ కుమార్, ఆయన అనుచరులు 20మంది యువకులు ఆదివారం బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నుంచి జగిత్యాల ఎమ్మెల్యే క్వార్టర్స్లో బీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రతి గ్రామం పచ్చదనం, పరిశుభ్రతలో పట్టణాలకు దీటుగా అభివృద్ధి చెందుతున్నదన్నారు. ప్రతిపక్ష నేత జీవన్ రెడ్డి అధికారంలోకి వస్తే రూ.2500 పెన్షన్ ఇస్తామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కాంగ్రెస్ గతంలో రూ.200 పెన్షన్ కూడా సరిగా ఇవ్వలేదని, ఇప్పుడు ఆ పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఎకడా కనీసం రూ.1000కి మించి కూడా పెన్షన్ ఇస్తున్న దాఖలా లేదని విమర్శించారు. ప్రతి గ్రామంలో హరితహారం, వైకుంఠధామం, కంపోస్టు షెడ్డు, పల్లెప్రకృతి వనాన్ని నిర్మించామని గుర్తు చేశారు.
గ్రామ పంచాయతీలకు వచ్చే నిధుల్లో 10 నెలలుగా కేంద్రంలోని బీజేపీ సరారు కోత విధిస్తున్నదని తెలిపారు. రాష్ట్రంలో అన్ని కుల వృత్తులు, కుల సంఘాల అభివృద్ధికి పెద్దపీట వేశామన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ మాదిరిగా ఫీజు రీయింబర్స్మెంట్ ఉందా? అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు. రాయికల్ పట్టణంలోని హనుమాన్, మండలంలోని అయోధ్య, రామాజీపేట్, తాట్లవాయి రామాలయాలకు నిధులు మంజూరు చేసి వాటి అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. బీజేపీ నాయకులు ఆలయాలకు ఎన్ని నిధులు ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ప్యాక్స్ చైర్మన్ రాజిరెడ్డి, సర్పంచ్ భాగ్యలక్ష్మి, ఎంపీటీసీ సురేందర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ రాజన్న, ప్యాక్స్ డైరెక్టర్ మల్లారెడ్డి, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.