తనిఖీలకు ప్రత్యేక అధికారాలు
అక్రమాలకు అడ్డుకట్ట వేసే దిశగా చర్యలు
వేములవాడ, ఫిబ్రవరి 8: రాష్ట్రంలోనే అతిపెద్ద శైవ క్షేత్రమైన రాజన్న ఆలయంలో భక్తులకు సక్రమంగా సేవలందేలా విజిలెన్స్ విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. ఇటీవల కాంట్రాక్టు విభాగాల్లో స్వయంగా తనిఖీలు చేసిన ఆలయ కార్యనిర్వహణ అధికారి రమాదేవి, ఆయా చోట్ల జరిగిన అవకతవకలను తీవ్రంగా పరిగణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇకపై అన్ని విభాగాలనూ తనిఖీ చేసేందుకు ఆలయంలో విజిలెన్స్ కమిటీని ఏర్పాటు చేసి, ప్రత్యేక అధికారాలు అప్పగించేందుకు ఈవో సిద్ధమైనట్లు సమాచారం. ఈ కమిటీలో ఇద్దరు ఏఈవోలు ప్రతాప నవీన్, జయకుమారి, డీఈ రఘునందన్, ఏఈ డీ శేఖర్, పర్యవేక్షకుడు వెల్ది సంతోష్, సీనియర్ అసిస్టెంట్ భాస్కర్, అర్చకుడు ఉమేశ్ను నియమించినట్లు తెలిసింది. వీరు తనిఖీలు చేయడమే కాకుండా అవినీతి, అక్రమాలు జరిగినప్పుడు ప్రత్యేక విచారణ కూడా జరుపనున్నారు. కాగా, విజిలెన్స్ కమిటీ ఏర్పాటుపై అధికారికంగా ప్రకటించాల్సి ఉండగా, ఆలయ వర్గాల్లో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.
ఆలయంలో సాధారణ రద్దీ
వేములవాడ టౌన్, ఫిబ్రవరి 8: వేములవాడ శ్రీపార్వతీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయంలో మంగళవారం సాధారణ రద్దీ కనిపించింది. వేకువజామునుంచే భక్తులు స్వామివారి దర్శనం కోసం క్యూలైన్లలో బారులు తీరారు. కోడె, కల్యాణ, తలనీలాల మొక్కులు సమర్పించుకున్నారు. రాజరాజేశ్వరస్వామివారిని దాదాపు ఎనిమిది వేలకుపైగా భక్తులు దర్శించుకున్నారని, రూ. 6 లక్షలకు పైగా ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.