కమాన్చౌరస్తా, ఫిబ్రవరి 11: ప్రాథమిక స్థాయి విద్యలో గుణాత్మకమైన మార్పు తీసుకురావడానికి రాష్ట్ర కళాశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో పాఠశాల విద్యాశాఖ చేపట్టిన ‘తొలిమెట్టు’ కార్యక్రమానికి అనుబంధంగా కళాశాల విద్యాశాఖ ‘పిల్లల కోసం’ కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నది. ‘పిల్లల కోసం’ స్వచ్ఛంద సంస్థతో అవగాహన ఒప్పందం మేరకు అప్పటి కళాశాల విద్యాశాఖ కమిషనర్ వాకాటి కరుణ సారథ్యంలో డిగ్రీ చదువుతున్న ప్రభుత్వ కళాశాలల ఎన్ఎస్ఎస్ వలంటీర్లు ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
వారు ప్రాథమిక పాఠశాలల్లో సరిగ్గా చదవడం, రాయడం రాని 15 మంది విద్యార్థులను దత్తత తీసుకుని స్నేహపూర్వకమైన బోధనకు ముందుకు వచ్చారు. వీరు ‘మనమందరం ఎవరి కోసం..?, మనమంతా పిల్లల కోసం’ అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10,000 మంది వలంటీర్లు ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతున్నారు. తెలు గు, ఇంగ్లిష్, గణితం విషయాలకు సంబంధించిన నైపుణ్యాలను ప్రాథమిక స్థాయి విద్యార్థులకు స్నేహ పూర్వకంగా బోధిస్తున్నారు. పాఠశాలలో మూడు, నాలుగు, ఐదో తరగతి చదువుతున్న వెనుకబడిన విద్యార్థులకు ప్రతి శనివారం ఆటపాటలతో బోధన చేపడుతున్నారు.
జిల్లాలో గత నవంబర్ నుంచి జిల్లా విద్యాధికారి కార్యాలయ సీఎంవో ఆంజనేయులు సహకారంతో ప్రతి శనివారం వలంటీర్లకు కేటాయించిన ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులకు బోధిస్తున్నారు. ఇందులో కరీంనగర్ నుంచి 120 మంది, హుజూరాబాద్ నుంచి 20 మంది, జమ్మికుంట నుంచి 84 మంది ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో చదువుతున్న ఎన్ఎస్ఎస్ వలంటీర్లు ఇందు లో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమం మార్చి నెల మూడో శనివారంతో ముగస్తుండగా, వలంటీర్లు విద్యార్థులకు తమదైన రీతిలో సలహాలు, సూచనలు అందిస్తూ ముందుకుసాగుతున్నారు. అయితే, ఇందు లో భాగస్వాములైన వలంటీర్లకు పాఠశాల విద్యా శాఖ నుంచి చివరి వారంలో సర్టిఫికెట్లు ప్రదానం చేయనున్నారు.
పిల్లలకు ప్రతి శనివారం ఒక విషయాన్ని అర్థమయ్యేలా వివరించేందుకు నేను కూడా నేర్చుకొని వెళ్లాల్సి వస్తున్నది. ఇందుకోసం నేను ముందు చాలా సాధన చేస్తున్నా. ఓపికతో, ప్రేమగా చెబితేనే చిన్నారులు నేర్చుకుంటున్నారు. ఇది నాకు ఎంతో ఉపయోగపడుతున్నది. ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం అటు చిన్నారులతో పాటు తమకు ఆనందంగా ఉంది.
– పోతు సాయికృష్ణ, బీఎస్సీ, ఎంపీసీఎస్
ఆటపాటలతో అర్థమయ్యేలా చిన్నారులకు పాఠాలు నేర్పడం ఆనందంగా ఉంది. మేం చదువుకునే రోజుల్లో ఇలా మాకు చెప్పేవారు లేరు. కానీ, ఇప్పుడు చిన్నారులకు చాలా విషయాలు అర్థమయ్యేలా చెబుతుంటే ఆ లోటు మాకు తెలుస్తున్నది. ఇలాంటి కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడం గొప్ప విషయం.
– జీ సురేశ్, బీఎస్సీ, ఎంపీసీఎస్
కళాశాల విద్యాశాఖ కమిషనర్ ప్రోత్సాహం మేరకు రాష్ట్ర వ్యాప్తం గా చేపడుతున్న పిల్లల కోసం కార్యక్రమం పది వారాలుగా స్ఫూర్తి దాయకంగా కొనసాగుతున్నది. ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి ఎన్ఎస్ఎస్ వలంటీర్లు, జిల్లా నోడల్ అధికారి టీ రాజయ్య, జిల్లా సమన్వయకుడు డాక్టర్ వీ వరప్రసాద్, జిల్లా విద్యా శాఖ కార్యాలయ సీఎంవో ఆంజనేయులు తమవంతు కృషి చేస్తున్నారు.
– డాక్టర్ కే రామకృష్ణ, కార్యక్రమం జిల్లా పర్యవేక్షకుడు
జిల్లా వ్యాప్తంగా 224 మంది వలంటీర్లు ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతున్నారు. వలంటీర్లు పిల్లలతో మమేకమై స్నేహపూర్వకమైన సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రతి శనివారం వారికి కేటాయించిన ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థుల్లో మార్పునకు కృషి చేస్తున్నారు.
– టీ రాజయ్య, జిల్లా నోడల్ అధికారి
పిల్లలకు ఆటపాటలతో పాఠాలు నేర్పిస్తున్నా. ఇంట్లో సొంత తమ్ముళ్లకి, చెల్లెళ్లకి చెప్పినట్లు అనిపిస్తున్నది. ప్రతి వారం క్రమం తప్పకుం డా పాఠశాలకు వచ్చి పాఠాలు బోధిస్తున్నం. పిల్లలు కూడా శ్రద్ధగా వింటున్నారు.
– అనూష, బీఎస్సీ ద్వితీయ సంవత్సరం