ఐదుగురు మహిళలు కలిసి ట్రాన్స్పోర్ట్ లారీ యూనిట్ ఎంపిక
వేగురుపల్లి టూ హైదరాబాద్ ఇసుక రవాణా
ఇప్పలపల్లి దళితుల పాలిట మహాలక్ష్మి
నెలకు రూ.1.50 లక్షల ఆదాయం గడిస్తున్న ఉమ్మడి యూనిట్
దళిత బంధు వారి జీవితాన్ని మార్చేసింది. రోజు వారీ కూలీలుగా ఉన్న వారిని ఏకంగా లారీ ట్రాన్స్పోర్ట్ ఓనర్లను చేసింది. ఇప్పలపల్లికి చెందిన ఐదుగురు మహిళలు కలిసి వినూత్నంగా ఆలోచించి ఉమ్మడి యూనిట్ను ఎంపిక చేసుకొని శ్రీలక్ష్మీ లారీ ట్రాన్స్పోర్ట్ పేరుతో వ్యాపారం ప్రారంభించగా ప్రస్తుతం కాసుల వర్షం కురుస్తున్నది. నెలకు రూ. 1.50 లక్షల ఆదాయం గడిస్తూ ఆర్థికంగా నిలదొక్కుకుంటున్న ఆ కుటుంబాల నుంచి ఆనందం వ్యక్తమవుతున్నది.
వీణవంక, జూన్ 6: దళితుల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం దళిత జాతిలో కొత్త వ్యాపార ఆలోచనలకు అవకాశం కల్పిస్తున్నది. కూలీలుగా ఉన్నవాళ్లు, ప్రైవేట్ ఉద్యోగంలో వెట్టిచాకిరి చేసేవాళ్లు ప్రభుత్వం ఇచ్చిన అవకాశంతో వ్యాపార వేత్తలుగా ఎదగడంతో పాటు మరో నలుగురికి ఉపాధి కల్పిస్తూ లక్ష్యం వైపు ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే కరీంనగర్ జిల్లా వీణవంక మండలం ఇప్పలపల్లి గ్రామానికి చెందిన కొందరు దళిత బంధు లబ్ధిదారులు వినూత్నమైన నిర్ణయం తీసుకున్నారు. ఒకే గ్రామానికి చెందిన ఐదుగురు మహిళలు కలిసి రూ.50 లక్షలతో అశోక్ లే లాండ్ లారీని తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇసుక రవాణా చేస్తూ ఏకంగా నెలకు రూ.1.50 లక్షలు సంపాదిస్తూ ఆర్థికాభివృద్ధి సాధిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
రోజువారీ కూలీల నుంచి.. లారీ ట్రాన్స్పోర్ట్ ఓనర్లుగా
ఇప్పలపల్లి గ్రామం ఇటీవల ఏర్పడిన చిన్న గ్రామపంచాయతీ.ఈ గ్రామానికి చెందిన ఐదుగురు దళితబంధు మహిళా లబ్ధిదారులు కొయ్యడ లచ్చమ్మ, ఈదునూరి రజిత, కొయ్యడ తరంగిణి, కొయ్యడ రోజారాణి, కొయ్యడ మాధవి ఒకే మాటపై నిలబడి వినూత్నంగా ఆలోచన చేశారు. రూ.50 లక్షలతో 16 టైర్ల అశోక్ లే లాండ్ లారీని తీసుకున్నారు. మహాలక్ష్మీ లారీ ట్రాన్స్పోర్ట్ పేరుతో వ్యాపారం ప్రారంభించారు. సమీపంలో ఉన్న వేగురుపల్లి మానేరువాగు ప్రభుత్వ ఇసుకరీచ్ల వద్ద లారీ నడుపుకోవాలని నిర్ణయించుకొని అనుమతి తీసుకున్నారు. ప్రతీ రోజు ఆన్లైన్ బుకింగ్ ద్వారా వేగురుపల్లి నుంచి హైదరాబాద్కు ఇసుక రవాణా చేస్తున్నారు. ప్రభుత్వ రుసుము, డీజిల్, డ్రైవర్, క్లీనర్ ఖర్చులు పోనూ నెలకు రూ.1.50 లక్షల ఆదాయం సంపాదిస్తున్నారు. ఒకప్పుడు కూలీలుగా ఉన్న మహిళలు ఇప్పుడు ట్రాన్స్పోర్టు లారీకి ఓనర్లయి దర్జాగా బతుకుతున్నారు.
ఆ లారే ఇయ్యాళ్ల అన్నం బెడ్తాంది
నా ఎరుకల ఎందరో ముఖ్యమంత్రులను జూసిన. ఎన్నో సార్ల వాళ్లకు ఓట్లేసిన. అందరు బతుకులు బాగుజేత్తం అని చెప్పినోళ్ళేగాని గిట్ల జేసిసూపిచ్చినోళ్లను ఇప్పటిదాకా సూడలేదు. మాకు దెల్సింది పొద్దుగాల లేసి కూలీ పనికి బోవుడె. మా దళితులను ఏ పార్టోళ్లు పట్టించుకోలె. మా బతుకులు గింతేఅని సరిపెట్టుకున్నం. ఏ దేవుడు కేసీఆర్ సారు రూపంలో అచ్చిండోగాని మాకోసం పథకంబెట్టి రూ.10 లక్షలు ఇచ్చిండు. మా ఊరోళ్లం ఐదుగురం అనుకొని పెద్ద లారీ దెచ్చుకున్నం. అదే మాకు ఇయ్యాల అన్నం బెడ్తాంది. – కొయ్యడ లచ్చమ్మ
నెలదిరిగేసరికి 30 వేలు అత్తన్నయ్
రోజు మేం అన్నం దినేటప్పుడు కేసీఆర్ సారే యాదికత్తండు. కూలీనాలి జేసుకొని కలోగంజో తాగెటోళ్లం. మా బతుకులు బాగుజేసేందుకు సీఎం కేసీఆర్ సారు పథకం తీసుకచ్చి మమ్ముల ఓనర్లను జేసిండు. ఏం తాకట్టువెట్టుకోకుండా మనిషికి రూ.10 లక్షలు ఇచ్చిండు. నెలదిరిగేసరికి రూ.30 వేలు సేతికత్తన్నయి. ఇంటి ఖర్చులు పోనూ కొన్ని పైసలు పొదుపుజేసుకుంటన్నం. కేసీఆర్ సారుకు చేతులెత్తి దండం బెడుతం. – ఈదునూరి రజిత
వ్యాపారవేత్తలం అయినమంటే నమ్మలేకపోతున్న
డిగ్రీ పూర్తి చేసినా ఏ ఉద్యోగం రాలేదనే బాధ ఉండేది. ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ యాజమాన్యానికి వెట్టి చాకిరి చేసేది. వచ్చిన జీతంతో హైదరాబాద్లో రూమ్రెంట్లు కట్టలేక, కుటుంబం గడువక మస్తు కష్టపడేటోళ్లం. సీఎం కేసీఆర్ సార్ దళితబంధు పథకం ప్రవేశపెట్టిన వెంటనే హైదరాబాద్ వదిలి సొంత గ్రామానికి వచ్చినం. నాతో పాటు నలుగురం కలిసి వ్యాపారం చేసే అవకాశం ఉందని సంతోషపడ్డం. ఈ వ్యాపారంలో ఎలాగైనా సక్సెస్ కావాలని కష్టపడుతున్నం. నిరుద్యోగ మహిళగా ఈ పథకం ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్ సార్కు కృతజ్ఞతలు తెలుపుతున్న. – కొయ్యడ తరంగిణి, లబ్ధిదారు
సిటీ వదిలి సొంతూరికి వచ్చాం…
ఊళ్లో బతుకుదెరువులేదని కరీంనగర్కు పోయినం. అక్కడ కోచింగ్ సెంటర్లు, ట్యూషన్లు చెప్తూ బతుకుదెరువు వెతుకున్నం. చాలీచాలని జీతాలతో కుటుంబాన్ని గడుపుకున్నం. దేవుడు వరం ఇచ్చినట్లు సీఎం కేసీఆర్ సార్ దళితబంధు పథకం ప్రవేశపెట్టారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకున్నం. పెద్ద యూనిట్ను ఎంచుకున్నం. సీజన్ల మీద ఆధారపడకుండా రోజూ ఆదాయం వచ్చే ట్రాన్స్పోర్ట్ లారీని ఎంపిక చేసుకున్నం. ఇసుక క్వారీకి లారీని పెట్టి అటు ప్రభుత్వానికి ఆదాయం అందిస్తూ మేం ఆదాయం పొందుతున్నం. ఇంతగొప్ప సహాయం చేసిన సీఎం కేసీఆర్ సార్ను జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం.
– కొయ్యడ రోజారాణి, దళితబంధు లబ్ధిదారు
బతుకుదెరువు జూపిన పెద్దదిక్కు…
రోజుకు రూ.200కు కూలీ పనికి పోయె నాకు దళితబంధు పథకం ఇచ్చి నెలకు రూ.30 వేలు అచ్చెటట్లు జేసిన దేవుడు కేసీఆర్. ఇలాంటి నాయకులను ఇంతవరకు ఎప్పుడు జూడలే. మా జాతోళ్లకు గిన్ని పైసలిచ్చి, ధైర్యాన్ని సూపిన నాయకుడు ఇంత వరకు కనవడలె. మాకు బతుకుదెరువు జూపిన కేసీఆర్ సారును ఎప్పటికీ గుండెళ్లో పెట్టుకొని చూసుకుంటం.
– కొయ్యడ మాధవి, దళితబంధు లబ్ధిదారు