Chigurumamidi | చిగురుమామిడి, ఏప్రిల్ 25 : రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం తోపాటు అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న అధికారులు న్యాయం చేయడం లేదని వారి తీరుపై మహిళ రైతులు రెవెన్యూ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. మహిళా రైతులు మాట్లాడుతూ చిగురుమామిడి మండలం నవాబుపేట గ్రామానికి చెందిన బోయిని లక్ష్మీ అనే మహిళ తన వ్యవసాయ భూమి సర్వే నెంబర్ 735, 736/ఈ వ్యవసాయ భూమి పక్కన మరో రైతు కూతురు రవీందర్ రెడ్డి అనుమతి లేకుండా వారం రోజుల క్రితం వ్యవసాయ బావి మొదలుపెట్టి ఈనెల 19న సైడ్ బోర్లు వేశారని పేర్కొన్నారు. దీంతో బాధిత మహిళ లక్ష్మీ రెవెన్యూ కార్యాలయం అధికారులకు ఫిర్యాదు చేయగా తహసీల్దార్ ఆదేశాల మేరకు ఆర్ఐ, జీపీవో వెళ్లి పరిశీలించి లారీని సీజ్ చేసి నామమాత్రపు జరిమానా విధించారని ఆరోపించారు.
అయినప్పటికీ బావిలో ఉన్న సైడ్ బోర్లను తొలగించలేదని, దీంతో 3.22 ఎకరాల వరి పంట పూర్తిగా ఎండిపోయిందని బాధితులు వాపోయారు. అక్రమంగా బావిని తవ్విన లారీని సీజ్ చేయాలని, సైడ్ బోర్లను తొలగించాలని, ఎండిన వరి పంటకు నష్టపరిహారం అందించాలని వారు డిమాండ్ చేశారు. ఆందోళన చేసిన వారిలో బాధితులు బోయిని లక్ష్మి, బాబు, ప్రశాంత్, సతీష్, నీలవ్వ, మల్లవ్వ, సారవ్వ,కల్పన, మల్లిక, లక్ష్మీ, లచ్చవ్వ తదితరులున్నారు. అనంతరం తహసీల్దార్ రమేష్ కు వినతిపత్రం అందజేశారు. వీరికి దళిత సంఘ నాయకుడు సాంబారి కొమురయ్య, వంతడుపుల వెంకటస్వామి, మంద శ్రీనివాస్, బీఎస్పీ అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షులు వేల్పుల రాజు సంఘీభావం ప్రకటించారు.