సైదాపూర్, నవంబర్ 25:అసలే మెట్టప్రాంతం.. ఆపై వర్షాభావంతో మండలంలో గతంలో ఎటు చూసినా బీడుభూములే కనిపించేవి. ఈ క్రమంలో పశుగ్రాసానికి సైతం కొరత ఏర్పడగా రైతులు మూగజీవాలను పోషించలేక వాటిని అమ్ముకున్న ఉదంతాలు అనేకం ఉన్నాయి. అయితే వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటుతో పరిస్థితులు పూర్తిగా మారాయి. ప్రస్తుతం సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగడం, వరిగడ్డి పుష్కలంగా అందుబాటులో రావడంతో పాడి రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
సైదాపూర్ మండలంలో ఒకప్పుడు పూర్తిగా బోర్లు, బావుల మీదనే ఆధారపడి వ్యవసాయం చేసేవారు. బావుల్లో నీరు ఉన్నా కరెంటు సమస్య కారణంగా రైతులు ఎక్కువగా పత్తి సాగువైపు మొగ్గు చూపేవారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పరిస్థితిలో పూర్తిగా మార్పు వచ్చింది. 24 గంటల కరంటు, రైతుబంధు ద్వారా పెట్టుబడి సాయం, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల మరమ్మతులు పూర్తికావడం, కొన్ని గ్రామాలకు కాలువల ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు జలాలు రావడంతో రైతులకు ఎంతో మేలు జరిగింది. ఈ క్రమంలో బీడు భూములు సస్యశ్యామలమయ్యాయి. వానకాలంలో 18,297 ఎకరాల్లో వరి పండగా, 5719 ఎకరాల్లో పత్తి, 663 ఎకరాల్లో మక్కజొన్న సాగు కావడమే మెట్ట ప్రాంతంలోని మారిన పరిస్థితులకు అద్దం పడుతున్నది.
నాడు రూ.వేల వ్యయం.. నేడు ఉచితం
ఇక్కడి రైతులకు వ్యవసాయంతో పాటు పశుపోషణే ఆధారం. గతంలో మండలంలో వరిపంట తక్కువగా పండడంతో పశుగ్రాసం కోసం పాడి రైతులు పక్క మండలాలకు వెళ్లేవారు. కేశవపట్నం, హుజూరాబాద్, మానకొండూర్ నుంచి ట్రాక్టర్ల ద్వారా వరి తెచ్చుకునేవారు. సుమారు ట్రాక్టర్ గడ్డికి (ట్రాక్టర్ కిరాయి, కూలీలు, గడ్డికి ఇచ్చే డబ్బులు కలిపి) రూ. ఎనిమిది వేల వరకు ఖర్చయ్యేది. ఇప్పుడు గ్రామాల్లో వరిసాగు పెరుగడంతో గడ్డి పుష్కలంగా అందుబాటులోకి వచ్చింది. పశుగ్రాసం కావాల్సిన వారు తమ పంట పొలం నుంచి ఉచితంగా తీసుకెళ్లమంటూ కొందరు రైతులు కోరుతుండడం గమనార్హం. గ్రామాల్లోనే విరివిగా గడ్డి దొరుకుతుండడంతో మేత సమస్య తొలగి పశు సంపద వృద్ధి చెందే అవకాశం ఉంది.