ఫర్టిలైజర్సిటీ, నవంబర్ 3: మ్యాట్రిమోనీ డాట్కామ్తో సైబర్ మోసాలకు పాల్పడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లా అశోక్నగర్కు చెందిన దంపతులు ఎర్ర వెంకటనాగరాజు, రామంచ సౌజన్యను రిమాండ్ చేసినట్లు రామగుండం సైబర్క్రైమ్ పోలీస్టేషన్ ఎస్హెచ్వో డీఎస్పీ ఎం వెంకటరమణ ఆదివారం వెల్లడించారు. గత నెల 5న మంచిర్యాల జిల్లాకు చెందిన ఒక వ్యక్తి సైబర్ నేరగాళ్ల చేతిలో చిక్కుకొని రూ.17 లక్షలు మోసపోయి సైబర్క్రైమ్ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారని, ఈ మేరకు ఇన్స్పెక్టర్ జే కృష్ణమూర్తి కేసు నమోదు చేసుకుని పరిశోధన ప్రారంభించగా భార్యాభర్తల సైబర్క్రైమ్ బయటపడిందన్నారు.
వీరిద్దరూ మ్యాట్రిమోనీ డాట్కామ్ అనే వెబ్సైట్లో వారి సెల్నెంబర్లు పెట్టి ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి అందమైన అమ్మాయిల ఫొటోలు అప్లోడ్ చేస్తూ అబ్బాయిలకు రిక్వెస్ట్ పెట్టారని తెలిపారు. స్పందించిన వారితో డబ్బుల వసూలు కోసం అమ్మకు ఆరోగ్యం బాగాలేదని మాయమాటలు చెప్పి డబ్బులు వసూలు చేసినట్లు తెలిపారు. వీరిని పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం హరిపురం గ్రామంలో పట్టుకొని విచారించగా ఈ ఘరానా మోసం బయటపడిందని తెలిపారు.