Crossing the road | కోల్ సిటీ, జూన్ 5: గోదావరిఖని పైనింక్లయిన్ నుంచి చౌరస్తాకు వెళ్లే ప్రధాన రోడ్డు. మార్గమధ్యంలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో సీత నగర్ బోర్డు వద్ద వాహనాల రాకపోకల గందరగోళం చూస్తున్నారు కదా…! చూస్తేనే భయమేస్తుంటే.. ఇక రోడ్డు దాటాలంటే ఏలా ఉంటుందో ఆలోచించండి. అసలు విషయానికి వద్దాం… ఇక్కడ రోడ్డు దాటితే మీరు పునర్జన్మ ఎత్తినట్లే. ఔను.. ముమ్మాటికీ ఇది వాస్తవమని స్థానికులు అంటున్నారు. రాంమందిర్ ఏరియా పరిధి సీతానగర్, మల్లికార్జున్ నగర్, అంబేడ్కర్ నగర్, రాంనగర్ తదితర ప్రాంతాల నుంచి అవతల వైపు గల కూరగాయల మార్కెట్ కు వెళ్లాలంటే ఇదే మార్గం ద్వారా రాకపోకలు సాగిస్తుంటారు.
ఇటు అటుగా ప్రతి రోజూ ఉదయం నుంచి రాత్రి వరకు వేలాది సంఖ్యలో వాహనాలు తిరుగుతుంటాయి. ఇటువైపు పాన్ టేలాల వద్దకు నిత్యం వినియోగదారులు వస్తుంటారు. అటువైపు పండ్ల దుకాణం, కూరగాయల మార్కెట్, మాంసం దుకాణాలకు తప్పనిసరిగా ఇక్కడి నుంచి రోడ్డు క్రాస్ చేయాలి. కానీ ఇక్కడ వాహనాల నియంత్రణ ఎవరికీ పట్టడం లేదు. దీనితో తరచుగా అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. కార్లు, ద్విచక్ర వాహనాలు అతివేగంగా వస్తుంటాయి. కాలి నడకన రోడ్డు దాటాలనుకునే వారు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఒక్క పరుగున వెళ్లాల్సి వస్తుంది.
కాసేపు ఆలోచించి అడుగు తీసి అడుగు వేసేలోగా వాహనాలు వాయువేగంతో దూసుకొచ్చి ఢీకొడుతున్నాయి. ఇలా అనేక మంది ప్రమాదాలకు గురైన సంఘటనలు ఉన్నాయి. ఇక మహిళలు రోడ్డు దాటే పరిస్థితి అస్సలు ఉండదు. ఇక్కడ రోడ్డు దాటి కూరగాయల మార్కెట్ కు వెళ్లాలంటే మృత్యువుతో పోరాడాల్సి వస్తుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే గానీ, కార్పొరేషన్ అధికారులు గానీ స్పందించి గాంధీనగర్ వద్దమాదిరిగా ఇక్కడ కూడా మార్గంను పూర్తిగా మూసివేసి వన్ వే చేయాలని స్థానికులు కోరుతున్నారు.