కలెక్టరేట్, నవంబర్ 25 : సమాజంలో మహిళలపై అకృత్యాలు, నేరాలు జరుగకుండా అరికట్టడంలో ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్త్రీలపై హింసా వ్యతిరేక అంతర్జాతీయ దినం సందర్భంగా నిర్వహించిన మహిళా చట్టాలపై అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బాలికలు, మహిళలపై జరుగుతున్న హింసపై ప్రజల్లో అవగాహన పెరిగినప్పటికీ నేర నిష్పత్తి మాత్రం తగ్గలేదన్నారు.
మహిళలు, బాలికలపై హింస నిర్మూలనకు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. న్యాయ, రక్షణ శాఖ సహకారంతో గృహ హింస చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా సంక్షేమ అధికారికి సూచించారు. బాలికలతో పాటు బాలురకు కూడా అవగాహన కార్యక్రమాలు అవసరమని చెప్పారు. ముఖ్యంగా పని ప్రదేశాలు, పాఠశాలల్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టానికి సంబంధించిన అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. బస్టాండ్లు, మారెట్ పరిసర ప్రాంతాల్లో షీ టీంలు నిరంతరం నిఘా పెట్టాలని ఆదేశించారు.
కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి కే సబిత, సఖీ కేంద్రం అడ్మిన్ లక్ష్మి, బాలల పరిరక్షణ కమిటీ చైర్ పర్సన్ ధనలక్ష్మి, జిల్లా వైద్యాధికారి జువేరియా, డీఆర్డీఏ పీడీ శ్రీలత, మెప్మా పీడీ రవీందర్, ఏసీపీ మాధవి, ఏసీబీ మదన్ లాల్, నెహ్రూ యువ కేంద్రం కోఆర్డినేటర్ రాంబాబు, కే రూపారాణి, సీడీపీవోలు ఉమారాణి, కస్తూరి తదితరులు పాల్గొన్నారు.