చిన్న పిల్లలు ఉన్న కలెక్టరేట్ మహిళా ఉద్యోగుల కోసం రాజన్న సిరిసిల్ల జిల్లా యంత్రాంగం సరికొత్త ఆలోచన చేసింది. మంత్రి కేటీఆర్ మార్గదర్శనం మేరకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం (ఐడీవోసీ)లో ఆరు నెలల నుంచి ఆరేండ్లలోపు పిల్లల సంరక్షణ చూసేందుకు వీలుగా అధునాతన హంగులతో క్రీచ్ (శిశువులను పగటిపూట జాగ్రత్తగా చూసే స్థలం) ఏర్పాటు చేసింది.
కలెక్టర్ అనురాగ్ జయంతి జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ క్రీచ్లో తాగునీటి సదుపాయం, వంట సామగ్రి, టాయిలెట్, ఆట వస్తువులు, నిద్రపోయేందుకు ఏర్పాట్లు, భోజనాన్ని నిల్వ చేయడానికి కావాల్సిన సామగ్రి, స్మార్ట్ టీవీ, అవుట్డోర్ ఆట వస్తువులు, విశ్రాంతి తీసుకోవడానికి ఊయలలు, పడుకోవడానికి అవసరమైన సామగ్రితోపాటు బాలింతలు పాలివ్వడానికి ఫీడింగ్ సెంటర్ ఏర్పాటు చేసింది. ఐడీవోసీ (ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ ఆఫీసర్స్ కాంప్లెక్స్)లో పనిచేసే మహిళా ఉద్యోగులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉండనున్నది. జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం దీని నిర్వహణ బాధ్యతలు చూడనుండగా, త్వరలోనే ప్రారంభంకాబోతున్నది.
– సిరిసిల్ల కలెక్టరేట్, ఫిబ్రవరి 22