కరీంనగర్ తెలంగాణచౌక్, జూన్ 25 : కరీంనగరంలో తాగునీటి సమస్య పరిష్కరించాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో ధర్నా చేశారు. అరగంటకుపైగా అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. కార్పొరేషన్ ఆఫీస్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. అనంతరం నాయకులను అదుపులోకి తీసుకుని వన్టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ, నగరవాసులు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతుంటే మానేర్ డ్యాంలోని నీటిని పక్క జిల్లాకు తరలించడం ఏంటని ప్రశ్నించారు. ముందుగా నగర వాసులకు నీటిని కేటాయించాలని డిమాండ్ చేశారు. ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుక్కుంటున్నా బీజేపీ, కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
అంతే కాకుండా నగరంలోని విలీన గ్రామాల్లోని చెరువులు కబ్జాకు గురవుతున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో జిల్లా కార్యవర్గ సభ్యులు రాజు, బుచ్చన్నయాదవ్, బీర్ల పద్మ, కొట్టె అంజలి, స్రవంతి, రాజయ్య, మచ్చ రమేశ్, ఆంజనేయులు, హేమంత్ పాల్గొన్నారు.