పెద్దపల్లి, అక్టోబర్ 13(నమస్తే తెలంగాణ): సింగరేణి భూ నిర్వాసితులకు చెల్లించే ఆర్అండ్ఆర్ ప్యాకేజీ చెల్లింపుల్లో అవకతవకలకు బాధ్యులుగా పేర్కొంటూ ఇద్దరు ఆర్డీవోలపై రాష్ట్ర ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు తీసుకున్నది. వారితోపాటు డీఏవో, సీనియర్ అసిస్టెంట్, ఆర్ఐ, ఇద్దరు వీఆర్వోలపైనా చర్యలు తీసుకున్నది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఒకే నిర్వాసిత కుటుంబంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందినప్పటికీ వారి పేరున ఆర్అండ్ఆర్ చెక్కులను విడుదల చేసి నకిలీ వ్యక్తుల ద్వారా డబ్బులు విత్ డ్రా కావడంపై జరిగిన విజిలెన్స్ విచారణలో నిజా లు వెల్లడయ్యాయి. సింగరేణి రామగుండం ఏరియా-2 పరిధిలోని ఓసీపీ-3 ప్రాజెక్టు విస్తరణలో భాగంగా 2007-08లో గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి రామగిరి మండలం జల్లారం గ్రామంతో పాటు పెద్దంపేటను సింగరేణి స్వాధీనం చేసుకున్నది. దీంతో 2017లో 2,135 మంది నిర్వాసితులకు రూ.5,97,140 చొప్పున ప్యాకేజీ వచ్చింది.
అప్పుడు ఆర్డీవోగా పనిచేసిన ఎం నగేశ్ (ప్రస్తుతం సంగారెడ్డి) నిర్వాసితులకు చెక్కులు పంపిణీ చేశారు. అదే సమయంలో ప్యాకేజీ ఎక్కువ కావాలని కోరుతూ ప్యాకేజీని తీసుకోకుండా కొందరు కోర్టుకెళ్లారు. ఆ తర్వాత 2019-20లో మిగిలిపోయిన మరికొందరు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ చెక్కులు తీసుకునేందుకు ముందుకు రాగా, ప్రస్తుత ఇన్చార్జి ఆర్డీవో నరసింహమూర్తి నిర్వాసితులకు చెక్కులు పంపిణీ చేశారు. తొలి విడుతలో చెక్కులు పంపిణీ చేసే సమయానికి పెద్దంపేటకు చెందిన కాల్వల లక్ష్మయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. కానీ 2017లో పంపిణీ చేసిన ఆర్అండ్ఆర్ ప్యాకేజీ చెక్కును ఆధార్కార్డు, బ్యాంకు ఖాతా, ఓటర్ ఐడీ కార్డులపై నకిలీ వ్యక్తి ఫొటో పెట్టి వేరే వ్యక్తికి చెక్కు ఇచ్చి డబ్బులు డ్రా చేయించారు. అలాగే 2019-20లో చెక్కులు పంపిణీ సమయానికి కాల్వల యశోద చనిపోయింది. అయితే పరిహారం ఆమె పేరిట వేరే వ్యక్తితో డబ్బులు డ్రా చేయించారు. వీరిద్దరూ తండ్రీ కూతురు కావడంతో గ్రామానికి చెందిన కొందరు రెవెన్యూ విజిలెన్స్కు ఫిర్యాదు చేశారు.
విచారణలో అసలు నిజాలు నిగ్గు తేలాయి. దీంతో 2017లో మంథని ఆర్డీవోగా ఉన్న ఎం నగేశ్, ప్రస్తుతం ఆర్డీవోగా ఉన్న నరసింహమూర్తి, డీఏవో వరంధన్, సీనియర్ అసిస్టెంట్ ఎం అరుణ్కుమార్, రామగిరి వీఆర్వోగా పని చేసిన పిట్టల సదయ్య, వీఆర్వోగా పనిచేసిన అబ్దుల్ రహీంకు నోటీసులు జారీ చేశారు. తాజాగా వీరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటూ సీఎస్ సోమేశ్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.