విద్యానగర్, మార్చి 15 : కరీంనగర్ ప్రభుత్వ దవాఖానలో కార్పొరేట్ హాస్పిటల్స్కు దీటుగా వైద్యం అందిస్తున్నారు డాక్టర్లు. పేద ప్రజలకు పైసా ఖర్చు లేకుండా ఖరీదైన శస్త్ర చికిత్సలు చేస్తూ సర్కారు వైద్యంపై నమ్మకాన్ని పెంచుతున్నారు. ఇదే కోవలోనే ఇద్దరు మహిళలకు తుంటి, మోకాలు కీలు మార్పిడి శస్త్ర చికిత్సలు చేయగా, వారి కుటుంబ సభ్యులు వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. వివరాలు ఇవి.. మహబూబాబాద్కు చెందిన సుభద్ర (45) తన పది సంవత్సరాల వయస్సులో కింద పడడంతో తుంటి విరిగింది. అలాగే వెల్గటూర్కు చెందిన శాంతమ్మ పదేళ్ల నుంచి మోకాలు కీళ్లు అరగడంతో నడవలేని పరిస్థితికి చేరువైంది.
ఈ క్రమంలో వారు కార్పొరేట్ హాస్పిటల్స్లో సంప్రదించగా, రూ. లక్షల్లో ఖర్చవుతుందని వైద్యులు తెలుపడంతో అంత డబ్బులు పెట్టుకునే స్థితి లేకపోవడంతో మిన్నకుండిపోయారు. మీడియా ద్వారా కరీంనగర్ జనరల్ హాస్పిటల్లో తుంటి, మోకాలు కీలు మార్పిడిలు చేస్తున్నారనే సమాచారంతో దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ వీరారెడ్డిని సంప్రదించారు. వెంటనే ఆయన ఆదేశాలతో ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ నారగోని కుమార్గౌడ్ సుభద్రకు తుంటి మార్పిడి, శాంతమ్మకు మోకాలు కీలు మార్పిడి శస్త్ర చికిత్స చేశారు. ప్రస్తుతం వారు పూర్తిగా కోలుకున్నారు.
కార్పొరేట్ దవాఖానలో రూ.లక్షల్లో ఖర్చు అయ్యే ఇలాంటి శస్త్రచికిత్సలు ఉచితంగా నిరంతరంగా చేస్తున్నాం. అత్యాధునిక పరికరాల ద్వారా శస్త్రచికిత్సలు చేయడంతో రోగులు త్వరగా కోలుకుంటున్నారు. శస్త్ర చికిత్స చేసిన ఐదు రోజుల్లోనే నడుస్తున్నారు. గతంతో పోల్చితే ప్రస్తుతం ప్రభుత్వ దవాఖానలో అన్ని రకాల మందులు, పరికరాలు అందుబాటులో ఉండడంతో ఎలాంటి కష్టతరమైన శస్త్ర చికిత్సలైనా చేస్తున్నాం.
– డాక్టర్ కుమార్గౌడ్ నారగోని, ఆర్థోపెడిక్ సర్జన్
కరీంనగర్ జనరల్ హాస్పిటల్లో అత్యాధునికమైన ల్యాప్రోస్కోపి లాంటి సర్జరీలు సైతం చేస్తున్నాం. దీనికి తోడు దవాఖానలో అన్ని విభాగాల వైద్యులు అందుబాటులో ఉన్నారు. గతంలో ఉన్న వైద్యులు, సిబ్బంది రెట్టింపు అయ్యారు. క్లిష్టమైన శస్త్ర చికిత్సలు చేస్తున్న వైద్యులు, సిబ్బందికి అభినందనలు. ప్రజలు ప్రభుత్వ వైద్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– డాక్టర్ గుండా వీరారెడ్డి, దవాఖాన సూపరింటెండెంట్