ధర్మపురి, జూలై 2 : సమీకృత మార్కెట్ నిర్మాణం పూర్తయ్యింది. రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చొరవతో పట్ణణంలో రూ.4కోట్లతో నిర్మించారు. ఇది ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నది. త్వరలో ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పట్టణ ప్రజలకు అవసరమైన నాణ్యమైన, తాజా కూరగాయలు, పండ్లు, మాంసం, చికెన్, పూలు.. ఇలా అన్నీ ఒకేచోట లభించనున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం రూ.2కోట్ల ఎస్డీఎఫ్ నిధులతో రెండేళ్ల క్రితం మార్కెట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. కాగా, పెరిగిన ధరలకు అనుగుణంగా మరిన్ని నిధులు అవసరముండగా.. మంత్రి ఈశ్వర్ చొరవ చూపి గతేడాది మరో రూ.2 కోట్లు విడుదల చేయించారు. మొత్తం రూ.4కోట్ల వ్యయంతో ఈ సమీకృత మార్కెట్లో సకల హంగులు కల్పించారు. రూ.60 లక్షల విలువైన నాణ్యమైన రేకుల ముడిసరుకును మలేషియా నుంచి తెప్పించి బిగించారు. ఈ మార్కెట్లో రైతులు, వ్యాపారులు, కొనుగోలుదారులకు సౌకర్యంగా 80 వెజ్స్టాల్స్, 24 నాన్ వెజ్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. పట్టణ నడిబొడ్డున నిర్మించిన ఈ సమీకృత మార్కెట్ ధర్మపురిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మార్కెట్ నిర్మాణం పూర్తి కాగా.. మంత్రి ఈశ్వర్ త్వరలోనే ప్రారంభించనున్నారు.
పట్టణ నడిబొడ్డున నిర్మాణం
ధర్మపురి పట్టణం మధ్యలో, ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం చేపట్టారు. గతంలో ఇదే ప్రాంతంలో రైతులు, వ్యాపారులు ఎండకు ఎండుతూ, వానలో తడుస్తూ కూరగాయలు అమ్ముకునేవారు. వర్షకాలమైతే పరిస్థితి వర్ణనాతీతం. ఆ ప్రాంతమంతా బురదమయమయ్యేది. పందులు స్వైరవిహారం చేసేవి. ఈ క్రమంలో వ్యాపారులు, కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనిని గుర్తించిన మంత్రి ఈశ్వర్ పట్టణంలోని ఆయా వార్డుల్లో పర్యటించిన సందర్భంగా మార్కెట్ పరిస్థితిని గమనించారు. నిధులు మంజూరు చేయించి కూరగాయాలు, మాంసం, చికెన్ తదితరవి అన్నీ ఒకే చోట లభించేలా ఈ సమీకృత మార్కెట్ను నిర్మించారు. ఈ మార్కెట్తో కూరగాయలు అమ్ముకునే రైతులు, కొనుగోలుదారులు, వ్యాపారులకు ఎండాకాలం, వానకాలంలో కలిగే ఇబ్బందులు తప్పినట్లయింది.