Jagityal | రాయికల్, మే 29: నిరుపేదలు, నిరుద్యోగుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఎలాంటి షరతులు లేకుండా అమలు చేయాలని జిల్లా పరిషత్ మాజీ ఛైర్ పర్సన్ దావ వసంత డిమాండ్ చేశారు. రాయికల్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో బీఅర్ఎస్ పట్టణ, మండల నాయకులతో కలిసి ఆమె గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలు కేవలం ప్రజలను మభ్య పెట్టే విధంగా ఉన్నాయని ఏద్దేవా చేశారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం స్థలం కేవలం అర గుంట కే పరిమితం చేయడంతో ఇందిరమ్మ లబ్ధిదారులకు నిరాశే మిగిలే పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వం నిబంధనలు అతిక్రమిస్తే బిల్లులు చెల్లించకపోవడం దురదృష్టకరమన్నారు. అరగుంటలో ఇల్లు కడితే బంధువులు వస్తే మెదిలే స్థలం ఉండదని, నిర్మాణం స్థలం పెంచి తధనుగుణంగా రూ. 5 లక్షలు ఇవ్వడంతో పాటు, అర్హులైన వారందరికీ పథకం వర్తింపచెయ్యాలని డిమాండ్ చేశారు.
తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డాక ఉమ్మడి రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఇందిరమ్మ గృహ నిర్మాణ బిల్లులను అప్పటి బీఆరెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చెల్లించిందని గుర్తు చేశారు. కేసీఆర్ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లకు మూడు రంగులు వేసి కాంగ్రెస్ ప్రభుత్వంమే కట్టించిందన్నట్లుగా ప్రచారం చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. ఇత్తేసీ పొత్తు కూడిన చందంగా కాంగ్రెస్ పాలన ఉందని విమర్శించారు.
నిరుద్యోగ యువతీ యువకుల కోసం ప్రవేశ పెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం అమలులో కూడా క్లారిటీ లేదని, ఓ వైపు సిబిల్ స్కోర్ కు సంబంధం లేదంటూనే మరో వైపు సిబిల్ స్కోర్ ఉన్నవారినే అర్హులుగా ఎంపిక చేశారన్నారు. ఇంటర్వ్యూ ల పేరుతో ప్రభుత్వం కాలయాపనా చేస్తూ యువతని ఇబ్బందులకు గురి చేస్తుందని ఆరోపించారు.
పథకం అమలు కూడా దశల వారీగా ఉంటుందనే ప్రచారం నడుస్తున్న తరుణంలో స్పష్టమైన విధి విధానాలు ప్రకటించి అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రకటించిన రుణ పరిమితికీ తగ్గట్టుగా సబ్సిడీ రుణలు అందించాలని వసంత రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు అనిల్, మండల అధ్యక్షులు బర్కం మల్లేష్, కో ఆర్డినేటర్ శ్రీధర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లు రాణి సాయి కుమార్, ఉదయ శ్రీ,మైనార్టీ మండల అధ్యక్షులు చాంద్ పాషా, మాజీ ఎంపీటీసీలు నాగరాజు, రాజేందర్ గౌడ్,మాజీ కౌన్సిలర్ శ్రీరాముల సత్య నారాయణ, మహేందర్, నాయకులు గంగారం, ప్రశాంత్ రావు, సోహెల్, శ్రీను, గంగాధర్,రామచంద్రం,నాయకులు తదితరులు పాల్గొన్నారు.