GodavariKhani | పెద్దపల్లి, జనవరి 11 (నమస్తే తెలంగాణ)/కోల్బెల్ట్ : పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన అభివృద్ధి పనుల కార్యక్రమం ప్రారంభం, పట్టాల పంపిణీ సభలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తల మధ్య ఉన్న విభేదాలు బగ్గుమన్నాయి. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండ సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్న సభలో పాల్గొని వారు కిందికి దిగిన అనంతరం పలువురు ద్వితీయ శ్రేణి నాయకుల మధ్య వేదిక పై తోపులాట జరిగింది. ఇందిరమ్మ పట్టాల పంపిణీకి సంబంధించి ఈ వివాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. మంత్రుల ప్రసంగాలు ముగిసిన వెంటనే స్టేజీపై ఉన్న ఇద్దరు కాంగ్రెస్ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడం చివరకు ఘర్షణకు దారితీసింది.
సభా వేదికపైనే ఒకరిపై ఒకరు పిడి గుద్దులు గుద్దుకోవడం చర్చనీయాంశమైంది. ఉన్నటువంటి ఒక్కసారిగా ఈ స్థాయిలో ఉద్రిక్తతలు నెలకొనడం పార్టీ శ్రేణులను, ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఒకే డివిజన్కు చెందిన ఇద్దరు నాయకుల మధ్య గత కొంతకాలంగా కొనసాగుతున్న విభేదాలు ఈ సమావేశంలో బహిరంగంగా బయటపడినట్లుగా కనిపిస్తోంది. మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరైన వేదికపై ఇలాంటి ప్రవర్తన ఎంతవరకు సమంజసమన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
‘ఇదేనా సభా మర్యాదలు..? ఇదేనా మంత్రులకు ఇచ్చే గౌరవం? స్థానిక ఎమ్మెల్యేకు ఇచ్చే విలువ ఇదేనా?’ అంటూ పలువురు ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. జిల్లా మంత్రులు పాల్గొన్న సమావేశాల్లో నాయకులు క్రమశిక్షణతో, బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. స్టేజీపై ఘర్షణకు దిగడం పార్టీకి ఎంత నష్టం చేస్తుందన్న అంశంపై కూడా చర్చ సాగుతోంది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఇంత జరిగినా, పలు సంఘటనలు పునరావృతమైనా, సదరు నాయకుడిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నది ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలింది. పార్టీ అధిష్టానం, జిల్లా నాయకత్వం ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.