సిరిసిల్ల టౌన్, ఏప్రిల్ 30 : ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని టీజీఈజేఏసీ చైర్మన్, టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ విమర్శించారు. సమస్యలను ఎన్నిసార్లు విన్నవించినా కనీసం పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఈ నెల 5న టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో చేపట్టనున్న ఒక రోజు నిరాహార దీక్షకు సంబంధించి సన్నాహక సమావేశం గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలోని అర్బన్ బ్యాంక్ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ఉద్యోగుల సమస్యల పరిష్కారమే ప్రధాన డిమాండ్గా ఈ నెల 5న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ కార్యాలయాల ఎదుట ఆమరణ నిరాహారదీక్ష చేపడుతున్నట్టు తెలిపారు. విశ్రాంత ఉద్యోగుల పెండింగ్ బెనిఫిట్స్ ఏకకాలంలో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల బకాయిలు 13వేల కోట్లు పెండింగ్లో ఉండగా వెయ్యి కోట్లు మాత్రమే విడుదల చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పూర్తి స్థాయిలో చెల్లించాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ను రద్దు చేసి పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరించాలని, పీఆర్సీని వెంటనే అమలు చేయాలని, డీఏ బకాయిలు విడుదల చేయాలని, ఉద్యోగులకు హెల్త్ కార్డులు అందించాలని కోరారు.
తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర కీలకమైందని, ఏ ప్రభుత్వానికీ తాము తొత్తులం కాదని, హక్కుల సాధన కోసం నిరంతరం ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. 206 సంఘాలను కలుపుకొని టీజీఈజేఏసీ పనిచేస్తుందని తెలిపారు. సమావేశంలో టీజీఈ జేఏసీ అబ్జర్వర్ కటకం రమేశ్, జిల్లా చైర్మన్ ఎలుసారి ప్రవీణ్, కో చైర్మన్ సమరసేన్, మెట్ట రామస్వామి, గాజుల సుదర్శన్, మెట్ట శ్రీకాంత్, రియాజ్, తెలంగాణ ఉద్యోగ గెజిటెడ్ అధికారుల, ఉపాధ్యాయుల, కార్మిక, పెన్షనర్ల సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు.