మంథని/కమాన్పూర్/రామగిరి/ముత్తారం, మార్చి 17 : గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రజలను మభ్యపెట్టిందని, 420 హామీలు ఇచ్చి మోసం చేసిందని పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. ఆచరణకు సాధ్యం కాని హామీలతో గద్దెనెక్కిందని, చేతకాని పాలనతో రాష్ట్రం పదేండ్లు వెనక్కిపోయిందని దుయ్యబట్టారు. మంథనిలోని రాజగృహ, కమాన్పూర్లోని మాజీ ఎంపీపీ ఇనుగంటి ప్రేమలత నివాసంలో, సెంటినరీకాలనీలోని మినీ బ్లాంకెట్ హాల్లో, ముత్తారంలోని శ్రీ సరస్వతీ విద్యాలయంలో ఆదివారం వేర్వేరుగా ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహించారు. ఆయా చోట్ల మాట్లాడారు. 100 రోజులు పూర్తవుతున్నా ఇచ్చిన హామీలను మాత్రం కాంగ్రెస్ అమలు చేయలేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో వ్యవసాయాన్ని పండుగలా మార్చిందని కొనియాడారు.
రైతులు, సబ్బండవర్గాల కోసం ఎన్నో అద్భుత పథకాలు ప్రవేశ పెట్టి వంద శాతం అర్హులకు చేరేలా కృషి చేసిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అని కీర్తించారు. కానీ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజల సంక్షేమాన్ని, అభివృద్ధిని పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు, కేసీఆర్ గురించి మాట్లాడడం తప్ప అభివృద్ధి చేయాలనే ఆలోచన వారికి రావడం లేదన్నారు. వరదలతో కాళేశ్వరం ప్రాజెక్టులో కేవలం ఒక్క పిల్లర్ కుంగి పోతే మొత్తం ప్రాజెక్టు కూలి పోయినట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పుష్కలమైన సాగునీళ్లతో కళకళలాడిన పొలాలు నేడు ఎండిపోతున్నాయని, కరెంట్ కోతలు మొదలయ్యాయని చెప్పారు.
సాగునీటి కోసం రైతులు రోడ్డెక్కి నిరసన చేస్తున్నా, హామీల అమలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే నాథుడే లేరని దుయ్యబట్టారు. ఈ విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు తగిన గుణ పాఠం చెప్పడం ఖాయమన్నారు. 30 ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఎలాంటి మచ్చ లేకుండా జీవించానని, ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం మంత్రిగా, విప్గా, ఎమ్మెల్యేగా అహర్నిశలు కృషి చేశానని, ఇప్పుడు మీ బిడ్డగా ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నానని ఆశీర్వదించాలని కోరారు. ఈ ఎంపీ ఎన్నికల్లో మాటలతో మభ్యపెట్టే కోట్లకు అధిపతులైన టూరిస్టు నాయకుడు కావాలా..? లేక నిత్యం మీతోనే ఉండి సేవలందించే తాను కావాలో ప్రజలే ఆలోచించుకోవాలని పిలుపునిచ్చారు.
‘కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తానని ఎన్నికల ముందు సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. మరి ఏమైందో..? చెప్పాలి.?, ఆయన చెప్పిన ప్రకారం జనవరి, ఫిబ్రవరిలోనే చేయాలి. కానీ అధికారంలోకి వచ్చి 100 రోజులు గడుస్తున్నా ఎందుకు చేయలేదో చెప్పాలి’ అని జడ్పీ చైర్మన్ మధూకర్ ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్నామని ప్రకటనలు ఇస్తున్నారే గానీ..? ఆచరణలో మాత్రం చూపించడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని, ఖజానా ఖాళీగా ఉందని చెప్పే సీఎం రేవంత్రెడ్డికి ఆరు గ్యారెంటీలపై పేపర్ ప్రకటనల కోసం డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో..? చెప్పాలని ప్రశ్నించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గెలుపే లక్ష్యంగా పనిచేద్దామని శ్రేణులకు పిలుపునిచ్చారు.
వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో బీఆర్ఎస్ మండలాధ్యక్షులు ఎగోలపు శంకర్గౌడ్, పిన్రెడ్డి కిషన్రెడ్డి, రవీందర్, పోతుపెద్ది కిషన్రెడ్డి, మంథని, రామగిరి జడ్పీటీసీలు తగరం సుమలత, శారద, ముత్తారం ఎంపీపీ ముత్తయ్య, రామగిరి, ముత్తారం వైస్ ఎంపీపీలు ఉప్పరి శ్రీనివాస్ యాదవ్, సుధాటి రవీందర్రావు, నాయకులు తగరం శంకర్లాల్, పూదరి సత్యనారాయణగౌడ్, పెగడ శ్రీనివాస్, ప్రసాద్, రోడ్డ శ్రీనివాస్, నాగేల్లి సాంబయ్య, కుమార్యాదవ్, కాపురబోయిన భాసర్, బుర్ర శంకర్ గౌడ్, గాజుల ప్రసాద్, బడికెలా శ్రీనివాస్, ఉదరి సదానందం, రాచకొండ లక్ష్మణ్, పిడుగు సతీష్, ఇనగంటి రామారావు, పిట్ల గోపాల్, మేకల సంపత్ యాదవ్, కొట్టే భూమయ్య, మహిళా విభాగం మండలాధ్యక్షురాలు పొన్నం రాజేశ్వరీ, ఎంపీటీసీలు కోలేటి చంద్రశేఖర్, గుడిసెల ఉమా సంపత్, నీలం సరిత శ్రీనివాస్, గుజ్జుల రాజిరెడ్డి, జంజర్ల శేఖర్, సెగ్గెం రాజేష్, ప్రసాద్, తొంబూరపు తిరుపతి, మాచీడి రాజుగౌడ్, ముత్యాల లింగయ్య, కనవేన శ్రీనివాస్, అత్తె చంద్రమౌళి, నూనె కుమార్, రమణారెడ్డి, పప్పు స్వరూప, చంద్రమౌళి పాల్గొన్నారు.