కరీంనగర్ తెలంగాణచౌక్, ఫిబ్రవరి 22 : బీసీలను రాజకీయంగా అణచివేయాలని కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నదని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రంగుసంపత్ గౌడ్ ఆరోపించారు. కరీంనగర్లోని ఆ సంఘం కార్యాలయంలో అదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఎన్నికల సమయంలో కామారెడ్డిలో నిర్వహించిన బీసీ డిక్లరేషన్ సభలో బీసీ సబ్ప్లాన్కు నిధులు కేటాయిస్తామని, విద్య, ఉద్యోగ, రాజకీయంగ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని, నిరుద్యోగ భృతి అందిస్తామని, బీసీ స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తామని వాగ్దానాలు చేసిన కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి రాగానే బీసీలను విస్మరించించారని మండిపడ్డారు.
రెండేండ్లయినా ఏ ఒక్కటీ అమలుకు నోచుకోలేదన్నారు. బీసీ మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్ నోరు మెదపడం లేదని ధ్వజమెత్తారు. బీసీలకు కాంగ్రెస్ చేస్తున్న ద్రోహాన్ని గ్రామగ్రామానా ప్రచారం చేస్తామన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేశాకే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రాష్ట్ర జిల్లా కమిటీ నాయకులు పాల్గొన్నారు.