కలెక్టరేట్, ఫిబ్రవరి 27: కలెక్టర్ ఆర్వీ కర్ణన్ యూనిసెఫ్ ప్రతినిధి సైంతియా ఎంసికాఫీరే నుంచి ప్రశంసలు అందుకున్నారు. హైదరాబాద్ యూనిసెఫ్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్తూ, వారిని చైతన్య పరుస్తుండడంపై ఆమె కలెక్టర్ను అభినందించారు. పచ్చదనం పరిశుభ్రత, పారిశుధ్యం, నీటి శుభ్రతతో పాటు అనీమియా ముక్త్ కరీంనగర్ కోసం వినూత్న రీతిలో కార్యక్రమాలు నిర్వహిస్తూ, ప్రజల్లో అవగాహన పెంచుతుండడాన్ని కొనియాడారు. ఇటీవలే ఓడీఎఫ్ ప్లస్లో నగరం జాతీయ స్థాయిలో ఫైవ్స్టార్ రేటింగ్ సాధించడంతో యూనిసెఫ్ సమావేశానికి కలెక్టర్ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా జిల్లాలో చేపడుతున్న అనేక ప్రజాసంక్షేమ కార్యక్రమాలపై కలెక్టర్ కర్ణన్ తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక రాష్ర్టాల నుంచి వచ్చిన యూనిసెఫ్ భాగస్వాములకు వివరించారు.
జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా అమలవుతున్న దళితబంధు, అనీమియా ముక్త్ కరీంనగర్, పోషణ్ అభియాన్, మన ఊరు-మన బడి, ఆరోగ్య, మహిళా సంక్షేమం, గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖల సమన్వయంతో చేస్తున్న కృషి, తదితర అంశాలపై కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా యూనిసెఫ్ అధికారులకు వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్కు 2016 నుంచి యూనిసెఫ్ సహకారం అందిస్తున్నదని చెప్పారు. ఈ క్రమంలో పల్లె ప్రగతి స్ఫూర్తిగా జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో పనిచేసి స్వచ్ఛతలో కరీంనగర్ జిల్లాకు జాతీయ స్థాయిలో గుర్తింపు తేవడం సంతోషంగా ఉందని చెప్పారు. అంతకుముందు యూనిసెఫ్-స్వచ్ఛభారత్ మిషన్ గ్రామీణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాల బుక్లెట్ను ఆవిష్కరించారు. ఇక్కడ యూనిసెఫ్ హైదరాబాద్ చీఫ్ మిస్ మెయిటల్ రూసడియా, టీఎస్సీపీసీఆర్ చైర్మన్ శ్రీనివాసరావు, వాష్ అధికారి వెంకటేశ్, జిల్లా యూనిసెఫ్ ప్రాజెక్టు కో ఆర్డినేటర్ కిషన్స్వామి, క్లస్టర్ ఫెసిలిటేటర్ రవీందర్ పాల్గొన్నారు.