గొల్లపల్లి, డిసెంబర్, 17: భక్తితో కొలిచే భక్తుల కొంగుబంగారమై వెలుగొందుతున్న దైవం మల్లన్నపేట మల్లికార్జున స్వామి. ఎంతో మహిమగల దేవుడిగా ప్రతీతి. కరీంనగర్కు ఉత్తరాన 62 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న గ్రామమైన మల్లన్నపేటలో వెలిసిన దైవం మల్లికార్జున స్వామి. జగిత్యాలకు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ద్వితల (రెండు అంతస్తుల ఆలయం) ఆలయంలో పరమశివుడు లింగం రూపంలో వెలిశాడు. గొల్ల కురుమల ఆరాధ్య దైవమైన మల్లికార్జున స్వామిని ఇక్కడి ప్రజలు దొంగమల్ల స్వామిగా, షష్ఠి మల్లన్నగా కొలుస్తుంటారు.
చాళుక్య శిల్పకళా రీతుల్లో ఉన్న ఈ ఆలయం పొలాస రాజులచే పదకొండో శతాబ్దములో నిర్మించబడింది. ఈ ఆలయాన్ని పొలాస రాజులు తమ్మడి వారికి అప్పగించారు. అప్పడి నుంచి తమ్మడి వారి ఆధీనంలో ఉండగా, వారు ఫౌండర్ ట్రస్టీలుగా ఉంటూ ఆలయంలో పూజలు నిర్వహిస్తున్నారు. ఈ గ్రామంలో ఆలయం ఉన్నందువల్లే గ్రామాన్ని మల్లన్నపేటగా పిలుస్తుంటారు. రెవెన్యూ రికార్డుల్లో మాత్రం ఈ గ్రామం పేరు తిర్మలాపురం (ఎమ్)గా ఉంటుంది. కాగా ప్రజల విన్నపం మేరకు ఈ ఏడాదిలోనే మంత్రి కొప్పుల ఈశ్వర్ గెజిట్ ద్వారా ఈ గ్రామం పేరును మల్లన్నపేటగా మార్చుతూ జీవో తీసుకువచ్చారు. అప్పటి నుంచి రెవెన్యూ రికార్డుల్లో మల్లన్నపేటగా మార్చారు.
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం మల్లన్నపేట మల్లికార్జున స్వామి జాతర ఉత్సవాలకు ఆలయం ముస్తాబైంది. ఈనెల 18 నుంచి జనవరి 10 వరకు జాతర నిర్వహించేందుకు ఆలయ కమిటీ ఏర్పాట్లు చేసింది. మార్గశిర మాస శుద్ధ పంచమి తర్వాత వచ్చే షష్ఠితో జాతర ఉత్సవాలు ప్రారంభం కావడంతో షష్ఠి మల్లన్న జాతరగా పిలుస్తారు. రెండు అంతస్తుల ఆలయంగా ఉండడంతో రెండు తలల ఆలయంగా పిలుస్తుంటారు. అంటే రెండంతస్తుల ఆలయాలు రాష్ట్రంలో అరుదుగా ఉన్నాయి. అందులో ఈ ఆలయం ఒక్కటి.
ఈనెల 17న రాత్రి స్వామి వారి కల్యాణం, సోమవారం మహా దండి వారం జాతర ప్రారంభం, ఆ తర్వాత వచ్చే ప్రతీ బుధ, ఆది వారాల్లో, ఏడు వారాల పాటు జాతర ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఫౌండర్ ట్రస్టీ కొండూరి శాంతయ్య, కార్యనిర్వహణాధికారి విక్రమ్ తెలిపారు. స్వామివారికి బోనాలు తీయడం, పట్నాలు వేయడం, బెల్లం (బంగారం) తూకంతో మొక్కులు చెల్లించుకోవడం ఇక్కడి ప్రత్యేకత.
స్వామివారికి ప్రీతిపాత్రమైన పరమాన్నం, బెల్లం అన్నంతో బోనాలు తీసి భక్తులు మొక్కలు చెల్లించుకుంటారు. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. జాతరకు ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. మంచినీటి వసతి, బోనాలు వండుకోవడానికి స్థలాన్ని చదును చేశారు. జగిత్యాల టీఎస్ ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు.
ఒక వైపు చలి పంజా విసురుతోంది. ఉదయం 9 గంటలైనా తీవ్రత తగ్గడం లేదు. చల్లటి గాలులతో జనాలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. అయితే, కొందరు ఉపాధి కోసం తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తుంది. ఇందులో ప్రధానంగా మత్స్యకారులు. వారు తమ బతుకుదెరువు కోసం ఉదయం, సాయంత్రం వేళల్లోనే చేపల వేటకు వెళ్తుంటారు.
ఇలా సుమారు 200 మంది కరీంనగర్ శివారులోని లోయర్ మానేరు డ్యాంలోకి వెళ్లి చేపలు పడుతారు. ఈ క్రమంలో శనివారం ఉదయం మంచు కురిసే వేళలో చేపల వేట కోసం మత్స్యకారులు ఇలా తెప్పలపై ప్రయాణం చేస్తుండగా ‘నమస్తే’ తన కెమెరాలో బంధించింది. – కరీంనగర్ స్టాఫ్ ఫొటోగ్రాఫర్