పేదల సొంతింటి కలను తెలంగాణ ప్రభుత్వం నిజం చేస్తున్నది. డబుల్బెడ్రూం ఇండ్లు నిర్మించి లబ్ధిదారులకు అప్పగిస్తున్నది. ఈ క్రమంలో తిమ్మాపూర్ గ్రామంలో నిర్మించిన 50 డబుల్ బెడ్రూం ఇండ్లను సోమవారం లాటరీ పద్ధతిలో కేటాయించనుండగా, లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
-తిమ్మాపూర్ రూరల్, ఆగస్టు 21
తిమ్మాపూర్ గ్రామంలోని హనుమాన్ ఆలయం సమీపంలో, రైతు వేదిక ఎదుట నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లు రాజీవ్ రహదారికి సమీపంలో ఉంటాయి. ఇందులో 6 బ్లాక్లలో 8 పోర్షన్ల చొప్పున, మరో రెండు పోర్షన్లను విడిగా మొత్తం 50 ఇండ్లు నిర్మించారు. ఒక్కో డబుల్బెడ్రూం పోర్షన్కు ప్రభుత్వం రూ.5.20 లక్షలు ఖర్చు చేయగా, బహిరంగ మార్కెట్ విలువ రూ. పది లక్షలకుపైగా ఉంటుంది.
పారదర్శకంగా అర్హుల ఎంపిక
గ్రామానికి చెందిన నిరుపేదలకు ఇండ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో మూడేళ్ల క్రితం నిర్మించగా, అర్హుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా చేపట్టారు. పాలకవర్గం, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా సర్వే చేసి లబ్ధిదారులను ఎంపిక చేశారు. గ్రామంలో పేదలను ఎంపిక చేసి తుది జాబితాను తయారు చేశారు. ఇందులో 27 ఇండ్లు బీసీలకు, 20 ఎస్సీలకు, 2 ఓసీలకు, ఒకటి మైనార్టీలకు కేటాయించారు.
ఆనందంలో లబ్ధిదారులు
50 ఇండ్లకు లబ్ధిదారులను ఎంపిక చేసినప్పటికీ ఎవరికి ఏ ఇల్లు, పోర్షన్ ఇవ్వాలనేది ఇంకా నిర్ణయించలేదు. నిర్మించి కళ్ల ముందు ఉన్న ఇండ్లను ఎప్పుడు ఇస్తారని.. లబ్ధిదారులు వేయి కండ్లతో వేచి చూస్తుండగా, అధికారులు సోమవారం లాటరీ తీయనుండడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ ఆర్వీ కర్ణన్, ఇతర ఉన్నతాధికారులు 50 ఇండ్లకు 50 మంది లబ్ధిదారుల పేర్లు రాసి లాటరీ పద్ధతిలో ఇండ్లను కేటాయించనున్నట్లు సమాచారం.
ఎలాంటి లాబీయింగ్ లేదు
ఇండ్ల కేటాయింపులో ఎలాంటి లాబీయింగ్ లేకుండా ఉండేందుకు బహిరంగంగా ఉన్నతాధికారుల సమక్షంలో లాటరీ తీస్తం. దీంతో లబ్ధిదారులకు బ్లాక్లలో ఎటు పక్క ఇల్లు వచ్చినా.. ఎవరికి ఎలాంటి అనుమానాలు ఉండవు. నేడు లాటరీ తీసి, త్వరలోనే పంపిణీ చేస్తం.
-కనకయ్య, తహసీల్దార్, తిమ్మాపూర్