మల్యాల, మే 16: నియోజకవర్గ అభివృద్ధి, ధాన్యం కొనుగోళ్ల విషయంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అసత్యాలు మాట్లాడొద్దని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ హితవు పలికారు. కొండగట్టులో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కొండగట్టులో తాగునీటి సమస్య పరిష్కారానికి బీఆర్ఎస్ హయాంలో రూ. 14 కోట్లు మంజూరు చేసి, పనులు ప్రారంభించినట్లు గుర్తు చేశారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పంప్హౌస్ నిర్మాణాన్ని గాలికి వదిలేసిందన్నారు.
మల్యాలలో జగ్గాని ఒర్రె ఆధునికీకరణకు బీఆర్ఎస్ హయాంలో రూ. 4.17 కోట్లు ప్రభుత్వం నుంచి అడ్మినిస్ట్రేషన్ సాంక్షన్ చేయించామన్నారు. కానీ, ఇటీవల ఎమ్మెల్యే సత్యం ఈ పనులను రూ. 2.46 కోట్లతో చేపట్టేందుకు భూమి పూజ చేశారన్నారు. బీఆర్ఎస్ హయాంలో మంజూరైన పనులు పూర్తయ్యేలా ఎమ్మెల్యే చొరవ చూపాలని సూచించారు.
ధాన్యం అదనంగా తూకం వేయడం లేదని ఎమ్మెల్యే సత్యం అసత్యాలు మాట్లాడుతున్నాడని, మిల్లర్లపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని ప్రకటనలు చేస్తున్నాడే తప్ప, ఎంతమందిపై కేసు నమోదు చేయించాడని ప్రశ్నించారు.? రామడుగు మండలం వెంకటగిరి గ్రామంలో ఇప్పటికీ కిలో ధాన్యం తూకం వేయలేదన్నారు. అనంతరం ముత్యంపేట గ్రామ శివారులో పంప్హౌస్ నిర్మిస్తున్న స్థలాన్ని పరిశీలించారు. ఈ సమావేశంలో సహకార సంఘం అధ్యక్షులు అయిల్నేని సాగర్రావు, బోయినిపల్లి మధుసూదన్రావు, బీఆర్ఎస్ నాయకులు జనగం శ్రీనివాస్, బద్ధం తిరుపతిరెడ్డి, గడ్డం రాజేశ్వర్, త్రినాథ్, మల్లేశం, అల్లూరి అనిల్రెడ్డి, ఆకుల నగేశ్, మిట్టపల్లి దశరథం పాల్గొన్నారు.