వేములవాడ జనవరి 22:ఏదైనా పని గుత్తకు పడితే పూర్తయ్యేదాకా చేస్తాం.. లాభమో.. నష్టమో చివరి దాకా చూసుకుంటూ పేరు నిలబెట్టుకుంటాం.. కానీ వేములవాడ ఆలయంలో ఒడి బియ్యం, ఎండు కొబ్బరి, బెల్లం సేకరణకు టెండర్లు దక్కించుకుంటున్న కాంట్రాక్టర్లలో పలువురు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వేలం అనగానే చటుక్కున వాలిపోతూ, పాట మీద పాట పాడి తీరా హక్కులు దక్కాక పెడమొహం వేస్తున్నారు. నిర్ణీత మొత్తంలో 15 రోజుల్లో 50శాతం చెల్లించేందుకు వెనుకడుగు వేస్తుండగా అలాంటి వారిపై ఆలయ అధికారులు కొరఢా ఝులిపిస్తున్నారు. డబ్బులు కట్టని వారి డిపాజిట్ డబ్బులు స్వాధీనం చేసుకుంటూ మళ్లీ వేలం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఒకరి టెండర్ రద్దు చేసి, మరొకరిపైనా చర్యలకు రంగం సిద్ధం చేస్తుండగా, అధికారుల చర్యలపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రాజన్న ఆలయంలో పలు దుకాణాల నిర్వహణ, భక్తుల సమర్పించే కానుకల సేకరణ హక్కుల కోసం పోటీ పడుతున్న కాంట్రాక్టర్లు తీరా దక్కాక వదిలేస్తున్నారు. పోటీపడి ఎక్కువ మొత్తంలో పాడి చెల్లించాల్సిన మొత్తంలో 50శాతం 15రోజుల్లో కట్టకుండా వెనుకడుగు వేస్తుండగా, అధికారులు కాంట్రాక్టు రద్దు చేస్తున్నారు. గతేడాది నవంబర్ 18న ఆలయంలో భక్తులు సమర్పించే ఒడి బి య్యం, ఎండు కొబ్బరి, బెల్లం సేకరణ హక్కులకు అధికారులు టెండర్లు నిర్వహించారు. 2023-25 రెండేళ్లకుగాను రూ.8లక్షల డిపాజిట్ చెల్లించి వేలంలో పాల్గొన్న కాంట్రాక్టర్ ముడికే నరేశ్ రూ.1.35కోట్లకు హక్కులు దక్కించుకున్నాడు. గతంలో రెండేళ్లకు రూ.48లక్షలుగా ఉన్న ఈ హక్కును అధిక మొత్తం పాడి చేజిక్కిచ్చుకున్నా డు.
అయితే ఇందులో 50శాతం అంటే రూ.67.50లక్షలు 15రోజుల్లో చెల్లించాల్సి ఉండగా, సదరు కాంట్రాక్టర్ ముందుకు రాకపోవడంతో అధికారులు చర్యలకు ఉపక్రమించారు. నోటీసులు జారీ చేసి అతను చెల్లించిన రూ.8లక్షల డిపాజిట్ సొమ్మును స్వాధీనం చేసుకుని కాంట్రాక్టు రద్దు చేశారు. ఇక రాజన్న దత్తత ఆలయం నాంపల్లి లక్ష్మైనర్సింహా స్వామి సన్నిధిలో నూనె గురుగుల కాంట్రాక్టు కోసం డిసెంబర్ 18న టెండర్ నిర్వహించారు. కాంట్రాక్టర్ సిద్ధార్థ రూ.5లక్షల డిపాజిట్ చెల్లించి వేలంలో పాల్గొన్నాడు. 2023-25 రెండేళ్లకుగాను రూ.కోటి వెయ్యి నూటపదహార్లకు పాటపాడి హక్కులు దక్కించుకున్నాడు. అయితే 50శాతం చెల్లించేందుకు ముందుకురాకపోవడంతో అధికారులు చర్యలకు రంగం సిద్ధం చేశారు. ఫైనల్ నోటీస్ అందించి రద్దు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గతంలో ఈ టెండర్ రెండేళ్లగాను రూ.61.55లక్షలుగా ఉండగా, హెచ్చుగా పా డి మరీ దక్కించుకున్న సిద్దార్థ ఇప్పుడు వెనక్కి తగ్గినట్లు తెలుస్తున్నది. టెండర్ నిబంధనలు పాటించని వారి పై ఆలయ అధికారులు కఠినంగా వ్వవహరిస్తుండగా ముం దస్తు అంచనా వేయడంలో విఫలమైన కాంట్రాక్టర్లు లక్షల రూపాయల డిపాజిట్లు సైతం వదిలించుకుంటున్నారు.
కఠినంగా వ్యవహరిస్తున్నాం..
రాజన్న ఆలయంలో దుకాణాల నిర్వహణ, భక్తుల కానుకల రూపంలో సమర్పించే ఒడి బియ్యం, ఎం డు కొబ్బరి, బెల్లం సేకరణ హక్కులు పొంది, నిబంధనలు పాటించని కాంట్రాక్టర్లపై కఠినంగా వ్యవహరిస్తున్నాం. కాంట్రాక్ట్ దక్కించుకున్న గుత్తేదారులు నిర్ణీత మొత్తంలో 50శాతం 15రోజుల్లో చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇటీవల హక్కులు దక్కించుకున్న ఓ కాంట్రాక్టర్ నిర్ణీత సమయంలో డబ్బులు చెల్లించకపోవడంతో డిపాజిట్ స్వాధీనం చేసుకుని రద్దుచేసి మళ్లీ నిర్వహిస్తున్నాం. నాంపల్లికి సంబంధించి కూడా ఫైనల్ నోటీస్ సిద్ధం చేశాం.
– కృష్ణప్రసాద్, ఆలయ ఈవో