జగిత్యాల అర్బన్, డిసెంబర్ 14 : ఫేక్ జీఎస్టీ ఖాతాల ద్వారా రూ.కోట్ల లావాదేవీలు జరిపారని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు జగిత్యాలకు చెందిన ఓ వ్యక్తిని గురువారం అదుపులోకి తీసుకున్నారు. వాణిజ్య పన్నుల శాఖ హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్లు వేణుగోపాల్, బాలాజీ జగిత్యాల వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో మాట్లాడారు.
జగిత్యాల పట్టణానికి చెందిన చంద సాయి హైదరాబాద్లోని ఓ ట్యాక్స్ కన్సల్టెంట్ వద్ద పనిచేస్తున్నాడని, రద్దయిన వివిధ రకాల సొసైటీల పేరు మీద ఫోన్ నంబర్లు, మెయిల్ ఐడీలు మార్చి కోట్ల రూపాయల లావాదేవీలు జరిపి జీఎస్టీ క్లెయిమ్ చేశారని, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు గురువారం జగిత్యాలలో సాయి ఇంట్లో సోదాలు చేశామని తెలిపారు. ప్రాథమికంగా 30 ఫేక్ ఖాతాల్లో లావాదేవీలు జరిగినట్లు గుర్తించామని, పూర్తి స్థాయిలో విచారిస్తే కాని గోల్మాల్ జరిగిన మొత్తం విలువ తెలుస్తుందని, విచారణ పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.