హుజూరాబాద్ టౌన్, డిసెంబర్ 19: హుజూరాబాద్ పట్టణాభివృద్ధికి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని స్థానిక పురపాలక సంఘం చైర్పర్సన్ గందె రాధికాశ్రీనివాస్ సూచించారు. పట్టణంలోని పోచమ్మ దేవాలయంలో అభివృద్ధి పనుల (గద్దెల నిర్మాణం, కలరింగ్)ను సోమవారం చైర్పర్సన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి సాధిస్తున్నదన్నారు.
తెలంగాణ పట్టణాలు, పల్లెలు అభివృద్ధిలో దేశంలోని ప్రముఖ పట్టణాలతో పోటీ పడి స్వచ్ఛ భారత్, స్వచ్ఛ సర్వేక్షణ్లో అత్యధిక అవార్డులను సొంతం చేసుకోవడం రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఇటీవల ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి కృషి వల్ల పట్టణానికి నిధుల వరద పారుతున్నదని, వాటితో పట్టణంలో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పారు. ఆయా పనులు నాణ్యతతో సాగేలా పర్యవేక్షణ బాధ్యత పట్టణ ప్రజలపై కూడా ఉందన్నారు.
కార్యక్రమంలో బల్దియా వైస్ చైర్పర్సన్ కొలిపాక నిర్మలాశ్రీనివాస్, కౌన్సిలర్ అపరాజ ముత్యంరాజు, మున్సిపల్ కమిషనర్ సల్వాది సమ్మయ్య, మున్సిపల్ ఏఈ జీ సాంబరాజు, వర్క్ ఇన్స్పెక్టర్ మోటపోతుల వినయ్, బీఆర్ఎస్ నాయకులు పోరెడ్డి శాంతన్రెడ్డి, యువ నాయకులు భూమ్ రామకృష్ణ, పోరెడ్డి మధుకర్రెడ్డి, పంజాల సమ్మయ్య, ఆలయ చైర్మన్ కొలిపాక రమేశ్, డైరెక్టర్లు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.