కార్పొరేషన్, మార్చి 21: కరీంనగర్ను సుందరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగు ల కమలాకర్ స్పష్టం చేశారు. స్థానిక కమాన్ చౌరస్తా నుంచి కేబుల్ బ్రిడ్జి వరకు రూ. 90 లక్షలతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ను మంగళవారం రాత్రి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ, బీఆర్ఎస్ హయాంలో నగరంలోని అన్ని రోడ్లను సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.
మానేరు వాగుపై కేబుల్ బ్రిడ్జి నిర్మాణంతో నగరానికి కొత్త శోభ రానుందన్నారు. అతి త్వరలోనే ఈ బ్రిడ్జిని ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ వై సునీల్రావు, కార్పొరేటర్లు అనూప్కుమార్, లెంకల స్వప్న, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, బీఆర్ఎస్ నాయకులు మహేశ్, పవన్, చిట్టిమల్ల శ్రీనివాస్, ఎంఐఎం నాయకుడు అహ్మద్ పాల్గొన్నారు.