కలెక్టరేట్, జనవరి 25 : 74వ గణతంత్ర వేడుకలకు వేళయింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సర్వం సిద్ధమైంది. ఆయా జిల్లాల్లో కలెక్టరేట్లను యంత్రాంగం సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసింది.ఆయాచోట్ల కలెక్టర్లు జాతీయ పతాకాలను ఎగురవేయనుండగా, అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
గణతంత్ర వేడుకలకు ఉమ్మడి జిల్లాలో సర్వం సిద్ధం చేశారు. స్వాతంత్య్ర సమరయోధులకు సత్కారం, వివిధ రంగాల్లో ఉత్తమ సేవలందించిన వారికి పురస్కారాలు అందజేయనున్నారు. కాగా, కరీంనగర్లో జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో వేడుకలు నిర్వహించనుండగా, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ జెండాను ఆవిష్కరించనున్నారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్లో జాతీయ పతాకాన్ని కలెక్టర్ గగులోతు రవి ఆవిష్కరించనున్నారు. అనంతరం విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభను కనబరిచిన అధికారులు ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందజేస్తారు.
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో సమీకృత కార్యాలయంలో తొలిసారిగా గణతంత్ర వేడుకలు జరుగనున్నాయి. కార్యాలయం ఆవరణలో 36ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఉండగా, భవనం ప్రాంగణంలోని పరేడ్ గ్రౌండ్లో వేడుకలకు ఏర్పాట్లు చేశారు. కలెక్టరేట్ కార్యాలయం ఎదురుగా నిర్మించిన భారీ జాతీయ పతాకాన్ని కలెక్టర్ సంగీత సత్యనారాయణ ఆవిష్కరించనున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం(ఐడీవోసీ) సిద్ధమైంది. గురువారం ఉదయం 9.00 గంటలకు కలెక్టర్ అనురాగ్ జయంతి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం కలెక్టర్ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు. అనంతరం విధి నిర్వహణలో ప్రతిభ చూపిన అధికారులు, ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందజేస్తారు.