కార్పొరేషన్, మే 25: మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటునందిస్తున్నదని, ఇందులో భాగంగా మహిళా సంఘాలకు స్కూల్స్ యూనిఫామ్స్ కుట్టే బాధ్యతను అప్పగించిందని కల్టెకర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. నగరంలోని భాగ్యనగర్, సరస్వతీనగర్లో మెప్మా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్కూల్స్ యూనిఫామ్ స్టిచ్చింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, విద్యార్థులు సంవత్సర కాలం ధరించేలా డబుల్ స్టిచ్చింగ్తో యూనిఫామ్స్ మన్నికగా ఉండాలన్నారు. అలాగే స్కూల్ పిల్లలకు అవసరమయ్యే జ్యూట్ బ్యాగులను తయారు చేయాలని సూచించారు. వాటిని పిల్లలు కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. జూన్ 5లోగా యూనిఫామ్స్ సిద్ధం కావాలని ఆదేశించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని వసతులతో అత్యుత్తమైన విద్యనందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇందులో భాగంగానే పాఠశాలల్లో మరమ్మతు పనులు చేపట్టామన్నారు. విద్యార్థులు కొత్త వాతావరణంలో అడుగుపెట్టేలా పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామన్నారు. పాఠశాలలు ప్రారంభం కాగానే విద్యార్థులకు ఉచిత పుస్తకాలు, యూనిఫామ్స్ అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఇన్చార్జి మెప్మా పీడీ స్వరూపారాణి, డీఎంసీ శ్రీవాణి, టీఎంసీ అనిత, సీఈవోలు, మహిళా సంఘాల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.