తెలంగాణచౌక్, డిసెంబర్ 9: మహిళలకు రక్షణ కల్పించడంతోపాటు మహిళా సాధికారతను సాధించే దిశగా ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించారని కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ పథకాన్ని శనివారం ఆమె ఆర్టీసీ అధికారులతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వయసుతో సంబంధం లేకుండా బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లు ఆర్టీసీ పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో రాష్ట్రంలో ఏ ప్రాంతానికైనా ప్రయాణం చేయవచ్చని తెలిపారు.
బస్సుల్లో ప్రయాణించే మహిళలకు జీరో చార్జీ టికెట్లు అందించారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత ప్రయాణం సదుపాయాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న ట్రాన్స్జెండర్లను ఆర్టీసీ డ్రైవర్లుగా నియమిస్తామని తెలిపారు. ఆసక్తి ఉన్న వారికి డ్రైవింగ్లో ఉచితంగా శిక్షణ ఇప్పిస్తామని చెప్పారు. అనంతరం ప్రభుత్వ దవాఖాన నుంచి బస్సులో మహిళలు, ట్రాన్స్జెండర్లతో కలిసి కలెక్టర్ పమేలా సత్పతి కోర్టు చౌరస్తా, గీతాభవన్ మీదుగా బస్టాండ్ వరకు ప్రయాణం చేశారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ మాధవి, డిప్యూటీ ఆర్ఎం భూపతిరెడ్డి, డిపో-1, 2 మేనేజర్లు మల్లేశం, మల్లయ్య, ఏటీఎం రజినీకృష్ణ, ఆర్టీసీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.