కరీంనగర్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ) : రుణాల పంపిణీలో కరీంనగర్ జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. రైతులకు రుణాల పంపిణీ, స్వయం సహాయక సంఘాల రుణాల రికవరీ, పీఎంజీపీవై రుణాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల పథకాలకు సంబంధించి రుణ లక్ష్య పురోగతిపై బుధవారం కలెక్టరేట్లో జరిగిన డీసీసీ, డీఎల్ఆర్సీ సమీక్షా సమావేశంలో కలెక్టర్ పమేలా సత్పతి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె బ్యాంకర్లను అభినందించి మాట్లాడారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 9,924 స్వయం సహాయక బృందాలకు 640.35 కోట్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకుని ఫిబ్రవరి 2024 వరకు 10,643 స్వయం సహాయక బృందాలకు 677.69 కోట్లు లింకేజీ ద్వారా అందించి 105.83 శాతం ప్రగతి సాధించినట్లు చెప్పారు.
లక్ష్య సాధనలో రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. ప్రధాన మంత్రి ఫార్మాలైజేసన్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ (పీఎంఎఫ్ఎంఈ) పథకం కింద 572 యూనిట్లు లక్ష్యం కాగా, 190 యూనిట్లు గ్రౌండింగ్ చేసినట్లు తెలిపారు. లబ్ధిదారులకు వివిధ కార్యకలాపాల ద్వారా బేకరీ, స్పైసస్, ఫ్లోర్మిల్, రోస్టర్ మెషిన్, దాల్ మిల్, బియ్యం ఆధారిత ఉత్పత్తులు, తదితర యూనిట్లను గ్రౌండింగ్ చేసినట్లు చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి డిసెంబర్ నెలాఖరు వరకు 7,980.08 కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు. అందులో వ్యవసాయ రంగానికి 3,528.12 కోట్లు, ఎంఎస్ఎంఈ రంగంలో 1,551.52 కోట్లు, గృహ రుణాలు 225.18 కోట్లు, స్వయం సహాయక సంఘాలకు 677.69 కోట్లు, ఇతర రంగాలకు 1,983.40 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉన్న లక్ష్యాల్లో 106.66 శాతం పూర్తయ్యిందన్నారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, జిల్లాలోని అన్ని సినిమా థియేటర్లలో లఘు చిత్రాలను ప్రదర్శించాలని, సైబర్ నేరాల బాధితుల వివరాలు, ఫొటోలను వెల్లడించకుండా వారు ఎలా నష్టపోయారో తెలిసేలా ప్రచార కార్యక్రమాలకు రూపకల్పన చేయాలని సూచించారు.
అనంతరం 100 మోడల్ సీఎస్సీ పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. సమావేశంలో ఎల్డీఎం ఆంజనేయులు, అర్బీఐ అధికారి సాయి తేజ, నాబార్డ్ ఏజీఎం ప్రకాశ్, ఎస్బీఐ చీఫ్ మేనేజర్ రామచంద్రుడు, యూబీఐ చీఫ్ మేనేజర్ కలీం, టీజీబీ ఏసీఎం ప్రభుదాస్, కేడీసీసీబీ సీఈఓ సత్యనారాయణ, అన్ని బ్యాంకుల కంట్రోలర్, కరీంనగర్ లోకల్ బ్రాంచ్ మేనేజర్లు, డీఆర్డీవో శ్రీధర్, డీఏవో ప్రియదర్శిని, జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం నవీన్, డీడబ్ల్యూవో సరస్వతి, ఉద్యాన శాఖ డీడీ శ్రీనివాస్, చేనేత శాఖ ఏడీ చరణ్, అడిషనల్ డీఆర్డీఏ సునీత, డీపీఎం రవీందర్ పాల్గొన్నారు.