విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో పెద్దపల్లి కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి బుధవారం జిల్లా అధికారి ఓ పాఠశాల లేదా గురుకులంలో వసతులను పరిశీలించి.. సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో గత నెల 13న ‘లంచ్ అండ్ లర్న్’ను ప్రారంభించారు. ఈ కార్యక్రమం సత్ఫలితాలనిస్తున్నదని అధికారులు చెబుతున్నారు.
పెద్దపల్లి, జనవరి 17 (నమస్తే తెలంగాణ) : ‘లంచ్ అండ్ లర్న్’లో భాగంగా కలెక్టర్, అదనపు కలెక్టర్లతో సహా జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు ప్రతి బుధవారం ఒక ప్రభుత్వ పాఠశాలను సందర్శించాలి. అక్కడి విద్యార్థులకు అందుతున్న విద్యా బోధన, వసతి సౌకర్యాలు, పరిసరాలను పరిశీలించాలి. అంతేకాకుండా విద్యార్థులతోనే కలిసి మధ్యాహ్న భోజనం చేయాలి. ఆ తర్వాత పాఠశాలపై ఒక చెక్ లిస్ట్ను నింపి జిల్లా విద్యాశాఖకు పంపించాలి.
దాని ఆధారంగా అక్కడ మెరుగైన బోధనతోపాటు వసతులు కల్పించేందుకు కృషి చేస్తారు’ ఇలా ఒక గొప్ప ఉద్దేశ్యంతోనే కలెక్టర్ ముజామ్మిల్ఖాన్ ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించి డిసెంబర్ 13న ప్రారంభించారు. మొట్టమొదట పెద్దపల్లిలోని మైనార్టీ గురుకుల బాలికల పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. మధ్యాహ్న సమయంలో విద్యార్థులతో కలిసి లైన్లో నిలబడి ప్లేటులో భోజనం పెట్టుకొని, డైనింగ్ హాల్లో భోజనం చేశారు. విద్యాబోధన, వసతి సౌకర్యాలు, భోజనం, ఇతర అంశాలన్నీ పరిశీలించి ఒక చెక్ లిస్ట్ తయారు చేశారు. ఇలానే జిల్లాలోని అధికారులంతా పాఠశాలలను సందర్శిస్తున్నారు. కెరీర్ గైడెన్స్ సంబంధిత అంశాలను వివరిస్తూ.. పిల్లలను చదువుపై ఆసక్తి పెంచుతున్నారు. అలాగే చెక్లిస్ట్ను తయారు చేసి విద్యాశాఖకు పంపిస్తున్నారు.
మొదటి విడుతగా జిల్లాలోని ఐదు ప్రభుత్వ పాఠశాలలను కలెక్టర్ సహా అధికారులు దత్తత తీసుకున్నారు. కొత్తూరును కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్, ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ను డీఆర్డీవో శ్రీనివాస్, కటికెనపల్లిని డీఈవో మాధవి, జూలపల్లి మండలం కాచాపూర్ను షేక్, రామగుడం ఎఫ్సీఐ స్కూల్ను అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్లాల్ దత్తత తీసుకున్నారు.
సర్కారు విద్యాలయాల్లో, వసతి గృహాల్లో విద్య, ఆహార నాణ్యత, వసతులను మెరుగుపర్చడంతో పాటు విద్యపై భరోసా కల్పించాలనే లక్ష్యంతో ‘లంచ్ అండ్ లర్న్’ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాం. జిల్లా స్థాయి అధికారి వచ్చి విద్యార్థులతో గడపడం వల్ల వారికి చదువుపై ఆసక్తి కలుగుతుంది. సక్సెస్ గురించి జిల్లా అధికారుల బృందం విద్యార్థులను మోటివేట్ చేస్తున్నది. ప్రతి సోమవారం ప్రజావాణి పూర్తయిన తర్వాత ఈ కార్యక్రమంపై జిల్లా అధికారులతో సమీక్షిస్తున్నాం. ఇప్పుడిప్పుడే సత్ఫలితాలు వస్తున్నాయి. ఇంకా మంచి సక్సెస్ సాధిస్తాం.
– ముజామ్మిల్ఖాన్, కలెక్టర్ (పెద్దపల్లి)
లంచ్ అండ్ లర్న్ కార్యక్రమం ద్వారా బహుళ ప్రయోజనాలు నెరవేరుతున్నాయి. జిల్లా అధికారి విద్యార్థుల వద్దకే రావడంతో ఎలాంటి ఇబ్బంది ఉన్నా చెప్పుకునే అవకాశం ఉంటుంది. నేను మూడు పాఠశాలలను సందర్శించిన. మొదటి వారానికి మూడో వారానికి చాలా తేడా ఉన్నది. ఈ కార్యక్రమం వల్ల విద్యార్థులకు చాలా మంచి జరుగుతున్నది.
-చందుపట్ల శ్రీమాల, జిల్లా సహకార అధికారి (పెద్దపల్లి)