చొప్పదండి నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి సుంకె రవిశంకర్ విజయాన్ని కాంక్షిస్తూ బీఆర్ఎస్ గంగాధర మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద యాత్ర గ్రాండ్ సక్సెస్ అయింది. నియోజకవర్గ చరిత్రలో ఏ పార్టీ నిర్వహించనంత పెద్ద భారీ బహిరంగ సభను చొప్పదండి గులాబీ శ్రేణులు గంగాధరలో నిర్వహించడం చర్చనీయాంశమైంది. సభకు ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, 20 నిమిషాల పాటు చేసిన ప్రసంగం ప్రజలను ఆశ్చర్యంలో, ఆలోచనలో పడేసింది. గంగాధర మండలం పత్తికుంటపల్లెలో 16 ఎకరాల స్థలంలో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభను ఏర్పాటు చేశారు. ప్రజల కోసం భారీ చలువ పందిళ్లు, ఆహుతులు, ప్రజాప్రతినిధులు నాయకుల కోసం భారీ వేదికను ఏర్పాటు చేశారు. సభకు నియోజకవర్గంలోని గంగాధర, రామడుగు, చొప్పదండి, బోయినిపెల్లి, మల్యాల, కొడిమ్యాల మండలాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. దాదాపు 70వేల మంది వచ్చారు. బహిరంగ సభకు కిలోమీటర్ల దూరంలో పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు.
ఉదయం 11 గంటల నుంచే గంగాధర పట్టణంలో జనసందోహం ప్రారంభమైంది. పిల్లలు, యువతీ యువకులు, వృద్ధులు, మహిళలు, పురుషులు, గంపులుగుంపులుగా సభాస్థలికి రావడం కనిపించింది. గంగాధర పట్టణానికి వచ్చే మార్గంలో జగిత్యాల వైపులో పూడురు నుంచి ట్రాఫిక్ జామ్ అయి వాహనాలు నిలిచిపోయాయి. కరీంనగర్ వైపు వెదిర నుంచి వాహనాలు రోడ్డుపైనే నిలిచిపోయాయి. గంగాధర, బోయినిపెల్లి మండలాలకు సంబంధించిన వాహనాలతో గంగాధరకు పశ్చిమ భాగంలో సిరిసిల్ల వైపు ఉన్న రహదారి పూర్తిగా నిండిపోయింది. మధ్యాహ్నం 2 గంటల వరకు సభా స్థలి పూర్తిగా నిండిపోవడంతో పాటు, పక్కనే ఉన్న మామిడివనం మొత్తం ప్రజలతో కిక్కిరిసింది. సీఎం కేసీఆర్ వచ్చే వరకు సైతం ప్రజలు సభాస్థలికి సమీపంలో ఉన్న పొలాల గట్ల నుంచి సైతం తరలిరావడం కనిపించింది. రెండున్నర గంటల వరకు సభాస్థలం పూర్తిగా నిండిపోయి, ప్రజలు నిలబడేందుకు సైతం స్థలం లేని స్థితికి చేరుకుంది. సభ వేదిక వద్ద కళాకారులు సభను ఉర్రూతలూగించే విధంగా గేయాలను, సాంస్కృతిక కార్యాక్రమాలను ప్రదర్శించడంతో ప్రజలు సైతం కళాకారులతో కాలుకదిపారు.
మధ్యాహ్నం 3.03 గంటలకు సీఎం కేసీఆర్ సభా వేదికపై చేరుకున్నారు. ప్రజలకు అభివాదం చేశారు. తొలిసారిగా కేసీఆర్ గంగాధరలో సభలో పాల్గొనడంతో ప్రజలు ఆయనను చూసేందుకు ఉత్సాహం ప్రదర్శించారు. 3.05 గంటలకు సీఎం కేసీఆర్ ప్రసంగం ప్రారంభించారు. ఎన్నికల సమయంలో ప్రజలు ఆగంఆగం కావద్దు అంటూ, పార్టీల అభ్యర్థులు, వారి గుణగణాలను పరిశీలించడంతో పాటు, వారు ఏపార్టీల తరపున నిలబడ్డారు, పార్టీల గత చరిత్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై వారి దృక్పథాన్ని ప్రజలు విశ్లేషించుకోవాలన్నారు. పదేండ్ల కాలంలో బీఆర్ఎస్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను సోదాహరణంగా వివరించడంతో పాటు, చొప్పదండి నియోజకవర్గంలోని వరద కాలువ, కాకతీయ కాలువ దుస్థితి, రైతులు సాగు, తాగునీటి కోసం పడ్డ వేదనను కండ్లకు కట్టినట్లు వివరించారు. అలాగే రాంచంద్రాపూర్ రైతు బోర్లు వేసివేసి చనిపోయిన దీనగాథను ప్రజల ముందుంచారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు రేవంత్రెడ్డి, ఉత్తమ్ కుమార్రెడ్డి చేస్తున్న ధరణి, రైతుబంధు, 24 గంటల విద్యుత్ వ్యతిరేక పద్ధతులను ప్రజలకు అర్థమయ్యేలా వివరించారు.
ఒకవేళ ప్రజలు వారికి ఓటు వేస్తే భవిష్యత్తు అంధకారం అవుతుందని, ఇన్నేళ్లు చేసినా కృషి వ్యర్థమవుతుందంటూ, వైకుంఠంలో పెద్దపాము మింగినట్లు అవుతుందని పూసగుచ్చినట్లు చేసిన ప్రసంగం ప్రజలను ఆలోచనలో పడేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తిరిగి గెలిపించాల్సిన ఆవశ్యకతను గూర్చి ప్రజలు చర్చించుకోవడం మొదలు పెట్టగా, చొప్పదండి గులాబీ శ్రేణులు సంతోషంలో మునిగిపోయాయి. కొత్త జోష్ నెలకొన్నది. కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణ గౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బోయినపల్లి ప్రేమ్సాగర్రావు, ముదుగంటి సురేందర్ రెడ్డి, వీర్ల వెంకటేశ్వరరావు, కొత్త జయపాల్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, చొప్పదండి మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ, ఎంపీపీలు శ్రీరాం మధుకర్, చిలుక రవీందర్,
మెన్నేని స్వర్ణలత, పర్లపల్లి వేణు, కలిగేటి కవిత, జడ్పీటీసీలు మాచర్ల సౌజన్య, కత్తెరపాక ఉమ, పునుగోటి ప్రశాంతి, కొండపలకల రామ్మోహన్ రావు, మారెట్ కమిటీ చైర్మన్లు గడ్డం చుకారెడ్డి, లోకిని ఎల్లయ్య, నరేందర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్లు దూలం బాలాగౌడ్, వెలిచాల తిరుమల్రావు, వెల్మ మల్లారెడ్డి, మెన్నేని రాజనర్సింగరావు, ఒంటెల మురళీకృష్ణారెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షులు మేచినేని నవీన్ రావు, వెల్మ శ్రీనివాస్ రెడ్డి, గంట్ల జితేందర్ రెడ్డి, పులి వెంకటేశ్ గౌడ్, జనగం శ్రీనివాస్, కత్తెరపాక కొండయ్య, మారెట్ కమిటీ మాజీ చైర్మన్లు సాగి మహిపాల్ రావు, ఆరెల్లి చంద్రశేఖర్ గౌడ్, నాయకులు అమిత్ కుమార్, మాచర్ల వినయ్కుమార్, కరబూజ తిరుపతి, చొప్పదండి నియోజకవర్గంలోని ఆరు మండలాలకు చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.