కేంద్రంపై నల్లసూర్యుల రణం
టీబీజీకేఎస్ సహా జాతీయ సంఘాలన్నీ మూకుమ్మడిగా పోరాటం
మూడు రోజులపాటు ఆందోళన
నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్
కోల్ బ్లాక్స్ వేలాన్ని నిలిపివేయాలని ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ
కరీంనగర్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి);నల్లనేల జంగ్ సైరన్కు సిద్ధమైంది. సిరుల గని సింగరేణికి ముప్పు తెచ్చేలా కేంద్రం తీసుకున్న నిర్ణయంపై కార్మికలోకం ఆందోళనబాట పట్టింది. రాజకీయాలకు అతీతంగా సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. టీబీజీకేఎస్ సహా జాతీయ సంఘాలు నేటి నుంచి సమ్మెకు దిగుతున్నాయి. 72 గంటల పాటు అంటే మూడు రోజులు కార్మికులతో కలిసి ఎక్కడికక్కడ ఆందోళనలు చేయనున్నాయి. వేలం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూనే.. ఏమాత్రం తగ్గేదిలేదని స్పష్టం చేస్తున్నాయి. ఇటు కోల్ బ్లాక్స్ వేలాన్ని నిలిపివేయాలని బుధవారం ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకున్నది.
కరీంనగర్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అభివృద్ధి పథంలో శరవేగంగా దూసుకెళ్తున్న సింగరేణిని ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్రం కుట్రలు పన్నుతున్నదా..? ఇతర పబ్లిక్ రంగ సంస్థల మాదిరిగానే సిరులగని సింగరేణిని కార్పొరేట్ కంపెనీలకు దారాదత్తం చేసేందుకు కేంద్ర సర్కారు పక్కా ప్రణాళికతో వ్యుహం రచించిందా..? కొత్త గనులను నిర్వహించే సామర్థ్యం.. సత్తా ఉన్నా.. సింగరేణి ని నిర్వీర్యం చేసి కార్మికుల ప్రయోజనాలను దెబ్బతీసే కుట్ర లు, కుతంత్రాలకు తెరలేపిందా..? అంటే.. ప్రస్తుతం అన్ని సంఘాలు అవుననే అంటున్నాయి. వందేళ్ల సింగరేణి చరిత్రలో ఏనాడూ లేని బ్లాకుల వేలం విషయాన్ని, ఇప్పుడు కేంద్రం తెరపైకి తేవడమే దీనికి నిదర్శనమంటున్నాయి. నాలుగు బ్లాక్లను వేలం వేయాలనే కేంద్రం తీసుకున్న నిర్ణయంపై భగ్గమంటున్నాయి. రాజకీయాలకు అతీతంగా సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చి కాషాయ పార్టీ తీరుపై కన్నె ర్ర చేస్తున్నాయి. నేటి నుంచి ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమయ్యాయి.
అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న సింగరేణి..
‘తల్లి నువ్వు నవ్వితే మాగాణి.. ఎద తలుపుతీస్తే సింగరేణి’ అన్నాడు ఓ కవి! నిజంగానే సింగరేణి ఇప్పుడు నవ్వుతున్నది. సమైక్య సంకెళ్లను తెంచి స్వరాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్.. ఆ దిశగానే సింగరేణి కార్మికులను కష్టాల నుంచి విముక్తి చేస్తున్నారు. నేనున్నాంటూ భరోసా కల్పించడమేకాదు, సింగరేణి కాలరీస్ కంపెనీగా ఆవిర్భవించిన 101 ఏళ్ల చరిత్రలో అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలు, కార్మికుల డిమాండ్లను పరిష్కరిస్తూ కార్మిక కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారు. సమైఖ్య రాష్ట్రంలో నల్లసూర్యుల బతుకుల్లో చీకట్లు అలుముకోగా.. ప్రస్తుతం ప్రతి కార్మికుడి ఇంట చిరునవ్వులు కనిపిస్తున్నాయి.
ఇదీ నల్లనేల చరిత్ర..
గలగలాపారే గోదావరి పాదాల చెంతన 350 కిలోమీటర్ల పొడవునా విస్తరించిన సింగరేణికి ఈ డిసెంబర్ 23తో 101ఏళ్లు నిండుతున్నాయి. 1889లో ఇల్లెందు వద్ద బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించి.. 1920లో సింగరేణి కాలరీస్ కంపెనీగా పేరు మార్చుకుంది. 1945లో నిజాం ప్రభువు సింగరేణి షేర్లను కొనుగోలు చేయడంతో తొలి ప్రభుత్వ రంగ సంస్థగా మారింది. ఇప్పటికే సింగరేణిలో పరిధిలో 26 భూగర్భ, 20 ఉపరితల గనులున్నాయి. 45వేలకుపైగా ఉద్యోగులు, సుమారు 30వేల మంది ఒప్పంద ఉద్యోగులు పని చేస్తున్నారు. 2020లో సాధించిన ఉత్పత్తి 64 మిలియన్ టన్నులు కాగా.. 2025 నాటికి వంద మిలియన్ టన్నుల లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందుకెళ్తున్నది. సమైక్య రాష్ట్రంలో చీకట్లు అలుముకున్న సింగరేణి స్వరాష్ట్రంలో పరుగులు పెడుతున్నది. యజమాని, శ్రామిక సంబంధాలను మానవ సంబంధాలుగా మారుస్తూ సింగరేణి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నది. లాభాల వాటా, కారుణ్య నియామకాలు, దసరా అడ్వాన్స్, కార్మికుల సొంత గృహాల కోసం రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణం, కార్మికుల తల్లిదండ్రులకు కార్పొరేట్ వైద్య సదుపాయం ఇలా ఎన్నో ఉన్నాయి.
ఒక్క మాటలో చెప్పాలంటే దేశంలో అతిపెద్ద బొగ్గు పరిశ్రమ అయిన కోలిండియా కన్నా. మెరుగైన సంక్షేమ పథకాలు, అలవెన్సులు, లాభా ల్లో కార్మికులకు భాగస్వామ్యం కల్పిస్తున్న సంస్థ సింగరేణి మాత్రమే. గతేడాది అత్యధికంగా లాభాల్లో 28 శాతం వాటా చెల్లించింది. గడిచిన ఐదేళ్లలో రెట్టింపు ఉత్పత్తితోపా టు 127శాతం లాభాలను పెంచుకోగలిగింది. సౌర, సాధారణ రెండు రకాల విద్యుత్ రంగంలోకి ఇప్పటికే అడుగు పెట్టడంతోపాటు ఒడిశాలో రెండు బొగ్గుకేత్రాల ద్వారా బొగ్గును వెలికితీస్తున్నది. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్ రాష్ర్టాల్లో మరికొన్ని బొగ్గు క్షేత్రాలను సింగరేణికి కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. గడిచిన ఐదేళ్లలో దాదాపు 17వేల ఉద్యోగాలను భర్తీ చేసింది. ఇవేకాదు, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తూ.. సింగరేణి సామర్థ్యాన్ని నలుదిశలా చాటారు. ఇంతటి చరిత్ర, సామర్థ్యమున్న సింగరేణిపై కేంద్రం నిర్ణయంతో నీలినీడలు అలుముకుంటున్నాయి.
కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు కుట్ర..
ఇంతటి అభివృద్ధి పథంలో దూసుకెళ్తూ తన సామర్థ్యాన్ని సత్తాను చాటుతున్న సింగరేణి పై కేంద్రం విషం కక్కుతున్నట్లుగా కనిపిస్తున్నది. దేశంలో ఇప్పటికే అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసి కార్పొరేట్ కంపెనీలకు దారదత్తం చేసినట్లుగా సింగరేణిని సైతం అదేబాటలో తీసుకెళ్లే వ్యూహాలకు పదును పెట్టింది. అందులో భాగంగానే సింగరేణికి చెందిన మందమర్రి ఏరియాలోని కల్యాణిఖని బ్లాక్-6, శ్రావణ్పల్లి బ్లాక్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఏరియాలోని కోయగూడెం బ్లాక్-3, ఖమ్మం జిల్లా కొత్తగూడెం ఏరియాలోని సత్తుపల్లి బ్లాక్-3ను వేలం వేయాలని నిర్ణయించింది. ఇదే జరిగితే సింగరేణి మనుగడే ప్రశ్నార్థకమవుతుందన్న ఆందోళన కార్మిక సంఘాలు, కార్మికుల్లో వ్యక్తమవుతోంది. కార్మికుల బతుకులకు భరోసా లేకుండా పోతున్నదని ఆవేదన కనిపిస్తోంది. ప్రైవేటీకరణ జరిగితే.. ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు రద్దవుతాయన్న ఆందోళన నెలకొంది. సింగరేణి సంస్థ బొగ్గు గనులు తవ్వుతూనే పర్యావరణ పరిరక్షణకు తీవ్రంగా కృషి చేస్తున్నది. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు హరితహారం కార్యక్రమంలో భాగస్వామి అవుతున్న సింగరేణి సంస్థ, ప్రభావిత గ్రామాలు, గనుల ఆవరణ, ఓబీ కుప్పలు, కార్మికుల కాలనీల్లో వేలాది ఎకరాల్లో కోట్లాది మొక్కలు పెంచుతున్నది. గతంలో దుమ్మూధూళితో నిండి కనిపించిన కార్మిక క్షేత్రాలు.. ప్రస్తుతం పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. ఒకవేళ బొగ్గు బ్లాకుల వేలం జరిగితే సదరు సంస్థ ఈ స్థాయిలో పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకునే పరిస్థితి ఉండదు. ఉష్ణోగ్రతలు పెరిగిపోయి నానా కష్టాలు తప్పవని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, ఒక వైపు సింగరేణికి వివిధ రాష్ర్టాల్లో కొత్త బ్లాక్లు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతుంటే.. ఇక్కడ ఉన్నవే ప్రైవేటీకరణ చేయడం ఏమిటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పటికే ఇతర రాష్ర్టాల్లో సింగరేణి తన సామర్థ్యాన్ని విజయవంతంగా చాటుతున్నది. ఈ తరుణంలో సింగరేణి పరిధిలో ఉన్న బ్లాక్లను వేలం వేయడానికి కేంద్రం నిర్ణయించడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందన్న విమర్శలు వస్తున్నాయి.
సంయుక్త పోరాటం..
కేంద్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు చెందిన నాలుగు బ్లాక్లను వేలం వేసేందుకు నిర్ణయించిన క్రమంలో సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం టీబీజీకేఎస్తోపాటు అన్ని జాతీయ కార్మిక సంఘాలు ఆందోళనలకు శ్రీకారం చుట్టా యి. ఇప్పటికే నిరసనలు, ధర్నాలు చేపట్టిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గత నెల 25న సింగరేణి యాజమాన్యానికి సమ్మె నోటీసు జారీ చేసింది. ఈ నెల 9 (గురువారం) నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లుగా ప్రకటించింది. అలాగే మిగిలిన అన్ని కార్మిక సంఘాలు టీబీజేకేఎస్, ఏఐటీయూసీ, ఏఎన్టీయూసీ, బీఎంఎస్, హెచ్ఎంఎస్, సీఐటీయూ ఆందోళన బాట పట్టాయి. సంయుక్త పోరాటం చేయాలని నిర్ణయించాయి. బొగ్గు గనుల వేలాన్ని రద్దు చేయాలని, సింగరేణికి చెందిన బ్లాకులు సింగరేణికే ఇవ్వాలన్న డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రైతు చట్టాలపై వెనక్కి తగ్గినట్లుగానే బొగ్గు బ్లాక్ల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేదంటే ఉద్యమం తప్పదని సింగరేణి ఉద్యోగులు హెచ్చరిస్తున్నారు.
కేంద్రం ఎత్తుగడలను చిత్తు చేయాలి
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఎత్తుగడలను చిత్తు చేసి, సింగరేణికి చెందిన నాలుగు బొగ్గు బ్లాకులను కాపాడుకోవాలి. సింగరేణిలో ఐదు జాతీయ కార్మిక సంఘాలు, టీబీజీకేఎస్ ఇచ్చిన సమ్మె పిలుపునకు కార్మికులు స్పందించాలి. గతంలో కేంద్ర ప్రభుత్వం బీఎస్ఎన్ఎల్ను నిర్వీర్యం చేసింది. బొగ్గు పరిశ్రమను ప్రభుత్వం నుంచి వీడదీసి ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే ప్రయత్నం చేస్తోంది. దీనిని ఎలాగైనా అడ్డుకోవాలి. 72 గంటల సమ్మెలో కార్మికులు సంపూర్ణంగా పాల్గొనాలి. పోరాటాల ద్వారానే ఇది సాధ్యమవుతుంది.