మెట్పల్లి,నవంబర్2: ఎన్నికల ప్రచారంలో భాగంగా కోరుట్లలో శుక్రవారం సాయంత్రం జరిగే ప్రజాఆశీర్వాద సభకు రాష్ట్ర రథసారథి, బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు రానున్నారు. 63వ జాతీయ రహదారి పక్కన పెద్దగుండు ప్రాంతంలో సుమారు 12 ఎకరాల స్థలంలో తలపెట్టిన సభ కోసం ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఆశీర్వాద సభ వేదిక, వేదిక ముందు ప్రజలు కూర్చునేందుకు కుర్చీలు ఏర్పాటు చేశారు. వాహనాలు నిలిపేందుకు ప్రత్యేకంగా పార్కింగ్కు జాతీయ రహదారికి అవతలివైపు స్థలాన్ని కేటాయించారు. సభ వేదికకు సమీపంలో హెలీప్యాడ్ను ఏర్పాటు చేశారు.
సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభ జరుగనుండగా, ముఖ్యమంత్రి కేసీఆర్ అదే సమయానికి హెలీకాప్టర్లో అక్కడికి చేరుకుంటారు. బహిరంగ సభకు కోరుట్ల, మెట్పల్లి పట్టణాలతో పాటు ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, కోరుట్ల, మెట్పల్లి మండలాల్లోని నలుమూలల నుంచి వేలాదిగా ప్రజలు తరలివచ్చే అవకాశం ఉండడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే సభావేదిక, హెలీప్యాడ్, పార్కింగ్కు సంబంధించి ఏర్పాట్లను రెండు రోజుల కిందట జిల్లా ఎస్పీ సన్ప్రీత్సింగ్ పరిశీలించారు. పోలీస్ అధికారులకు భద్రతకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశా నిర్దేశం చేశారు.
సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని బీఆర్ఎస్ కోరుట్ల నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి డా. కల్వకుంట్ల సంజయ్, ఎమ్మెల్యే విద్యాసాగర్రావు పిలుపునిచ్చారు. గురువారం సాయంత్రం ప్రజా ఆశీర్వాద సభకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ కోరుట్ల,మెట్పల్లి పట్టణాలతో పాటు ఇబ్రహీంపట్నం, కోరుట్ల, మెట్పల్లి,మల్లాపూర్ మండలాల్లోని అన్ని గ్రామాల నుంచి వేలాది సంఖ్యలో ప్రజలు వస్తున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.