చొప్పదండి, ఫిబ్రవరి 8: కొండగట్టు దేవస్థానం అభివృద్ధికి సీఎం కేసీఆర్ రూ.100 కోట్లు మంజూరు చేయడంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కీలకపాత్ర పోషించారని చొప్పదండి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం చుక్కారెడ్డి పేర్కొన్నారు. మండలంలోని రేవెల్లిలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు కొండగట్టు దేవస్థానం అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదని ఆరోపించారు. ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ గెలిచిన తర్వాత కొండగట్టు ఆలయ అభివృద్ధి కోసం తనవంతు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కొండగట్టు ఆలయ అభివృద్ధి విషయం రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.
జగిత్యాల బహిరంగ సభలో సీఎం కేసీఆర్ కొండగట్టు అభివృద్ధి రూ. 100 కోట్లు మంజూరు చేస్తామని ప్రకటించగా, నెల రోజుల్లోపే నిధుల జీవోను విడుదల చేయించడంలో ఎమ్మెల్యే కీలక పాత్ర పోషించారని కొనియాడారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడుతున్న ఎమ్మెల్యే సుంకె రవిశంకర్పై ప్రతిపక్ష నాయకులు అనవసర ఆరోపణలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. కొండగట్టు దేవస్థానం అభివృద్ధికి రూ. 100 కోట్ల నిధుల జీవోను విడుదల చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్కు, ఇందుకు కృషి చేసిన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ యువజన విభాగం జిల్లా నాయకుడు బందారపు అజయ్కుమార్గౌడ్, ఉపసర్పంచ్ కొత్తకొండ కొమురయ్య, నాయకులు కొత్తూరి రాజేందర్, అంతగిరి అంజయ్య, సుద్దాల సాయికృష్ణ, అంతగిరి చిన్న అంజయ్య, విద్యార్థి విభాగం మండల ఉపాధ్యక్షుడు వడ్నాల సిద్ధార్థ్, చేగంటి వినయ్ తదితరులు పాల్గొన్నారు.