కరీంనగర్ ప్రతినిధి/ జగిత్యాల, డిసెంబర్ 8 : ఈ నెల 7న జగిత్యాల అర్బన్ మండలం మోతె శివారులో జరిగిన ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ ఒక ప్రభంజనం సృష్టించింది. వెల్లువలా తరలివచ్చిన జనంతో ప్రాంగణంతో పాటు వెలుపలి ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. జిల్లా నలుమూలల నుంచే కాకుండా, ఉమ్మడి జిల్లా పరిధి నుంచి వచ్చిన లక్షలాది మంది వెల్లువలా తరలివచ్చారు. ఉప్పొంగిన జనం ప్రేమ వెనుక ముఖ్యమంత్రి ఇప్పటికే స్వరాష్ట్రంలో జిల్లా వాసులకు చెందిన ఎన్నో చిరకాల వాంఛలను సాకారం చేశారు. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించారు. బీడువారిన భూములను మాగాణిగా తీర్చిదిద్దారు. వరద కాలువను సజీవ జలధారగా మార్చి.. పాతళ గంగనుపైకి తెచ్చారు. వరదకాలువపై నడుస్తున్న మోటర్లకు మీటర్లు లేకుండా చేయడమేకాదు.. నిర్భయంగా నీటిని తోడుకునే సౌకర్యం కల్పిచారు.
అత్యధికంగా జగిత్యాల జిల్లా నుంచి వెళ్లే గల్ఫ్ బాటలకు తెర దించారు. బీడీలనే నమ్ముకొని బతుకు వెల్లదీస్తున్న ఆడబిడ్డలకు ఆసరా పింఛన్ రూపంలో అండగా నిలిచారు. దశాబ్దాల కల అయిన జిల్లాను ఏర్పాటు చేయడమేకాదు.. అన్ని హంగులతో కలెక్టరేట్, మెడికల్ కళాశాల వంటి ఎన్నో ప్రాథమిక వసతులను కల్పించారు. కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాలను ఏర్పాటుచేసి జనం ముందుకు పాలన తెచ్చారు. ఆధ్యాత్మిక కేంద్రాలైన కొండగట్టు అంజన్న, ధర్మపురి నర్సన్న క్షేత్రాలను కడుపులో పెట్టుకొని అభివృద్ధికి బాటలు వేశారు. ఎండిపోయిన గోదావరిని కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా లక్ష్మీనృసింహుడి పాదాల చెంతకు చేర్చడమే కాదు.. ఏకంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరకు ఎత్తిపోతల ద్వారా వరదకాలువను సజీవ ధారగా మార్చారు. దీని ఫలితమే.. గతంతో పోల్చితే లక్ష ఎకరాలకు పైగా సాగు పెరగడమే కాదు.. ధాన్యాగారంగా మారింది. ఇది ఎవరో చెప్పడమేకాదు… ఈ జిల్లా ప్రజలే చెబుతున్నారు. స్వరాష్ట్రం సిద్ధించడం వల్లే వరదకాలువ సజీవ ధారగా మారి మాకు అండగా నిలుస్తున్నదని, అందుకే రెండు పంటలు పండిస్తున్నామని మల్లాపూర్ రైతు రమేశ్రెడ్డి తెలిపారు. జగిత్యాలను జిల్లాగా ఏర్పాటు చేసి పాలనా సౌలభ్యం తేవడం వల్ల జగిత్యాలతో పాటు కోరుట్ల, మెట్పల్లి వంటి పట్టణాల్లో వ్యాపారం మూడుపువ్వులు ఆరు కాయలుగా జరుగుతుందని జగిత్యాలకు చెందిన బట్టల వ్యాపారి శ్రీనివాస్ పేర్కొన్నారు. మెడికల్ సీటు దొరకడమే గగనం.. అందులోనూ తమ పిల్లలు తమ ప్రాంతంలోనే మెడికల్ చదువుకునే సౌలభ్యం కేసీఆర్వల్ల మాత్రమే సాధ్యమైందని పురుషోత్తం పేర్కొన్నారు. ఇవేకాదు.. సమైక్య రాష్ట్రంలో లేని ప్రగతి, కేవలం ఎనిమిదేళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసి చూపారంటూ, అవన్నీ కళ్ల ముందే కనిపిస్తుంటే.. ముఖ్యమంత్రి వెంట నడువకుంటే ధర్మం తప్పిన వారమవుతామని రవిశర్మ పేర్కొన్నారు. జిల్లాలను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రిని గుండెల్ల్లో పెట్టుకొని చూసుకోవాల్సిన బాధ్యత మాపై ఉందని రమేశ్చంద్ర అనే వ్యాపారి పేర్కొన్నారు. సభ విజయానికి కారణం ముఖ్యమంత్రి చేసిన పనులేనని, భవిష్యత్లో కేసీఆర్ ఈ గడ్డపై ఏ సభ పెట్టినా. ఇంతకు మించి జరుగుతుందన్న ఆశభావాన్ని ప్రజలు వ్యక్తంచేశారు.
సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను గుర్తుంచుకొని నెరవేర్చడంలో ఆయనకు ఆయనే సాటి.. 2003 పుష్కరాల సందర్భంలో ధర్మపురిలో తెలంగాణ ప్రత్యేక రాష్ర్టాన్ని ఆకాంక్షిస్తూ హోమం నిర్వహించారు. ఆ సమయంలో ‘తెలంగాణ ప్రాప్తిరస్తు’ అని ఆశీర్వదించాం. ధర్మపురి లక్ష్మీనృసింహస్వామి కృప, కేసీఆర్ దీక్ష, పట్టుదల వల్ల తెలంగాణ సిద్ధించింది. అప్పటి నుంచి వివిధ సందర్భాల్లో ధర్మపురి లక్ష్మీనృసింహస్వామి కృపాకటాక్షాల వల్లే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని చెప్పుకురావడం అనేది స్వామి పట్ల ఆయనకున్న భక్తికి నిదర్శనం. 2015 పుష్కరాల కోసం ధర్మపురికి అధికంగా నిధులు కేటాయించి..‘న భూతో’ అన్న రీతిలో విజయవంతంగా నిర్వహించారు. దాదాపు కోటి మంది భక్తులు పుష్కరస్నానాలు ఆచరించారు. ఇచ్చిన హామీలను మరువకుండా ధర్మపురి అభివృద్ధికి బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయించి పనులను చేపడుతున్నారు. 2003 పుష్కరాల్లో ఆశీర్వచనం అందజేసిన నన్ను సీఎం గుర్తుంచుకొని బహుమతిగా నా చేతికి 30 గ్రాములు బంగారు కంకణధారణ చేశారు. ధర్మపురి లక్ష్మీనృసింహస్వామి కృపాకటాక్షాలతో సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో నిండునూరేళ్లు జీవించాలి. ఆయన పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉండడంతో పాటు దేశానికే ఆదర్శంగా నిలవాలని స్వామిని మనసారా కోరుకుంటున్నా. సీఎం కేసీఆర్ ప్రాంతాలనే కాకుండా మనుషులను కూడా గుర్తుంచుకొని పేర్లుపెట్టి పిలుస్తారు. ఇలాంటి జ్ఞాపకశక్తి గలిగిన సంపన్నులు ఈ భూమిపై అరుదు. ఆయన కారణజన్ముడు.
– బొజ్జ రమేశ్ శర్మ, వేదపండితులు, శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానం, ధర్మపురి
సీఎం కేసీఆర్ నిర్వహించిన జగిత్యాల సభ నభూతో నభవిష్యత్తు అన్నట్లుగా సాగింది. ప్రజలు సభకు వచ్చిన తీరు చూస్తే ఆశ్చర్యం వేసింది. అంత మంది వస్తారని ఊహించలేదు. సీఎం కేసీఆర్ సమావేశంలో చెప్పిన ప్రతి విషయంపై ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిదేండ్ల కాలంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. ప్రతి ఇంటికీ కనీసం రెండు పథకాలైనా చేరాయి. వృద్ధాప్య పింఛన్లు, బీడీ కార్మికుల పెన్షన్, ఉచిత ప్రసవాలు చాలా మందికి మేలు చేస్తున్నాయి. కల్యాణలక్ష్మి పథకం ఆడపిల్లలకు అదృష్టంగా మారింది. రాష్ట్రం ఇంతగా చేస్తుంటే, కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఏం చేయడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం చేసే పనుల్లో మా వాటా ఉందని అబద్ధాలు మాత్రమే చెబుతోంది. ఎందుకు అబద్ధాలు అని అనుకుంటున్నామంటే, ఇక్కడ రూ.2 వేల పెన్షన్ ఇస్తే వేరే రాష్ర్టాల్లో రూ.700 ఇస్తుండ్రు. కల్యాణలక్ష్మి పథకం ఎక్కడా లేదు. పిల్లలు పుడితే రూ.12 వేలు ఇచ్చే పథకం ఎక్కడా లేదు. అందుకే కేంద్రం అబద్దం చెబుతుందని నమ్మకంగా చెబుతున్నాం. సీఎం కేసీఆర్ చెప్పిన ప్రతి మాటను ఆలోచించాలి. ఆయన చెప్పిన మార్గాన్ని ఆనుసరించాలి. దేశ వ్యాప్తంగా సంక్షేమం, అభివృద్ధి చూసే పార్టీని ఎన్నుకోవాలి. మోదీ సర్కార్కు బుద్ది చెప్పాలి.
– దూస పవన్, ఫొటోగ్రాఫర్, జగిత్యాల
తెలంగాణ ఏర్పాటు తర్వాత సకల రంగాల్లోనూ రాష్ట్రం పురోగమిస్తోంది. సీఎం కేసీఆర్ చెప్పిన ప్రతి మాట వంద శాతం నిజం. ఇందులో ఎలాంటి సందేహం లేదు. సేద్య రంగం అభివృద్ధి పథంలో సాగుతోంది. రైతులకు, రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెంటు అందుతోంది. పంటకు గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేస్తున్నారు. వ్యవసాయ రంగం అభివృద్ధి అన్ని రంగాలపై ప్రభావాన్ని చూపుతుంది. సేద్యంతో పాటు వ్యాపారం పెరిగింది. ప్రజల తలసరి ఆదాయం పెరిగింది. వ్యయ సూచి అభివృద్ధి చెందింది. విద్య, వైద్య రంగాల్లోనూ అభివృద్ధి జరుగుతోంది. జగిత్యాల లాంటి పట్టణానికి మెడికల్ కాలేజీ, 500 పడకల దవాఖాన, రావడం నిజంగా గొప్ప విషయం. ఇక అన్నిరకాల గురుకులాలు ఏర్పాటు చేశారు. ఇలా అనేకం జరుగుతున్నాయి. మన వద్ద అమలవుతున్న ఈ పథకాలు ఇతర రాష్ర్టాల్లో ఎందుకు అమలు కావడం లేదన్న విషయాన్ని ఆలోచించాలి. అన్ని రాష్ర్టాల ప్రభుత్వాలు ఈ పథకాలను అమలు చేయాలి. నిజం చెప్పాలంటే మన రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలన్నింటినీ కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో అమలు చేయాల్సిన అవసరం ఉంది.
-రామిడి జగన్, శంకులపల్లి
సీఎం కేసీఆర్ నిర్వహించిన సభ అద్భుతం. ముఖ్యమంత్రి గొప్ప దార్శనికులు. ఆయన సభలో చెప్పిన విషయాలు ఆసక్తిని కలిగించాయి. నిజంగా తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్ సర్కారు తెచ్చిన జిల్లాల ఏర్పాటు మంచి నిర్ణయం. కొత్త జిల్లాల ఏర్పాటుతో పరిస్థితి మారింది. పరిపాలన సులువైంది. కలెక్టరేట్లోని వివిధ శాఖల అధికారులు ప్రజలకు చేరువగా వచ్చారు. సమయ భారం, దూరభారం తప్పింది. బ్యాంకింగ్ రంగంలో అనేక మార్పులు వచ్చాయి. లీడ్ బ్యాంకు వంటివన్నీ చేరువగా వచ్చాయి. జిల్లా కేంద్రాల ఏర్పాటుతో సాధారణ పట్టణాలు సైతం పెద్ద వ్యాపార కేంద్రాలుగా మారాయి. దీంతో బ్యాంకులకు మేలు జరిగింది. ఒక బ్యాంకే కాదు అందరికీ ప్రయోజనాలే ఉన్నాయి.
-ఆరెపెల్లి శ్రీనివాస్, బ్యాంకు ఉద్యోగి, జగిత్యాల
కేసీఆర్ సభలో పాల్గొన్నా. ఆయన ప్రసంగం శ్రద్ధగా విన్నా. ఆయన చెప్పింది అక్షర సత్యం. తెలంగాణ సాధన తర్వాత మంచి ఫలితాలు వచ్చాయి. సర్కారు తెచ్చిన పలు పథకాలు ప్రజలకు లబ్ధిని చేకూర్చాయి. జగిత్యాల లాంటి పట్టణం ఇప్పుడు జిల్లా కేంద్రం కావడంతో దశ మారిపోయింది. ఇప్పుడు మరింత మెరుగు కాబోతుంది. జిల్లా కేంద్రం కావడంతో అనేక ప్రఖ్యాతి గాంచిన సంస్థలు, వ్యాపార కేంద్రాలు ఇక్కడ బ్రాంచులు తెరిచాయి. దీంతో పాటు, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగుల సంఖ్య పట్టణంలో పెరిగింది. దీని ప్రభావం అన్ని వ్యవస్థలపై ప్రతిఫలిస్తున్నది. అన్ని రకాల ద్విచక్ర షోరూమ్లు నడుస్తున్నాయి. ఇక సీఎం కేసీఆర్ దేశంలో రావాల్సిన మార్పుల గురించి చెప్పిన తీరు బాగుంది. ఆలోచించాల్సిన విషయం. కొందరు వ్యాపారవేత్తల మేలు కోసం ఈ దేశానికి స్వతంత్రం రాలేదు. ప్రతి ఒక్కరికీ దేశంలో సమాన హక్కులు ఉన్నాయి. అందరూ బతకాలి. సీఎం కేసీఆర్ చెప్పిన విషయాలపై యువత దృష్టి పెట్టాలి.
– వేముల వేణుగోపాల్, యమహా షోరూమ్ నిర్వాహకుడు
సీఎం కేసీఆర్ సభలో చెప్పినట్టుగా మేకింగ్ ఇండియా అంటారు.. దారం మాంజా, పటాకులు, జాతీయ జెండాలు చైనా నుంచి దిగుమతి చేసుకుంటారు అన్న మాటలు ఆలోచింపజేశాయి. ఇప్పటి వరకు ఆ దిశలో ఆలోచించలేదు. మనం అభివృద్ధి చెందాలంటే, మనమే ఉత్పత్తి చేయాలి.. ఇది మాత్రమే తెలుసు. అయితే, మన కేంద్రం మేకింగ్ ఇండియా అంటూ, విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం దారుణమైన విషయం. పటాకులే సృష్టించలేని వాళ్లం.. యుద్ధ క్షిపణులు ఎలా తయారు చేస్తాం.. కేంద్రం సమాధానం చెప్పాలి. సీఎం కేసీఆర్ చెప్పినట్లు దిగుమతి, ఎగుమతులతో కేంద్రం ప్రజలను మోసం చేస్తున్నది. ఇప్పటికైనా యువత తేరుకోవాలి. మతం, ధర్మం అవి మనుషుల వ్యక్తిగత జీవితానికి సంబంధించినవి. ప్రజలందరికీ మేలు చేసే విషయాలపై ఆలోచన చేయాలి. అలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి.
– ఎలగందుల రాజేందర్, ట్రాన్స్పోర్టు వ్యాపారి, జగిత్యాల
మహిళలకు పెద్ద పీట వేసిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుంది. సభలో ముఖ్యమంత్రి అనేక అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలను వివరించారు. అయితే ఆయన చెప్పిన సంక్షేమ పథకాల్లో ఎక్కువ మహిళల ప్రయోజనాల కోసం చేపట్టినవే. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆరోగ్యలక్ష్మి, కేసీఆర్ కిట్, ఉచిత ప్రసవాలు వంటి పథకాలు మహిళలకు ఉద్దేశించి చేపట్టినవే. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు. మహిళల కోసం అంగన్వాడీలకు కేటాయించిన నిధులు సైతం తగ్గించారు. మహిళలపై కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ చిన్నచూపు చూస్తూనే ఉంది. మహిళలు సీఎం కేసీఆర్ చెప్పిన విషయాలపై ఆలోచన చేయాలి.
– ఒద్దినేని శ్రీలత, కౌన్సిలర్, జగిత్యాల