అన్నదాతలను ఆగం చేసేందుకు కాంగ్రెస్ కుట్రలు పన్నుతున్నదా? 24 గంటల కరెంట్పై మాయమాటలు చెబుతున్నదా..? పూటకోమాటతో పుట్టిముంచే కుట్రలు చేస్తున్నదా..? అంటే రైతులోకం అవుననే తేల్చి చెబుతున్నది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మాట్లాడుతున్న తీరే అందుకు నిదర్శనమని ఆగ్రహిస్తున్నది. ఓసారి రైతులకు మూడు గంటల కరంటే చాలని, మరోసారి 10 హెచ్పీ మోటర్లు బిగించుకుంటే సరిపోతుందని, ఇప్పుడు మ్యానిఫెస్టోలో 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తామంటూ డ్రామాలు ఆడుతున్నదని మండిపడుతున్నది.
వ్యవసాయంపై కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, అన్నదాతలను అప్పులపాల్జేసేలా వ్యవహరిస్తున్నారంటూ భగ్గుమంటున్నది. అసలు రేవంత్ చెప్పినట్టు.. ఎవుసానికి ఎవరైనా పెద్ద మోటర్లు వాడుతరా..? వాడితే బోర్లుంటయా..? భూమిలో నీళ్లుంటయా..? ఊటలొస్తయా..? అని ప్రశ్నిస్తున్నది. 10 హెచ్పీ పెట్టాల్సి వస్తే ప్రతి రైతుపైనా లక్ష రూపాయల వరకు భారం పడుతుందని, ఉమ్మడి జిల్లాలో 4.18 లక్షల మంది కర్శకుల బతుకులు ఆగమవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నది. ఆ పార్టీ నేతలు అజ్ఞానంలో ఉన్నారని, తాము చేసిన తప్పులను సరిదిద్దుకొనేందుకు అడ్డదిడ్డమైన సలహాలు ఇస్తున్నారని ఎద్దేవా చేస్తున్నది. వాళ్లను నమ్మితే నిండా మునగడం ఖాయమని హెచ్చరిస్తున్నది.
కాంగ్రెస్ నేతలు, ముఖ్యంగా రేవంత్రెడ్డి ఎవుసం గురించి ఏదేదో మాట్లాడుతున్నరు. వాళ్లకు ఏం తెలువది. వారెన్నడన్న ఎవుసం కాడికి పోయిన ముఖాలేనా. 10హెచ్పీ మోటర్లు పెట్టుకుంటే మూడు గంటల కరెంటు సాల్తదని వంకరగా మాట్లాడుతున్నరు. మమ్ముల మంచిగ బతుకనియ్యరా..? మల్ల కరెంటు తిప్పలు పెట్టి బాయిల కాడ పండుమం టరా..? వారు పాలనలో మేం ఏం సుఖపడలే. కానీ ఈ తొమ్మిదేండ్ల సంది ఏ రంది లేకుంట ఎవుసం చేసుకుంటున్నం. రేవంత్ రెడ్డికి ఎద్దు ఎరుకలేదు. ఎవుసం ఎరుకలేదు.
కేసీఆర్ సారు రైతుల మనసు ఎట్ల గెలిచిండో ఆయనకు తెలుసా? సారు ఎవుసం చేస్తడు కావట్టి విత్తనాల కాడికెళ్లి, కరెంటు మోటరు దాక అన్నింటిపై అవగాహన ఉంటది. ఆయన అసొంటోడు గతంల లేకనే మేం చాలా ఇబ్బందులు పడ్డం. కేసీఆర్ సార్ అసొంటోల్లు ఓ ఇరవై, ముప్పై ఏండ్ల కింద ఉంటే మా పరిస్థితి ఎంతనో మారిపోవు. ఇప్పుడున్న పరిస్థితిల మూడు గంటల కరెంటు ఎట్ల సరిపోతది. ఆయనన్నట్టు 10 హెచ్పీ మోటరు పెట్టుకున్నా ఒక పొలానికి సెట్ అయితది. వేరే పంటలెట్ల. పునాసకు అంత పెద్ద మోటర్తో నీళ్లు కట్టుకునేటట్టు ఉంటదా. మా రైతులకు కేసీఆర్ సార్ సీఎం అయితేనే మాకు కష్టాలు ఉండయి.
– వంగాల శ్రీనివాస్రెడ్డి, రైతు, నుస్తులాపూర్(తిమ్మాపూర్)
కరీంనగర్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : యాభై ఏండ్ల సమైక్య పాలనలో 42 ఏండ్లు కాంగ్రెస్ పాలిచింది. పదహారేండ్లు టీడీపీ పాలన చేసింది. కానీ, ఏ ప్రభుత్వం కూడా రైతుల గురించి ఆలోచించలేదు. దశాబ్దాల పాటు పాలించినా సంక్షేమంపై దృష్టి పెట్టలేదు. ఫలితంగా ఆనాడు వ్యవసాయానికి సరిపడా కరెంట్ లేక రైతు అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. కరెంటు ఎప్పుడొస్తుందో.. ఎప్పుడు పోతుందో కంటినిండా నిద్రపోలేని దుస్థితి ఉండేది. అర్ధరాత్రి పూట పంపుసెట్ల వద్ద పడుకునేది. ఈ క్రమంలో బావుల వద్ద కరెంట్ షాక్తోనో.. పాము కాట్లతోనో ఎంతో మంది చనిపోయారు. కరెంట్ కోసం నిత్యం రోడ్డెక్కేవారు. సబ్ స్టేషన్లను, విద్యుత్ కార్యాలయాలను ముట్టడించేవారు. పల్లెలు, పట్టణాలనే తేడా లేకుండా కోతలు విధించేవారు. పరిశ్రమలకు పవర్ హాలీడే ఇచ్చే వారు. పీక్ అవర్స్లో విద్యుత్ వాడకూడదని పరిశ్రమలపై ఆంక్షలు సైతం విధించే వారు. గ్రామాలకైతే కేవలం రాత్రి పూట మాత్రమే సరఫరా చేసేవారు. పొద్దంతా కరెంట్ ఉండేది కాదు. పట్టణాల్లో ఎక్కడ చూసినా పొద్దంతా జనరేటర్ల మోతలే వినిపించేవి. ముఖ్యంగా వ్యాపార, వాణిజ్య దుకాణ సముదాయాలపై అధిక భారం పడేది.
స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యుత్ సమస్యలపై ప్రధానంగా దృష్టి పెట్టారు. రాష్ట్ర విభజన సమయంలో కరెంట్ లేక తెలంగాణ చీకటి అవుతుందని చెప్పిన నాటి ఆంధ్రా పాలకులకు చెంపపెట్టులా విద్యుత్ రంగాన్ని సంస్కరిస్తూ వచ్చారు. ఇప్పుడు ఏ రంగానికైనా 24 గంటల విద్యుత్ సరఫరా అందిస్తున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత అనతి కాలంలోనే పరిశ్రమలకు 24 గంటల కరెంట్ ఇచ్చారు. అనంతరం గృహ వినియోగదారులకు కూడా నిరంతర విద్యుత్ను అందించారు. ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి 6 గంటలు మాత్రమే కరెంట్ ఇచ్చేవారు. తెలంగాణ వచ్చిన తర్వాత మొదట 7 గంటలకు పెంచారు. అనంతరం 9 గంటలు చేశారు. 2018 జనవరి ఒకటి నుంచి నిరంతరం సరఫరా చేస్తున్నారు. రాష్ట్రం సాధించిన గొప్ప విషయాల్లో ఇది ఒకటిగా నిలువగా, సాగుకు నిరంతర ఉచిత విద్యుత్ సరఫరాతో రైతులు మంచి దిగుబడులను సాధిస్తున్నారు. పరిశ్రమలు లక్ష్యానికి మించి ఉత్పత్తులు సాధిస్తుండగా, పారిశ్రామికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లా లెక్కన చూస్తే 2014లో 3,39, 298 కనెక్షన్లు ఉంటే.. అవి ప్రస్తుతం 4,18, 505కు చేరాయి. అంటే గడిచిన తొమ్మిదేళ్లలో 79,128 కనెక్షన్లు పెరిగాయి. 2014లో 1,120.36 మెగావాట్ల విద్యుత్ వినియోగం ఉంటే.. ప్రస్తుతం ఆ డిమాండ్ 3,328.85 మెగావాట్లకు చేరింది. అంటే గడిచిన తొమ్మిదేళ్లలో 2,234.83 మెగావాట్ల విద్యుత్ వినియోగం పెరిగింది. అలాగే, 2014లో 53,247 ట్రాన్స్ఫార్మర్లు ఉంటే.. ప్రస్తుతం అవి 78,958కి చేరాయి. ఈ తొమ్మిదేళ్లలో కొత్తగా 25,711 ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటయ్యాయి. పరిశ్రమల విషయానికొస్తే.. 2014లో 588 పరిశ్రమలుంటే, ఇప్పుడు 4,764కు పెరిగాయి. నిరంతర విద్యుత్ సరఫరా ఉండడం వల్లే ఇదంతా సాధ్యమైందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
10హెచ్పీ మోటార్లు ఏర్పాటు చేసుకోవడం అంటే ఖర్చుతో కూడుకున్న పని. రిపేర్లు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ మోటర్లతో విద్యుత్ ఎక్కువ ఖర్చు కావడంతో ట్రాన్స్ఫార్మర్లపై లోడ్ ఎక్కువ పడి అవి తరుచూ కాలిపోయే ప్రమాదం ఉంటుంది. స్టార్టర్లు, ఫ్యూజులు, వైర్లు సైతం కాలిపోతాయి. దీని వల్ల రైతులు ఆర్థికంగా ఎక్కువగా నష్ట పోతారు. ఈ మోటర్లు పైపు లైన్ వేయాలంటే కూడా బాగానే ఖర్చు చేయాల్సి ఉంటుంది. దాదాపు 4 నుంచి 5 ఇంచుల పైపులైన్ వేసుకోవాల్సి ఉంటుంది. 10 హెచ్పీ మోటార్లు పని చేయాలన్నా భూగర్భ జలాల్లో నీటి ఊట ఎక్కువగా ఉండాలని, ఆ ఊట మొత్తాన్ని కూడా ఒకే సారి బయటికి పంపుతుంది. దీన్ని వల్ల భూగర్భ జలాలు తగ్గిపోయే ప్రమాదముంది. మన తెలంగాణలో ఎక్కువగా చిన్న, సన్న కారు రైతులే వీరికి ఈ మోటార్లు అస్సలే పనికి రావు. మన రాష్ట్రంలో ఎక్కువగా ఎక్కువగా 5, టూ 6 హెచ్పీ బోర్ మోటార్లు మాత్రమే వినియోగిస్తారు. దీని వల్ల రైతులకు పెద్దగా ఖర్చులు కూడా ఉండవు. నీటి ఊట తక్కువగా ఉన్నా, ఎక్కువగా ఉన్నా నీటిని పంపిణీ చేస్తుంది. స్టార్టర్లు, మోటార్లు, వైరింగ్, ప్యూజ్లు వంటివి ఖాళీ పోవడానికి అవకాశం ఎక్కువగా ఉండదు.
-పుల్లె లింగయ్య, ఎలక్ట్రీషియన్, మోటర్ వైడింగ్ రిపేరర్, మంథని
నిరంతర ఉచిత విద్యుత్ వచ్చినప్పటి నుంచి ఉమ్మడి జిల్లా రైతాంగం వ్యవసాయాన్ని ఒక పండుగలా కొనసాగిస్తున్నది. ఒకవైపు కాళేశ్వరం జలాలు.. మరోవైపు 24 గంటల కరెంట్ రావడం, ఇంకోవైపు భూగర్భ జలాలు పెరగడంతో సాగును సంబురంగా చేస్తున్నది. అయితే, సజావుగా సాగుతున్న వ్యవసాయరంగంపై కాంగ్రెస్ పార్టీ విషం కక్కుతున్నట్లుగానే కనిపిస్తున్నది. పీపీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వివిధ సందర్భాల్లో కరెంటుపై మాట్లాడిన మాటలే అందుకు నిదర్శనమంటున్నారు వ్యవసాయరంగ నిపుణులు. విదేశంలో జరిగిన ఓ సమావేశంలో రైతులకు 24 గంటల కరెంటు అవసరం లేదని, కేవలం మూడు గంటలు ఇస్తే సరిపోతుందని మాట్లాడారు. అప్పుడు రైతులోకం ఒక్కసారిగా భగ్గుమన్నది. మూడు గంటల కరెంటుతో మూడెకరాలు ఎలా పారుతయో..? చూపించాలంటూ డిమాండ్ చేసింది. దీంతో మాట మార్చిన ఆయన, మరోసారి కనీస అవగాహన లేకుండా మాట్లాడారు. మూడెకరాల్లో మూడు గంటల్లో పారాలంటే 10 హెచ్పీ సామర్థ్యమున్న మోటర్లు పెట్టుకుంటే సాధ్యమవుతుందని సలహా ఇచ్చారు.
నిజానికి ఉమ్మడి జిల్లాలోని రైతులే కాదు, వ్యవసాయం చేసే ఏ రైతైనా 10 హెచ్పీ సామర్థ్యమున్న మోటర్ వాడరు. అందుకు అనేక కారణాలు ఉన్నా యి. ఎన్ని భూగర్భ జలాలున్నా.. 10 హెచ్పీలకు అందించే సామర్థ్యమున్న బోర్లు ఉండవు. అలాగే, బావులకు పెట్టిన ఆ స్పీడ్కు వెనువెంటనే నీళ్లు ఖాళీ అవుతాయి తప్ప ప్రయోజనం ఉండదు. అంతేకాదు కొత్తగా 10 హెచ్పీలు కొనాలంటే ఒక్కో రైతుకు తక్కువలో తక్కువ 60వేల నుంచి 70వేలు వె చ్చించాల్సి వస్తుంది. దీంతోపాటు ఆ సామర్థ్యానికి సరిపోయే విధంగా పై పు లు, ఇతర సామగ్రి, స్టార్టర్ కొనసాలంటే అన్నీ కలిపి దాదాపు లక్ష వరకు అవుతుంది. ఇలా అయితే ఉమ్మడి జిల్లాలో 4.18 లక్షల మంది రైతులపై అదనపు భారం పడుతుంది.
అయినా,ఒకవేళ 10హెచ్పీ మోటర్లు పెట్టినా.. ప్ర స్తుతం ఉన్న ట్రాన్స్ఫార్మర్లు, సబ్స్టేషన్లను మొత్తం మార్చాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం రైతాంగం మొత్తం 3హెచ్పీ లేదా 5హెచ్పీ మోటర్లు మాత్రమే వాడుతున్నది. అందుకు అనుగుణంగానే సబ్స్టేషన్లు, లైన్లు, ట్రాన్స్ఫార్మర్ల వ్యవస్థ ఉన్నది. ఇటువంటి వాటిపై ఏకకాలంలో ఒకేసారి డబుల్ భారం పడితే.. ఎక్కడికక్కడ ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయి మొదటికే మోసం వస్తుంది.
భూగర్భ జలాలు లోపల వరదలా రావు. చిన్న నీటి ఊటల్లా ఉంటాయి. ఆ నీరు ఎంత ఊట ఉంటుందో అంతే స్థాయిలో రైతులు మోటర్లు వాడుతారు. ఎక్కువగా 3 నుంచి 5 హెచ్పీ మోటర్లను విజయవంతంగా వినియోగిస్తున్నారు. అయితే, బోరుబావుల్లో 10 హెచ్పీకి నీటిని అందించే ఊట ఉండదు. అదే కాంగ్రెస్ నేతలు చెప్పినట్టు ఆ మోటర్లను బిగిస్తే నిమిషాల్లోనే ఊటనంతా బయటకు పోస్తుంది. ఆ తర్వాత పరిస్థితి ఏంటి? మళ్లీ నీరు ఊరడానికి చాలా సమయం పడుతుంది. అప్పుడు మోటర్ మళ్లీ నీటిని తోడినా.. ముందు పారినంతవరకే పొలం పారుతుంది. ఎందుకంటే అప్పటికే మొదట తోడిన నీరు ఇంకిపోతుంది. ఇలా ఏకోణంలో చూసినా 10 హెచ్పీ అనేది రైతులకు ఉపయోగడపదు. కానీ, స్వయంగా పీసీసీ అధ్యక్షుడే దీనిపై పూటకోమాట మాట్లాడుతున్న తీరుపై విమర్శలు వస్తుండడంతో తాజా మ్యానిఫెస్టోలో 24 గంటల కరెంటు రైతులకు ఇస్తామని పెట్టారు.
ముందుగా మూడు గంటలని, తర్వాత 10 హెచ్పీ మోటర్లని, ఇప్పుడు మళ్లీ 24 గంటల కరెంట్ అని రేవంత్ మాట్లాడుతున్నారంటూ రైతులు మండిపడుతున్నారు. అసలు 10 హెచ్పీ మోటర్లు ఎక్కడ వాడుతారో కూడా తెలియని అజ్ఞానంలో కాంగ్రెస్ నేతలు ఉన్నారని, సాగు గురించి తెలిసిన ఏ నేత కూడా ఇలాంటి చిల్లర మల్లర మాటలు మాట్లాడరని ఆగ్రహిస్తున్నారు. ఇలాంటి నేతల విషయంలో ఆలోచించాల్సిన అవసరముందని చెబుతున్నారు. వారు చేసిన తప్పులను సరిదిద్దుకొనేందుకు అడ్డదిడ్డమైన సలహాలు ఇస్తున్నారని, వాళ్లను నమ్మితే నిండా మునగడం ఖాయమని హెచ్చరిస్తున్నారు.
వైండింగ్ మెకానిక్గా మస్తు పని దొరుకుతుందని పది, పదిహేనేండ్ల కింద ఈ రంగాన్ని ఎంచుకున్న. నేను పని నేర్చుకుని సొంతంగా మా ఊరు ఇందిరానగర్లో షాప్ పెట్టుకున్నంక మొదట్ల మంచిగనే నడిచింది. అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్లో కరెంట్ సరిగ్గా లేక మోటర్లు కాలిపోతుండె. చెడిపోతుండె. జీవితం కొంచెం సెట్ అవుతున్న టైంలోనే సీఎం కేసీఆర్ పగ్గాలు చేపట్టి మెరుగైన కరెంటు, ఫుల్లు నీళ్లు తీసుకువచ్చిర్రు. అప్పటి నుంచి మోటర్ల కాలుడు, చెడిపోయే సమస్యల రాలే. ఎప్పుడైనా మోటర్లకు సరిపడా విద్యుత్, మోటర్ బలానికి అనుగుణంగా నీళ్లు ఉంటే ఆ మోటర్ చెక్కుచెదరదు. ఇప్పుడు మా దగ్గర ఫుల్లు నీళ్లు ఉన్నయి. దాంతోని రైతులు ఎప్పుడంటే అప్పుడు కరెంటు పెట్టుకుంటా రంది లేకుంట ఉండిపోయారు. గతంలో సీజన్కు కనీసం యాభై మోటర్లు రిపేర్చేసే నేను నేడు నెలకొకటి కూడా వస్తలేదు. వైండింగ్ మెకానిక్గా ఉపాధి కోల్పోయినా రైతుగా చాలా సంతోషంగా ఉన్నా. ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నట్టుగా మూడు గంటల కరెంటు ఇచ్చి 10హెచ్పీ మోటర్లు పెట్టుకుంటే పరిస్థితి తారుమారు అయితది. ఆయన ప్రెస్సోళ్ల ముందట స్టేట్మెంట్ ఇచ్చినంత ఈజీ కాదు పొలాల కాడ. 10హెచ్పీ మోటర్లు ఒక్క ట్రాన్స్ఫార్మర్ కింద ఒక నాలుగు, ఐదు ఆన్ చేస్తే ఒక్క రోజు కూడా నడవవు. క్షేత్రస్థాయిలో సాధ్యం కాని పని అది.
– దామ కుమార్, వైండింగ్ మెకానిక్, ఇందిరానగర్(తిమ్మాపూర్)
నేను 40 ఏండ్ల నుంచి సిరిసిల్లలో మోటరు మెకానిక్గా పని చేస్తున్న. కాంగ్రెస్ పాలనలో కరెంటు ఎప్పుడువత్తదో.. ఎప్పుడుపోతదో కూడా తెలియకుంటుండె. రాత్రి వేళల్లో కరెంట్ పెట్టేందుకు వెళ్లి చాలామంది రైతులు పాముకాటు, కరెంటుషాక్తో చనిపోయిన్రు. ఇచ్చిన కరెంట్లో నాణ్యత లేక లోవోల్టేజీతో మోటర్లు చాలావరకు కాలిపోతుండేవి. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న కరెంట్ మంచిగున్నది. 24 గంటలు ఉంటున్నది. ఎప్పుడుపడితే అప్పుడు రైతులు మోటర్లు పెట్టుకుంటున్నరు. పొలంకాడ కరెంటు కోసం ఎదురుచూసే పనేలేదు. మూడు గంటల కరెంటుతో 10 హెచ్పీ మోటరు పెట్టుకుంటే ఎకరం పారుతుందనేది వాస్తవం కాదు. ఒకే సమయంలో అందరూ రైతులు మోటర్లు పెడితే కరెంట్ లోవోల్టేజీ సమస్య వచ్చి, ట్రాన్స్ఫార్మర్లు, మోటర్లు కాలిపోతయ్. పైగా ఎకరం, రెండెకరాలు ఉన్న రైతులు 10 హెచ్పీ మోటరు పెట్టుకోవాలంటే లక్షా ఇరవై వేల వరకు ఖర్చయితది. ఏడున్నర హెచ్పీల మోటరుకు మాత్రమే కరెంటు సబ్సిడీ ఉంటది. మూడు గంటల కరెంటే ఇస్తామంటే మళ్లీ తెలంగాణలో పాతరోజులొస్తయి. ఎవుసం నడవదు. రైతులంతా రోడ్డునపడుతరు.
మాది రుద్రంగి గ్రామం. నాకు 4.19ఎకరాల భూమి ఉన్నది. మును పు సాగునీరు లేక పొట్టతిప్పల కోసం దుబాయ్ పోయిన. తెలంగాణ వచ్చినంక కరెంట్, నీళ్లు పుష్కలంగా ఉండడంతో గల్ఫ్ వదిలి ఇంటికొచ్చిన. రెండెకరాల్లో వరి, మిగతాదాంట్లో పత్తి, కూరగాయలు, కందులు సాగు చేస్తున్న. 24గంటల కరెంట్ ఇవ్వడంతో అంతా పారుతున్నది. కాంగ్రెస్ మళ్లొస్తే మూడు గంటల కరెంటే ఇస్తామంటే మళ్లీ మా కష్టాలు మొదలైతాయి. రేవంత్రెడ్డి అన్నట్లు మూడు గంటల కరెంటు ఇస్తే బోర్లతో ఎకరం కూడా పారది. గతంలో కరెంటు ఎప్పుడు వస్తదో తెలువక పొలం కాడనే పడుకునేటోళ్లు. మూడు గంటల కరెంటు ముచ్చట మాకు కల్వది. 10హెచ్పీ మోటర్, మూడు గంటల కరెంటుతో పొలానికి నీరు పెట్టడం కుదరని పని. నేను 5 హెచ్పీ మోటర్తోనే నీరు పారిస్తూ వ్యవసాయం చేస్తున్న. అందరూ 10హెచ్పీ మోటర్ వాడితే ట్రాన్స్ఫార్మర్పై లోడ్ ఎక్కువై పేలిపోతుంది. రైతుల కష్టాలపై అవగాహన లేకుండా టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి మాట్లాడడం బాధాకరం.