రైతుబంధుపై కాంగ్రెస్ ఇస్తున్న హామీలన్నీ జూటా మాటలని తేలిపోయింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఓ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కడుపులో దాగి ఉన్న విషాన్ని కక్కేశారు. తాము అధికారంలోకి వస్తే అమలు చేసే ఆరు గ్యారంటీ కార్డుల్లో ఒకటైన రైతు భరోసాపై ఆ పార్టీ తీసుకునే స్టాండ్ను తేట తెల్లం చేశారు.
భూ యజమానికి ఇస్తే కౌలు రైతుకు, కౌలు రైతుకు ఇస్తే భూ యజమానికి లేదని స్పష్టం చేశారు. ఈ మాటలు విన్న రైతులు కాంగ్రెస్ హామీలన్నీ పచ్చి అబద్ధాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు ముందే రేవంత్రెడ్డి మాట మార్చడంతో ఆ పార్టీని నమ్మేది లేదని స్పష్టం చేస్తున్నారు.
– కరీంనగర్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ)
పెద్దపల్లి, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ) : అధికారమే లక్ష్యంగా అబద్ధాలను ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అసలు రంగు బయట పడింది. ప్రజల చేతిలో మరోసారి భంగపాటు తప్పడం లేదనే భయంతో కనిపిస్తున్న ఆ పార్టీ నాయకులు తాము రూపొందించిన ఆరు గ్యారంటీల్లో ఉన్న అసలు విషయాలను వెల్లడిస్తున్నారు. ఆరు గ్యారంటీ కార్డుల్లో ఒకటైన ‘రైతు భరోసా’ పథకం కింద రాష్ట్రంలోని రైతుందరికీ ఎకరానికి ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని గ్యారంటీ ఇచ్చింది. ఒక వేళ రైతులు తమ భూములు కౌలుకు ఇచ్చుకుంటే వారికి కూడా ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని, రైతు కూలీలకు కూడా ఏడాదికి రూ.12 వేలు అందిస్తామని కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పేర్కొన్నారు.
ఒక పక్క ఆ కార్డులకు గ్యారంటీ ఎవరనే చర్చ ప్రజల్లో జరుగుతుండగానే ఆ పార్టీ నాయకులు ఆ పథకాల అసలు గుట్టును విప్పి చెప్పుతున్నారు. తాజాగా, రైతు భరోసా కార్డుపై ఒక చానల్ ఇంటర్వ్యూలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అసలు విషయం వెల్లడించారు. భూ యజమానులు తమ భూమిని కౌలుకు ఇచ్చుకుంటే కేవలం కౌలు రైతుకే ఇస్తామని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు భూ యజమానులకు, కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ అసలు రహస్యాన్ని స్పష్టం చేయడంతో రైతులు అవాక్కవుతున్నారు.
ఎన్నికలు ముగియక ముందే ఆ పార్టీ నాయకులు మాట మార్చుతున్న తీరుపై ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇప్పటి వరకు భూ యజమానులు, కౌలు రైతులకు రైతుభరోసా అన్న రేవంత్రెడ్డి కడుపులో ఉన్న విషాన్ని కక్కడంతో అసలు గుట్టు ఇప్పుడే బయట పడిందే నయమైందని రైతులు చర్చించుకుంటున్నారు.
తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి ఒక విజన్తో ముందుకు పోతున్న సీఎం కేసీఆర్ రెండు సార్లు అధికారంలోకి వచ్చారు. వ్యవసాయానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి 24 గంటల కరెంట్ ఇస్తూ పెట్టుబడి కోసం రైతుబంధు పథకాన్ని ప్రవేశ పెట్టి అమలు చేస్తున్నారు. ఇప్పటికే విజయవంతంగా అమలు చేస్తున్న రైతుబంధు పథకం కింద ప్రతి రైతుకూ ఎకరాకు రూ.10 వేల పెట్టుబడి సహాయాన్ని అందిస్తున్నారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మొత్తాన్ని ఎకరాకు రూ.16 వేలకు పెంచుతామని ఈసారి మ్యానిఫెస్టోలో చేర్చారు.
కాంగ్రెస్ రైతుభరోసా కింద ఎకరాకు రూ.15 వేలు అంటే బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో మాత్రం ఒక వెయ్యి ఎక్కువగా ఇస్తామని భరోసా ఇస్తోంది. అయితే, కాంగ్రెస్ మాదిరిగా ఒకటి చెప్పి ఒకటి చేయడం తమకు సాధ్యం కాదని బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. రైతుబంధు అనేది రైతులకే అందిస్తామని స్పష్టంగా చెప్పిన కేసీఆర్ అదే మాటపై ఉండి పథకాన్ని అమలు చేస్తున్నారు.
కాంగ్రెస్ ప్రచారం ప్రారంభంలో ఉన్న మాట చివరి దశలో ఉండడం లేదని, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత అది కూడా ఉంటుందనే గ్యారంటీ లేదనే వాదనలు రైతుల నుంచి వినిపిస్తున్నాయి. మొత్తానికి తమ పార్టీ అమలు చేస్తామన్న రైతుభరోసా పథకంలో దాగిన అసలు రహస్యాన్ని రేవంత్రెడ్డి ఇప్పుడు బయట పెట్టడం మంచిదైందనే చర్చ జరుగుతోంది. ఆ పార్టీకి ఓటు వేస్తే ఉన్న రైతుబంధు కాస్త ఊడిపోయే ప్రమాదం లేకపోలేదని అంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ రూపొందించిన ఆరు గ్యారంటీల్లో దేనిపైనా భరోసా కనిపించడం లేదని ప్రజలు చర్చించుకుంటున్నారు. అసలు ఆ గ్యారంటీ కార్డులకు గ్యారంటీ ఎవరని ప్రశ్నిస్తున్నారు. గతంలో ఇలాంటి అడ్డగోలు హామీలతో మ్యానిఫెస్టో ఇచ్చిన కాంగ్రెస్ను నమ్మని ప్రజలు కర్రుకాల్చి వాతపెట్టినట్లు బీఆర్ఎస్కే అధికారాన్ని కట్టబెట్టారు. మరోసారి అలాంటి అలవిగాని హామీలనే ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారు. వ్యవసాయానికి 24 గంటల కరెంట్ వృథా అని ఇప్పటికే నోరు పారేసుకున్న రేవంత్రెడ్డి మూడు గంటల కరెంటే ఇస్తామని, 10 హెచ్పీ మోటర్లు పెట్టుకుని రైతులు పొలాలు పారించుకోవాలని చెప్పడం రైతుల్లో చర్చకు దారి తీసింది.
ఇప్పుడు ఆయనే మరోసారి రైతుభరోసాపై నోరుజారడంతో రైతులు కాంగ్రెస్ పార్టీని నమ్మేది లేదని అంటున్నారు. కర్నాటక రాష్ట్రంలో ఇవే హామీలతో ఎన్నికల్లోకి వెళ్లిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే అక్కడి పాలనను అస్తవ్యస్తం చేసిందని, ఇక్కడ కూడా అదే పరిస్థితి రావచ్చనే చర్చ జరుగుతోంది. పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసే బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుండడంతో అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చరనే గ్యారంటీ ఏమున్నదని రైతులు ప్రశ్నిస్తున్నారు.
రైతులను నిండా ముంచే పార్టీ కాంగ్రెస్. ఎన్నికల సమయంలో కేవలం ఓట్ల కోసం కల్లబొల్లి మాటలు. అమలుకు నోచుకొని హామీలు ఇస్తారు. వాళ్లు వచ్చేది లేదు..సచ్చేది లేదుకానీ. ఒకవేళ గద్దెనెక్కితే మాత్రం వాళ్ల సొంతలాభమే చూసుకుంటరు. ఇందుకు మన కండ్ల ముందే కనపడుతున్న కర్ణాటక రాష్ట్రమే ఉదహారణ. ఆ రాష్ట్రంలో కూడా ఎన్నికల సమయంలో రైతులకు అనేక హామీలను ఇచ్చారు. కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు కావడం లేదు.
కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టిన పాపానికి నేడు ఆ రాష్ట్రంలోని రైతులు ట్యాంకర్లతో పంటలకు నీళ్లు పెట్టుకొని సాగు చేయాల్సిన దుస్థితి వచ్చింది. కర్ణాటక రైతులను మోసం చేసినట్టే తెలంగాణ ప్రాంత రైతులను కూడా మోసం చేయాలని కాంగ్రెస్ చూస్తున్నది. కాంగ్రెస్ విడుదల చేసిన ఎన్నికల మ్యానిఫెస్టోలో తెలంగాణని రైతులకు, కౌలు రైతులకు రూ. 15వేలు, రైతు కూలీలకు రూ. 12వేలు ప్రతీ ఏడాది జమ చేస్తామని పేర్కొన్నారు.
తాజాగా టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్రెడ్డి ఓ చానెల్ ఇంటర్వ్యూలో మాత్రం మేము కేవలం భూమి యజమానికి లేదా కౌలుదారుడికి ఇద్దరిలో ఒకరికి మాత్రమే రూ. 15వేల జమ చేస్తామని చెప్పడం ఎంత వరకు సమంజసం. అయితే ఎన్నికల ముందే వారి అస్సలు రంగు బయట పడుతుండటంతో తెలంగాణ రైతాంగం అప్రమత్తమవుతున్నది. కాంగ్రెస్ పార్టీ మోస పూరిత హామీలు నమ్మే పరిస్థితుల్లో తెలంగాణ రైతులు లేరు. కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా తగిన గుణ పాఠం చెప్పడం ఖాయం.
-ఎలువాక ఆజయ్, రాజాపూర్, రామగిరి మండలం(మంథని)
రేవంత్రెడ్డి రైతులను ఖచ్చితంగా మోసం చేస్తడు. అధికారంలకు రావడానికి ఎన్నో అబద్ధాలను చెప్తండు. మాకెప్పటిసందో డౌట్ అత్తంది ఆయన తీరు మీద. లాస్ట్కేమో చేత్తడు అనుకున్నం. గని నిన్న వేరే చానళ్ల మాట్లాడుకుంట ఆళ్ల మోసం బయటపెట్టిండు. ప్రచారంలనేమో భూ యజమానులు, కౌలు రైతులకు ఇద్దరికీ రైతు భరోసా కింద అకౌంట్లేత్తం అని చెప్పిండు.
మల్ల నిన్న వేరేటోళ్లతోని మాట్లాడుకుంట కౌలు రైతులకు ఇత్తే భూ యజమానులకు ఇయ్యం, భూ యజమానులకు ఇత్తే కౌలు రైతులకు ఇయ్యం అని మాట మార్తండు. వీళ్లు అధికారంలకు అచ్చేటందుకు ఎన్నో అబద్ధాలు ఆడుతన్రు. గనీ, ప్రజలు ఆలోచించుతున్నరు. ఒక్క మాట మీద నిలబడెటోళ్లకు అధికారం ఇచ్చేటందుకు ప్రజలు సిద్ధం ఉన్నరు. ఎవలేం చెప్పినా రైతులు కేసీఆర్ సారునే నమ్ముతన్రు.
– బేతి శ్రీనివాస్రెడ్డి, రైతు, నుస్తులాపూర్(తిమ్మాపూర్
అసెంబ్లీ ఎన్నికల ముందే కాంగ్రెస్ పార్టీ అసలు రంగు బయటపడ్డది. ఆ పార్టీ నాయకులకు అధికారమే తప్పా ప్రజల సంక్షేమం కాదు. గద్దెనెక్కేందుకే ఆ పార్టీ నాయకులు దొంగ హామీలతో ప్రజలను మోసం చేయాలని కుట్రలు చేస్తున్నరు. ఇందులో భాగంగా ఎన్నికల సమయంలో ప్రజలను మక్కువ చేసుకునేలా సాధ్యం కానీ హామీలను ప్రకటించారు. కాంగ్రెస్ విడుదల చేసిన ఎన్నికల మ్యానిఫెస్టోపై ఆ పార్టీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి రోజుకో మాట మాట్లాడుతున్నడు. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న 24 గంటల కరెంట్ రైతులకు చాలా ఎక్కువ అని, అది దండుగ అని బాహాటంగానే అన్న రేవంత్రెడ్డికి రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది.
దాన్ని కప్పి పుచ్చుకునేందుకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత 24 గంటల కరెంట్ అందిస్తామని మ్యానిఫెస్టోలో పేర్కొన్నారు. ఆ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్రెడ్డి 3 గంటల కరెంట్ సరిపోతుంది అంటాడు.. మళ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోలో మాత్రం 24 గంటల కరెంట్ అందిస్తామని పేర్కొంటారు ఇదేం పద్ధతి. రూ. 15వేల రైతు బంధును ఏడాదికి ఒక్కసారి భూమి యజమానికి, కౌలు రైతుకు అందిస్తామని కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో పేర్కొంటారు.. అదే రైతు బంధుపై రేవంత్రెడ్డి భూమి యజమాని లేదా కౌలుదారుడికి ఎవరికో ఒక్కరికీ మాత్రమే ఇస్తామని అంటున్నాడు. దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం మాత్రమే ప్రజలను ఇలా తప్పుడు హామీలను ఇస్తుదని అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రైతు బంధు మాత్రం గ్యారెంటీగా ఉండదు.
-శేఖర్, లక్కెపూర్, మంథని మండలం(మంథని)
కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల పేరిటి ప్రజలను మోసం చేస్తున్నదని అనుకున్న. కానీ ఎన్నికలు కాకముందే రేవంత్రెడ్డి అసలు రంగు బయటపడ్డది. రైతుబంధు భూ యాజమానికి ఇస్తే. కౌలు రైతు ఇవ్వం. కౌలు రైతుకు ఇస్తే.. యాజమానికి ఇవ్వమని కుండలబద్దలు కొట్టినట్టు చెప్పిండు. ఇంకేముంది కాంగ్రెస్ను నమ్మితే నిండా మునుగుడేనని రైతులకు అర్ధం అయిపోయింది. మొదటి నుంచి కాంగ్రెసోళ్ల హామీలను ఎవరూ నమ్ముత లేరు. కాంగ్రెస్ పాలనలో రైతులు ఆరిగోస పడ్డరు. ఇప్పుడు రూ. 15వేల రైతు బంధు ఇస్తామని రైతులను ఆగంజేసిన్రు. ఇప్పుడేమో వెనుకడుగు వేసిన్రు. రేవంత్ రెడ్డికి ఎవుసం తెలువదు. పూటకో మాట మాట్లాడే ఆయన్ను రైతులు తరిమికొట్టే రోజులు దగ్గరపడ్డాయ్. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్కు తెలంగాణ రైతాంగం ఓటుతో బుద్ధి చెబుతరు.
-ఇనుగాల అనంతరెడ్డి, ఆర్బీఎస్ మండల అధ్యక్షుడు, పెద్దపల్లి. (పెద్దపల్లి)
అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ 62 ఆంశాలతో 42పేజీలతో విడుదల చేసిన మ్యానిఫెస్టో ఉత్తదే. కేవలం ప్రజలను మాయ మాటలను మోసం అధికారంలోకి రావడానికే ఇష్టమొచ్చిన హామీలను కాంగ్రెస్ నాయకులు ప్రకటించారు. రైతు బంధును భూమి యజమానికి, కౌలు దారుడికి ఇస్తామని చెప్పి ఎన్నికలు మరో మూడు రోజులు ఉన్నాయనగా మేము కేవలం భూమి యజమానికి లేదా కౌలు దారుడికి మాత్రమే రూ. 15వేల రైతు బంధును అందిస్తామని రేవంత్రెడ్డి ప్రకటించడం దారుణం. ఈ లెక్కన చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో పేర్కొన్న రైతు కూలీలకు రూ. 12వేల బంధు, 24 గంటల ఉచిత కరెంట్, ధాన్యం కొనుగోళ్లలో తేమ, తరుగు రద్దు చేస్తామనడం, 2లక్షల వరకు రుణమాఫీ,
వడ్డీ లేకుండా రూ. 3లక్షల రుణం వంటి వాటితో తదితర హామీలన్ని ఉత్తవే. కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే కర్ణాటక రైతు కష్టాలు మనకు తప్పవు. ఆ పార్టీ మాయ, మోస పూరిత మాటలు నమ్మి అక్కడి ప్రజలు అష్ట కష్టాలు అనుభవిస్తున్నారు. అలాంటి కష్టాలు మనకు రావద్దంటే నాలాంటి రైతులంతా కాంగ్రెస్కు తగిన బుద్ధి చెప్పాల్సి అవసరం ఎంతైన ఉంది. రైతు బంధు రాజకీయంగా వాడుకొని అధికారంలోకి రావాలని చూస్తున్న రేవంత్రెడ్డి ఈ ఎన్నిల్లో తగిన గుణపాఠం చెబుతాం.
-తోగరి సురేష్, లక్కెపూర్, మంథని మండలం(మంథని)