కరీంనగర్, నవంబర్7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి/పెద్దపల్లి) : ‘ఓటు వజ్రాయుధం. మీ తలరాతను మారుస్తది. భవిష్యత్ను నిర్ణయిస్తది. అందుకే ఆషామాషీగా ఓటు వేయద్దు. విచక్షణతో ఆలోచించి, రాయి ఏదో.. రత్నం ఏదో తెలుసుకొని ఓటేయాలి. నేను మీకు చెప్పేది ఒక్కటే. ఎలక్షన్లు వస్తయి.. పోతయి. ఎవరో ఒకరు పోటీలో ఉంటరు. మంథనిలో బీఆర్ఎస్ నుంచి పుట్ట మధూకర్, పెద్దపల్లిలో దాసరి మనోహర్రెడ్డి ఉన్నరు. ఇతర పార్టీల నుంచి ఎల్లయ్యనో.. పుల్లయ్యనో ఉంటరు. ఎవరో ఒకరు గెలుస్తరు. ప్రభుత్వం ఏర్పడుతది. అది ముఖ్యం కాదు. పోటీలో ఉన్న వ్యక్తి గుణగణాలు చూడాలి. తర్వాత వాళ్ల వెనుక ఉన్న ఆ పార్టీ చరిత్ర తెలుసుకోవాలి. ఇంతకుముందు ప్రజలకు మేలు జరిగే పనులు ఏమైనా చేసిందా..? రైతులు, వివిధ సబ్బండవర్గాల అభ్యున్నతికి పాటుపడిందా..? ఆలోచించాలి. మీ ఊళ్లో, బస్తీలో చర్చ జరగాలి. అప్పుడే ప్రజలు గెలవడం స్టార్ట్ అయితది’ అని బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ప్రజలకు దిశానిర్దేశం చేశారు. మంథని, పెద్దపల్లిలో మంగళవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలకు హాజరై మాట్లాడారు. ఆయాచోట్ల అశేషంగా హాజరైన జనవాహినిని ఉద్దేశించి, సుదీర్ఘంగా ప్రసంగించారు. ఓవైపు ఓటు హక్కు విలువను తెలియజేస్తూనే.. మరోవైపు ఆగమై ఓటు వస్తే జరిగే పరిణామాలను వివరించారు. కాంగ్రెస్ నాయకులు 24గంటల కరెంట్, రైతుబంధు, ధరణి వద్దంటున్నారని, అవి కావాలో.. వద్దో.. మీరే ఆలోచించాలని సూచించారు. నేను ఇక్కడ చెప్పే ముచ్చట్లపై మీరు గ్రామాల్లోకి వెళ్లి చర్చ పెట్టాలని, నిజమేదో అబద్ధమేదో తెలుసుకోవాలని సూచించారు. మంథనిలో పుట్ట మధును గెలిపిస్తే వెయ్యి కోట్లతో అభివృద్ధి చేస్తానని, పెద్దపల్లిలో దాసరి మనోహర్రెడిని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపిస్తే ప్రభుత్వం వచ్చిన నెలరోజుల్లోనే అడిగినవన్నీ చేస్తానని హామీ ఇచ్చారు.
ఎన్నికలవేళ ఆగం కావొద్దని, ఆలోచించి ఓటు వేయాలని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. ఓటు తలరాతను మారుస్తుందని, ఐదేండ్ల భవిష్యత్ను నిర్ణయిస్తుందని చెప్పారు. ఆశామాషీగా అలవోకగా, డబ్బులు ఇచ్చారని ఓటు వేయద్దని, విచక్షణతో ఆలోచించి ఓటు వినియోగించుకోవాలని సూచించారు. కాంగ్రెస్ నాయకులు 24 గంటల కరెంట్, రైతుబంధు, ధరణి వద్దంటున్నారని, అవి కావాలో.. వద్దో.. మీరే ఆలోచించాలని కోరారు. నేను ఇక్కడ చెప్పే ముచ్చట్లన్నీ మీరు గ్రామాల్లోకి వెళ్లి చర్చ పెట్టాలని, నిజమేదో.. అబద్ధమేదో తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మంథని, పెద్దపల్లిలో మంగళవారం ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలకు ఆయన హాజరయ్యారు. ఆయాచోట్ల అశేషంగా తరలివచ్చిన జనవాహినిని ఉద్దేశించి సుధీర్ఘంగా ప్రసంగించారు. ఓవైపు ప్రజాస్వామ్యంలో ఓటు విలువను తెలియజెబుతూనే.. మరోవైపు ఆగమై ఓటు వేస్తే జరిగే పరిణామాలను ప్రజలకు పూస గుచ్చినట్లుగా వివరించారు.
ముఖ్యంగా ఎన్నికల్లో అన్నీ పార్టీలు తమ తమ అభ్యర్థులను నిలబెడుతాయని, అయితే తమ్ముడు, అన్న చెప్పిండని ఎవరికి పడితే వాళ్లకు ఓటు వేయవద్దని సూచించారు. బరిలో నిలిచిన వ్యక్తితోపాటు పోటీచేసే వ్యక్తిని నిలిపిన పార్టీ గురించి ఆలోచించాలన్నారు. సదరు పార్టీ ఇప్పటివరకు ప్రజలకు మేలు జరిగే పనులేమైనా చేసిందా..? సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిందా..? రైతులకు, సబ్బంబవర్గాల అభివృద్ధికోసం పథకాలు తెచ్చిందా..? వంటి అంశాలను ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాదు, ప్రస్తుతం బీఆర్ఎస్ అమలు చేస్తున్న రైతు బంధు, రైతు బీమా, ధరణి, ధాన్యం కొనుగోలు, 24 గంటల ఉచిత విద్యుత్, దళిత బంధు, బీసీ బంధు, కేసీఆర్ కిట్, ఇంటింటికీ మంచినీరు, శాంతిభద్రతలు, కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ వంటి పథకాలు దేశంలో ఎక్కడైనా అమలవుతున్నాయా..? లేదా? అన్నది చర్చపెట్టి ఓటువేయాలని కోరారు. నిజానికి ఇంకా మన ప్రజాస్వామ్యం పరిణితి చెందాల్సి ఉందని, పనిచేసిన వారిని గెలిపించే పరిణితి ప్రజలకు రావాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుడే ప్రజలు ఎన్నికల్లో గెలిచినట్లు అవుతుందని ప్రజలకు అర్థమయ్యేలా వివరించారు.
ఇంకోవైపు మంథని, పెద్దపల్లి నియోజకవర్గాలకు సంబంధించి అనేక స్థానిక అంశాలను ప్రస్తావించారు. మంథని నియోజకవర్గం నుంచి అనేక మంది గెలిచారని, కానీ పుట్టమధు హయాంలో జరిగిన అభివృద్ధి ఎవరైనా చేశారా..? చెప్పాలంటూ ప్రశ్నించారు. ఇక్కడి ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి మూడుసార్లు గెలిచినా ఇక్కడ చేసింది గుండు సున్నా అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ మాయలో పడితే నిండా మునుగుతామని హెచ్చరించారు. నిజానికి బీసీ బిడ్డలకు అవకాశం వచ్చేదే తక్కువ అని, అవకాశం వచ్చిన చోట ఎందుకు ఐక్యంగా ఉండి గెలిపించుకోలేకపోతున్నారంటూ ప్రశ్నించారు. ఈసారి పుట్టమధును మంచి మెజార్టీతో గెలిపిస్తే మంథని నియోజకవర్గంలో ఒకరోజు ఉండడమే, వేయికోట్ల ప్రత్యేక నిధులు కేటాయించి అన్ని సమస్యలనూ పరిష్కరించుకుందామని హామీ ఇచ్చారు. అలాగే పెద్దపల్లి వేదికపై నాటి ఉద్యమ సమయంలో జరిగిన అనేక సంఘటలను గుర్తు చేశారు. సాగు, తాగునీటికి పెద్దపల్లి ఎలా తిప్పలు పడిందో వివరిస్తూనే.. ఆ సమస్యలను పరిష్కరించడానికి మనోహర్రెడ్డి అహర్నశలు కృషి చేశారని చెప్పుకొచ్చారు.
మనోహర్రెడ్డి ఏనాడు వ్యక్తిగత పనులు అడుగలేదని, ఎంతసేపు నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం వెంటపడి నిధులు తెచ్చుకొని అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు. ఈ ఎన్నికల్లో లక్ష మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఆయాచోట్ల సభలో ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేతకాని, మండలి చీఫ్ విప్ తానిపర్తి భాను ప్రసాదరావు, విప్ బాల్క సుమన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, జయశంకర్ భూపాలపల్లి జడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణి, మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరకొండ మధుసూధనాచారి, సివిల్ వైప్లెస్ కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్సింగ్, రాష్ట్ర పోలీసు హౌసింగ్ బోర్డు చైర్మన్ కోలేటి దామోదర్, టీఎస్ఐడీసీ మాజీ చైర్మన్ ఈద శంకర్రెడ్డి, రాష్ట్ర నాయకులు బొంతు రామ్మోహన్, జక్కు రాకేశ్, చింతలఫణి సత్యనారాయణరెడ్డి, మూల విజయారెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ మండిగ రేణుక, పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్ మున్సిపల్ చైర్పర్సన్లు దాసరి మమతారెడ్డి, పుట్ట శైలజ, ముత్యం సునీత నాయకులు తదితరులు పాల్గొన్నారు.
పుట్ట మధును గెలిపిస్తే.. వెయ్యి కోట్లు ఇస్తా ; మంథని సభలో ముఖ్యమంత్రి కేసీఆర్
‘మంథని ఎమ్మెల్యే అభ్యర్థిగా మూడోసారి బీసీ బిడ్డ పుట్ట మధూకర్కు అవకాశం ఇచ్చిన. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఐక్యతను చాటాలి. ఓటేసి దీవించండి. నేను వెయ్యి కోట్ల ప్రత్యేక నిధులు ఇచ్చి మంథని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్త. రోజంతా ఇక్కడే ఉండి నియోజకవర్గంలోని అన్ని మండలాల నాయకులతో ప్రత్యేకంగా సమావేశమై ఏం కావోలో ఆలోచించి అన్నీ సమకూర్చుదాం’ అని బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. మంథని ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. ‘బీసీ బిడ్డకు ఇక్కడ అవకాశం ఇచ్చిన. ఈ విషయంలో నియోజకవర్గంలోని బీసీ బిడ్డలతో పంచాయితీ పెట్టుకుంట. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ బిడ్డలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్న. మీ చైతన్యాన్ని చూపాలి’ అని పిలుపునిచ్చారు. మధూకర్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే పీవీ హయాంలో మొదలు పెట్టి పక్కకు పెట్టిన 66 గ్రామాలను కలిపే 108 కిలో మీటర్ల రింగు రోడ్డు, 20 బ్రిడ్జిలను పట్టుబట్టి పూర్తి చేయించాడని గుర్తు చేశారు.
అట్లాంటి మధూకర్ను గత ఎన్నికల్లో ఓడగొట్టి, ‘మీరు ఆయన పట్టు బడితిరి’ అంటూ చలోక్తి విసిరారు. నియోజకవర్గ ప్రజలు మధును గెలిపిస్తే తాను ఒక కానుక ఇస్తానని, మంథని అభివృద్ధి కోసం రూ. వెయ్యి కోట్లు కేటాయిస్తానని ప్రకటించారు. తాను ముఖ్యమంత్రిగా.. ఆయన ఎమ్మెల్యేగా నియోజకవర్గ ప్రజలందరితో ఒకరోజు ఉంటానని, ఈ ప్రాంత సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మంథనిలో ఎమ్మెల్యేగా పుట్ట మధూకర్ను గెలిపించి ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామంటున్న కాంగ్రెస్ను బంగాళాఖాతంలో కలుపాలని కోరారు. ఇకడ పుట్టి పెరిగిన వ్యక్తిగా ప్రజల కష్టాలు పుట్ట మధుకు బాగా తెలుసన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధిలో వెనుకబడినా తన దృష్టికి తీసుకొచ్చాడని, పంకెన, పలిమెల, మోదేడు గ్రామాల అభివృద్ధికి పట్టు బట్టి నిధులను తీసుకువచ్చాడని గుర్తుచేశారు. ఇక్కడి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇప్పటికే నాలుగుసార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశారని, ఆయన తండ్రి కూడా ఎమ్మెల్యేగా.. స్పీకర్గా పనిచేశారని, అయినా మంథని నియోజకవర్గ ప్రజల కష్టాలను తీర్చింది, కన్నీళ్లను తుడించిది, బాధలను దూరం చేసింది మాత్రం మధూకరేనని స్పష్టం చేశారు.
ఈ మట్టిలో పుట్టిన బిడ్డ ఎమ్మెల్యే అయినంకనే ఈ ప్రాంతం వెలుగులు చూసిందన్నారు. ముడ్డికి మన్నంటి పనిజేసేటోడే సిపాయని, అందుబాటులో ఉండి పనిచేసేటోడే పుట్ట మధూకర్ అని చమత్కరించారు. ‘టిక్టాక్గా తయారై హైదరాబాద్కు పరిమితమయ్యే ఎమ్మెల్యే కావాలా..? మీ కోసం నిత్యం పనిచేసే పుట్ట మధూకర్ కావాలో? ప్రజలు ఆలోచించాలని సూచించారు. మధు ఎమ్మెల్యేగా గెలిచినంక నెలలోనే మంథని మండలం గుంజపడుగు, బోర్లగూడెం గ్రామాలు కేంద్రంగా కొత్త మండలాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్నికల్లో గెలిచి కనబడకుండా పోయే నాయకులు కాదు, గెలిచినా.. ఓడినా మీ మధ్యనే ఉండే మధూకర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘మన పార్టీ ప్రజా ప్రతినిధులను నాయకులను కాంగ్రెస్ పార్టీ వాళ్లు సంతలో పశువులను కొన్నట్టు కొంటున్నరని పుట్ట మధు అధైర్య పడుతున్నడు. పుట్ట మధు రంది పడకు. పోయేటోడు పోతడు.. ఉండేటోడు ఉంటడు. అది వట్టి ముచ్చటకాదు. వాళ్లు పోతే ఆ ఊళ్లెనే రియాక్షన్ ఉంటది. వ్యతిరేకత వస్తది. పోయినసారి జరిగిన నష్టం వాళ్లకు తెలిసింది. నువ్వు ఉంటే ఎంత లాభం ఉంటదో వాళ్లకు తెలుసు. ఎవరు ఎన్ని కథలు పడ్డా. గ్యారెంటీగా మళ్లా బీఆర్ఎస్ సర్కారే వస్తది’ అని అన్నారు. ఏతా వాతా ఎటు చూసుకున్నా మంథని ఎమ్మెల్యేగా పుట్ట మధూకర్ గెలిస్తేనే మంథని నియోజకవర్గం అభివృద్ధి అవుతుందని చెప్పారు. ‘ఎందుకంటే నాతో సహా రాష్ట్ర కేబినెట్ మొత్తం తెలిసినోడు ఆయన ఏ పని ఉన్నా చేసుకొని వస్తడు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తడు. రాష్ట్రంల ఎట్లా బీఆర్ఎస్ సర్కారే వస్తది’ అని ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడ కూడా బీఆర్ఎస్ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలిపించాలని, మరోసారి మంథని నియోజకవర్గ ప్రజలు పొరపాటున కాంగ్రెస్కు ఓటేసి మోసపోవద్దని సూచించారు.
దాసరిని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించండి ; పెద్దపల్లి సభలో ముఖ్యమంత్రి కేసీఆర్
ఇతర పార్టీల్లోని మోస పూరితమైన వ్యక్తుల్లా మీ ఎమ్మెల్యే కాదని, నిఖార్సైన నిస్వార్థపరుడైన వ్యక్తి దాసరి మనోహర్రెడ్డి అని ముఖ్యమంత్రి కేసీఆర్ కొనియాడారు. విద్యావంతుడు, దార్శనికుడు, పెద్దపల్లి జిల్లా కావాలని పట్టుపట్టి సాధించుకున్న వ్యక్తి దాసరి మనోహర్రెడ్డి అని, నియోజకవర్గ ప్రజలు లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. పెద్దపల్లి ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. ఎమ్మెల్యే దాసరి చొరవ వల్లే పెద్దపల్లిని జిల్లా కేంద్రం చేశామని, జిల్లా ఏర్పాటు కోసం ఆయన తన వెంట పడ్డారని గుర్తు చేశారు. 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన దాసరి మనోహర్రెడ్డి తను సొంతంగా ముప్పై నలభై లక్షలు పెట్టి నియోజకవర్గంలోని ఇంటింటికీ ఐదు రకాల పండ్ల మొక్కలను ఉచితంగా అందజేశారని, హరిత ఎమ్మెల్యేగా నిలిచారని ప్రశంసించారు.
దాసరి మనోహర్రెడ్డి ఎప్పుడు తన వద్దకు వచ్చినా.. ఏనాడూ తన వ్యక్తిగత పనుల కోసం అడుగలేదని, నియోజకవర్గ అభివృద్ధి కోసమే నిధులు అడిగి తెచ్చుకున్నారని, అందులో భాగంగానే అనేక సమస్యలు పరిష్కరించుకోగలిగారని అభినందించారు. ప్రధానంగా చివరి ఆయకట్టుకు నీరందడం లేదంటూ పలుసార్లు తన దృష్టికి తెచ్చి, ఆ సమస్య పరిష్కారమయ్యేంత వరకూ వెంటపడ్డాడని గుర్తు చేశారు. పెద్దపల్లి నియోజకవర్గ కేంద్రంలో రెండు మూడు బావులతోనే దాహం తీర్చుకునేదని, కానీ, బీఆర్ఎస్ సర్కార్ వచ్చిన తర్వాత హెచ్ఎండీఏకు వెళ్లే గోదావరి లింక్ను మల్చుకొని తాగునీటి గోస తీర్చుకున్నామన్నారు.
నియోకవర్గంలోని ఓదెల, కాల్వశ్రీరాంఫూర్ మండలాల చివరి ఆయకట్టు వరకూ సాగునీరు అందేది కాదని, అలాంటిది ఏ మాత్రం రైతులకు ఇబ్బంది లేకుంటా సాగునీటి గోసను తీర్చామన్నారు. నియోకవర్గంలో వ్యవసాయాన్ని స్థిరీకరించామన్నారు. మీ ఎమ్మెల్యే అత్యంత నిస్వార్థపరుడని, ఏదైనా ఉన్నది ఉన్నట్లు చెప్పడం ఆయనకు అలవాటని, ఇతర వ్యక్తుల మాదిరిగా నాటకాలు వేయడం ఆయనకు సాధ్యం కాదన్నారు. అభివృద్ధి కోసం నిర్విరామంగా శ్రమించడం, ప్రజలతో మమేకమై.. సమస్యలను పరిష్కరించుకోవడం, రైతుల సంక్షేమం కోసం ఆలోచించడమే ఆయన విధిగా పనిచేస్తారని కొనియాడారు. అందుకే దాసరి మనోహర్రెడ్డిని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తద్వారా నియోజకవర్గ అభివృద్ధి మరింతగా ముందుకు వెళ్తుందన్నారు. దాసరి మనోహర్రెడ్డి అడిగిన కోరికలు పెద్దవి కావని, ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే ఆయన అడిగినవన్నీ చేస్తానని, కొత్త మండలాలు, ఇతర విజ్ఞప్తులు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సభకు తరలివచ్చిన జనాన్ని చూస్తే పెద్దపల్లిలో విజయం తథ్యం అనే విషయం స్పష్టమవుతున్నదని, అయితే, లక్ష మెజార్టీతో గెలిపించాలని కోరారు.
మీ మట్టిలో పుట్టిన బిడ్డను..
నేను బలహీన వర్గాల బిడ్డను. సీఎం కేసీఆర్ సహకారంతో ఇంతటి స్థాయికి చేరుకున్న. మూడోసారి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన్రు. గోదావరి సాక్షిగా చెబుతున్నా.. నేను మీ మట్టిలో పుట్టిన బిడ్డను. ఈ మట్టిలో పెరిగిన. ఇక్కడే మరణిస్త. ఇక్కడ గొప్పగొప్ప నాయకులు పాలించిన్రు. కానీ ఏమీ చేయలె. ప్రాజెక్టులు కడతమని చెప్పి పైపులు తెచ్చి రోడ్ల మీద వేసిన్రు. మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇచ్చి జేబులు నింపుకున్నరు. వానకాలం పెద్దంపేట వాగు పొంగితే కడుపుతో ఉన్న మహిళలు మంథనికి వచ్చే పరిస్థితి లేకుంటే. ఇక్కడే పసిద్ధి అయిటోళ్లు. పేగును కట్ చేసేందుకు కత్తెర లేకుండే. రాళ్లతోటి పేగులు కట్ చేసే పరిస్థితి ఉండే. ఇది కాంగ్రెస్సోళ్ల పాలన. నన్ను గతంలో ఎమ్మెల్యేగా గెలిపిస్తే రూ. 25 కోట్లతో ఓడేడు బ్రిడ్జిని నిర్మించిన. మంథని నుంచి పెద్దంపేటకు రోడ్డు వేయించిన. అంత మంచిగనే ఉన్నది. ఇప్పుడు ఎన్నిలప్పుడు నియోజకవర్గానికి వస్తున్న ఎమ్మెల్యే ఇక్కడి పైసలు పెట్టి నాయకులను కొంటున్నడు. కానీ, సీఎం సారు జెరా మాకు కొన్ని పనులు జేసిపెట్టాలి. నియోజకవర్గం నుంచి భూపాలపల్లి జిల్లాకు పోయేందుకు రోడ్లు కావాలి. మహదేవ్పూర్ ప్రాంతానికి చెందిన గిరిజన బిడ్డలు మాడా పరిధిలో ఉన్నామా? లేదా ఐటీడీఏ కింద ఉన్నామో తెలియక ఆగమైతున్నరు. వారికి దయతలిచి ఐటీడీఏ ఏర్పాటు చేయాలి. ఇప్పటికే రెండు మూడు మండలాలు ఏర్పాటు చేసిన్రు. ఇప్పుడు మంథని మండలంలోని గుంజపడుగు, మహాముత్తారం మండలంలోని బోర్నపల్లిని మండలాలు జేయాలి. మంథనిలో రెండు బీసీ గురుకులాలు ఏర్పాటు చేయాలి. గోదావరి తీరంలోని సుందిళ్ల, అన్నారం బరాజ్ల ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేయాలి.
– మంథని సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్
అభివృద్ధి చేసిన.. ఆశీర్వదించండి
ముఖ్యమంత్రి కేసీఆర్కు పెద్దపల్లి అంటే ఎంతో ప్రేమ. తొమ్మిదన్నరేండ్లలో ఆయన ఆశీర్వాదంతో నియోజకవర్గాన్ని సుమారు 10వేల కోట్లతో అభివృద్ధి చేసిన. అన్ని రంగాల్లో ముందు నిలిపిన. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్కు పలు విజ్ఞప్తులు చేయదలుచుకున్న. ఆయన పెద్దపల్లి పట్టణంలో బస్డిపోను ఏర్పాటు చేయాలని కోరుతున్న. మండలాలు దూరంగా విస్తరించి ఉన్నందునా విభజించాలి. కొత్తగా పెద్దపల్లి రూరల్, గర్రెపల్లి, కొలనూర్ మండలాలను ఏర్పాటు చేయాలి. విద్యార్థులు, నిరుద్యోగుల కోసం అంబేద్కర్ స్టడీ సర్కిల్ మంజూరు ఇవ్వాలని విజ్ఞప్తి. పట్టణ ప్రజల వినోదం కోసం కన్వెన్షన్ సెంటర్లు, పార్కులు ఏర్పాటు చేయాలి. జర్నలిస్టులకు నివేశన స్థలాలు ఇవ్వాలి. న్యాయవాదుల కోసం జిల్లా కోర్టు సముదాయ భవనాన్ని నిర్మించాలి. ఆటోనగర్ ఏర్పాటుకు నిధులు కేటాయించాలి. ఎలిగేడులో జూనియర్ కాలేజీ, పోలీస్స్టేషన్ ఏర్పాటు చేయాలి. ఓదెల మల్లికార్జునస్వామి ఆలయం అభివృద్ధికి 50కోట్లు ఇవ్వాలి. కూనారంలో గతేడాది వ్యవసాయ కాలజీ ఇచ్చారు సంతోషం. ఇక్కడ ఈ విద్యాసంవత్సరం నుంచి తరగతులు ప్రారంభించాలి, పారిశ్రామిక ప్రాంతమైన రామగుండంలో మెడికల్ కాలజీ ఏర్పాటు చేశారు. ఎంతో సంతోషంగా ఉన్నది. అట్లనే జిల్లా కేంద్రమైన పెద్దపల్లిలో కూడా మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని కోరుతున్న. ఇక్కడికి నలుమూలల నుంచి పెద్దసంఖ్యలో రైతులు, మహిళలు, యువకులు తరలివచ్చిన్రు. మీరంతా కారు గుర్తుకు ఓటేసి నన్ను మళ్లీ గెలిపించాలి.
– పెద్దపల్లి ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి మనోహర్రెడ్డి