కలెక్టరేట్, జూలై 21: వివిధ కారణాలతో మరణించిన ప్రభుత్వోద్యోగుల కుటుంబాల పిల్లలకు ఉద్యోగాలివ్వాలని ప్రభుత్వం దృష్టి పెట్టింది. అర్హులైన వారికి ఉద్యోగాలి వ్వాలని గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి కరీంనగర్లో 31 మందికి జాబ్స్ దక్కనుండగా ఆయా కుటుంబాల్లో హర్షంవ్యక్తమవుతున్నది. ఈ మేరకు శుక్రవారం లబ్ధిదారుల కుటుంబీకులు సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి అభిమానం చాటుకున్నారు. ఉమ్మడి పాలనలో అప్పటి ప్రభుత్వాలు కారుణ్య నియామకాలపై నిర్లక్ష్యం చేశారు. ఫలితంగా వందలాదిమంది ఆఫీసులు, అధికారుల చుట్టూ విసిగివేసారిపోయారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాలపై దృష్టి పెట్టింది. ఈ మేరకు అర్హులకు ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయంచి ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ దిశగా ఉమ్మడి కరీంనగర్లో అర్హులకు ఉద్యోగాలిచ్చేందుకు యంత్రాంగం చర్యలు చేపట్టింది.
వినోద్కు కృతజ్ఞతలు..
కారుణ్య నియామకాల కోసం కొంతకాలం కిందట పలువురు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. పలుమార్లు ఆయన ఈ సమస్యపై చర్చించారు. ఈ క్రమంలో సర్కారు సానుకూల నిర్ణయం తీసుకున్నది. అర్హులకు కారుణ్య నియామకాల కింద జాబ్స్ ఇవ్వనున్నది. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ లబ్ధిదారుల కుటుంబాలు శుక్రవారం రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ కార్యాలయం వద్ద సీఎం కేసీఆర్, ఆయన చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. తమ సమస్య పరిష్కారానికి కృషి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, చొరవచూపిన వినోద్కు కృతజ్ఞతలు తెలిపారు. బతికినంతకాలం రుణపడి ఉంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మెండి చంద్రశేఖర్, దూలం సంపత్గౌడ్, గందె కల్పన, రుద్ర రాధ, సరస్వతి, రే ణుక, రజని, పుష్పలత, ఆరెపల్లి సాయికృష్ణ, సంగు వేణు, మిలుకుల ప్రభాకర్, సముద్రాల ఓంకార్, అనిల్, కావేరి వెంకటేశ్, సాయి, కారుణ్య నియామకాల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
వినోద్ సార్ కృషితోనే ఉద్యోగం
సిరిసిల్ల జిల్లా కోనరావుపేటలో కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న తన భర్త అనారోగ్యంతో మరణించాడు. మూడేళ్ల కొడుకు, అత్తమామల పోషణ భారం తనపై పడ్డది. కారుణ్య నియామకం కోసం అధికారుల చుట్టు తిరిగినా పట్టించుకోలేదు. వినోద్ సార్ను కలిసిన తర్వాత న్యాయం జరిగింది. ఆయన సీఎం కేసీఆర్ సార్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేశారు. ఈ సర్కారు మేలును మరువబోం.
– దివ్య, మరణించిన పంచాయతీ కార్యదర్శి జగదీశ్ సతీమణి
మా కుటుంబంలో వెలగులు నింపిన్రు..
పంచాయితీ కార్యదర్శిగా ఉద్యోగం చేస్తున్న మా తండ్రి శ్రీనివాస్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. కారుణ్య నియామకం కోసం రెండేళ్లుగా ఎదురుచూస్తున్న. ఇప్పుడు సీఎం కేసీఆర్ సార్ ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం ఆనందంగా ఉన్నది. ఈ సర్కారు మాలాంటి బాధిత కుటుంబాల్లో వెలుగులు నింపింది. బతికింత కాలం ఈ సర్కారు మేలును మరిచిపోం.
– వినోద్, కల్లెపల్లి, (బెజ్జెంకి)
సర్కారు మేలును మరువం..
ఆయూష్ విభాగంలో స్వీపర్ కమ్ స్కావెంజర్గా పనిచేసిన తన తండ్రి మరణించగా, ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నా. అయితే అధికారులు ఎవరూ స్పందించలేదు. నామిత్రుడితో కలిసి వినోద్ సార్ వద్దకు వచ్చి సమస్యను చెప్పిన. ఆయన వెంటనే స్పందించిండు. సీఎం సార్ దృష్టికి తీసుకెళ్లి ఉద్యోగాలు ఇప్పించేందుకు కృషి చేసిండు. మేలు చేసిన సర్కారును జీవితంలో మరిచిపోలేను..
– ఎండీ.ముఫాసిల్ తవక్కల్, కరీంనగర్
వినోద్సార్ కృషితోనే జీవో..
తెలంగాణ సర్కారు అన్ని వర్గాలకు మేలు చేస్తున్నది. ఈ దిశగా ఉద్యోగం చేసే ఇంటిపెద్ద మరణించి కారుణ్య ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి సర్కారు తీపి కబురు అందించింది. ఉమ్మడి జిల్లాలోని పలువురు వినోద్ సార్ వద్దకు వచ్చి విన్నవించారు. ఆయన సీఎం కేసీఆర్తో మాట్లాడి జీవో జారీ చేయించారు.
– నాగరాజు, బీఆర్ఎస్ నాయకుడు, కరీంనగర్
సర్కారుకు రుణపడి ఉంటం
కారుణ్య నియామకాల కోసం వేచిచూస్తున్న తమకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఇందుకు వినోద్ కుమార్ సార్ సహకారం మరువలేనిది. తమ బాధలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించారు. ఈ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. – శ్వేత, ధర్మపురి, జగిత్యాల జిల్లా